ఖిలావరంగల్, జూన్ 10: తెలంగాణ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అందిస్తున్న పాలన యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా శనివారం శివనగర్లోని సాయి కన్వెన్షన్ హాల్లో సుపరిపాలన దినోత్సవాన్ని కలెక్టర్ పీ ప్రావీణ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దితోపాటు కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్లు శ్రీవత్స కోట, అశ్విని తానాజీ వాకడే, ఆర్డీవో మహేందర్జీ జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ సుపరిపాలన దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకోవడమే లక్ష్యమన్నారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు, అస్తిత్వాన్ని కాపాడుకోవాలన్న ఆకాంక్షతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. జిల్లాల పునర్విభజన సాహసోపేత నిర్ణయమన్నారు.
చిన్న జిల్లాలు ఏర్పడడం వల్ల ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు దగ్గరవుతున్నాయని ఎమ్మెల్యే పెద్ది అన్నారు. పసిబిడ్డ నుంచి కురువృద్ధుల వరకూ సంక్షేమ పథకాలను సకాలంలో అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. సంక్షేమ ఫలాలను కూడా పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా సాధ్యం కాని అభివృద్ధి కేవలం పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో సాధ్యమైందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో అనేక ఐటీ పరిశ్రమలు తెలంగాణకు వచ్చాయన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం వైద్య రంగంలో ముందుందన్నారు. కరోనాను కట్టడి చేస్తూనే ప్రపంచానికి వ్యాక్సిన్ అందజేసిన ఘనత తెలంగాణ రాష్ర్టానికి దక్కిందని గుర్తుచేశారు. అలాగే, ఐదేళ్ల క్రితం నర్సంపేట ఇరిగేషన్ సర్క్యూట్లో గీసిన గీత వెంట నేడు గోదావరితల్లి కదలి వచ్చి రైతుల పాదాలను తడిపిందన్నారు. నర్సంపేటలో పైపుల ద్వారా గ్యాస్ను ఇంటింటికీ సరఫరా చేసే పథకానికి శ్రీకారం చుట్టామని, ఇదే తరహాలో వరంగల్లో కూడా చేపట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు.
తెలంగాణ రాష్ట్ర పరిపాలన విభాగంలో ఎన్నో మార్పులు వచ్చాయని కలెక్టర్ పీ ప్రావీణ్య అన్నారు. ఈ గవర్నెర్స్ కోసం కావాల్సిన పారదర్శకత, వికేంద్రీకరణ, స్టెంతనంగ్ ఆఫ్ హ్యూమన్ రీసోర్సెస్.. ఈ మూడు అంశాల్లో రాష్ట్రంలో చాలా మార్పులు వచ్చాయని వివరించారు. వికేంద్రీకరణలో భాగంగా వరంగల్ జిల్లా 13 మండలాలతో ఏర్పడిందన్నారు. ఒకప్పుడు వరంగల్ ఉమ్మడి జిల్లాలో సుమారు 60 మండలాలు ఉండేవని, ఫలితంగా అధికారులు ఏ శాఖకు చెందిన వారెవరో అంత త్వరగా తెలిసేది కాదన్నారు. చిన్న జిల్లాలు కావడం వల్ల ప్రతి సమస్యను సులువుగా పరిష్కరించుకునే వీలు కలుగుతున్నదన్నారు. అలాగే, జిల్లాలో 124 గ్రామ పంచాయతీలు, వర్ధన్నపేట మున్సిపాలిటీని ఏర్పాటు చేసుకోగలిగామన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల చాలా మంది అధికారులకు పదోన్నతులు లభించాయన్నారు. ప్రతి శాఖలో ఉద్యోగుల సంఖ్య పెరిగిందన్నారు. పారదర్శకత అంశంలో చూస్తే.. జిల్లాలో 110 మీసేవ కేంద్రాలు ఉన్నాయని, వీటి ద్వారా రోజుకు సమారు 150 దరఖాస్తులు వస్తున్నాయన్నారు. సమస్యలపై దరఖాస్తు ఇచ్చేందుకు ఒకప్పుడు కలెక్టరేట్కు నెక్కొండ లాంటి దూర ప్రాంతాల నుంచి రావాలంటే చాలా రోజులు పట్టేదన్నారు. ఈ రోజు నిర్ధిష్టమైన సమయంలో అన్ని రకాల సర్టిఫికెట్లు పొందుతున్నారన్నారు. జిల్లాలో ప్రతి శాఖ ద్వారా అమలుపరుస్తున్న పథకాలు మంచి పరిణామాలు సాధిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.