నర్సంపేట, ఏప్రిల్ 22: ముస్లిం మైనార్టీల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. రంజాన్ సందర్భంగా శనివారం పట్టణంలోని ఈద్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పెద్ది హాజరై మాట్లాడారు. ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు ముగించుకుని రంజాన్ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆధ్యాత్మిక చింతన, నియమనిష్టలతో నెలరోజులపాటు ఉపవాస దీక్షలు చేపట్టి అల్లా నామస్మరణతో గడిపే జీవన విధానం భగవంతుడిపై వారికి ఉన్న విశ్వాసాన్ని తెలయజేస్తుందన్నారు. అన్ని మతాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలను గౌరవిస్తూ బీఆర్ఎస్ పాలన అందిస్తున్నదన్నారు. ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి అనేక పథకాలకు సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారన్నారు. ధనిక, పేద తేడా లేకుండా పండుగలను అందరూ సమానంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏటా కానుకలు అందజేస్తున్నదని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్లే ఈ అవకాశం వచ్చిందన్నారు.
ముస్లింలకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ముస్లింలకు కమ్యూనిటీ భవనాలు, షాదీఖానలు నిర్మించేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయిస్తున్నానని చెప్పారు. నర్సంపేటలో షాదీఖాన భవన నిర్మాణానికి రూ. కోటి నిధులు మంజూరు చేయించానన్నారు. వచ్చే ఎన్నికల్లోగా ఈ భవన నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. దీనికి అల్లా ఆశీస్సులు కావాలని కోరారు. ప్రజలందరూ ఐక్యతతో ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గంటి రజినీకిషన్, బీఆర్ఎస్ నాయకులు రాయిడి రవీందరెడ్డి, డాక్టర్ లెక్కల విద్యాసాగర్రెడ్డి, నల్లా మనోహర్రెడ్డి, పాషా, ఇర్ఫాన్, యాకూబ్, రఫి పాల్గొన్నారు.