ఖానాపురం, సెప్టెంబర్ 12: గ్రామీణ ప్రాంత మహిళలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి, వారికి పూర్తిస్థాయి వైద్యం అందించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకే రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన మహిళా ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతాయన్నారు. కొన్ని రకాల వ్యాధులపై గ్రామీణ ప్రాంత మహిళలకు సరైన అవగాహన లేదన్నారు. దీంతో ఎవరికీ చెప్పుకోకపోవడంతో వ్యాధి ముదిరి కొందరు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు చైతన్యవంతులై ఆరోగ్య సమస్యలను బయటకు చెప్పుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
మహిళలు ప్రధానంగా గర్భాశయ, రొమ్ము, నోటి క్యాన్సర్ల బారిన పడుతున్నారన్నారు. వాటిని ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తే నివారణ సాధ్యమేనన్నారు. మహిళా ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు ప్రధాన ఉద్దేశం కూడా మహిళలను క్యాన్సర్ బారి నుంచి కాపాడడమేనన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న 8 రకాల వ్యాధులకు మహిళా ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తారని వివరించారు. అనారోగ్యం బారిన పడిన వారికి వ్యాధి తీవ్రతను బట్టి పీహెచ్సీలు, జిల్లా వైద్యశాలలు, హైదరాబాద్లోని ఎంఎన్జే క్యాన్సర్ ఆస్పత్రిలో వైద్యం అందిస్తారని వెల్లడించారు. రెండో విడుతలో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 100 మహిళా ఆరోగ్య కేంద్రాలను మంజూరు చేసిందన్నారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో గిరిజన జనాభా అధికంగా ఉన్న ఖానాపురం మండలానికి ఒకటి మంజూరైనట్లు వెల్లడించారు. మహిళా ఆరోగ్య కేంద్రాన్ని మంజూరు చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావుకు ఈ సందర్భంగా పెద్ది కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వ వైద్యశాలల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం
బీఆర్ఎస్ ప్రభుత్వం వైద్య రంగాన్ని బలోపేతం చేసిందని ఎమ్మెల్యే పెద్ది అన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే నర్సంపేటలో 450 పడకల దవాఖాన ప్రారంభం కానున్నట్లు వివరించారు. ఇకపై నర్సంపేటలోనే కిడ్నీ, గుండె ఆపరేషన్లు సైతం జరుగుతాయని వివరించారు. ఇప్పటికే నర్సంపేటలో ఏర్పాటు చేసిన టీ డయాగ్నొస్టిక్ సెంటర్లో సేవలు అందుబాటులోకి వచ్చాన్నారు. ఇందులో 134 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నట్లు వివరించారు. నిత్యం 150 నుంచి 200 మందికి ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని తెలిపారు. రూ. 10.50 కోట్లతో వైద్య పరికరాలు సమకూర్చినట్లు చెప్పారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని రకాల వైద్య సేవలను ప్రజలు వినియోగించుకుంటున్నారని వివరించారు. వచ్చే ఏడాది నుంచి నర్సంపేటలోని మెడికల్ కాలేజీలో తరగతులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. తెలంగాణలో వైద్య సిబ్బంది అందజేస్తున్న సేవలను ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం గుర్తించిందన్నారు. కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామీనాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్గౌడ్, డిప్యూటీ డీఎంహెచ్వోలు ప్రకాశ్, గోపాల్రావు, మండల వైద్యాధికారి భూపేశ్, జ్యోతి, మండల కోఆప్షన్ సభ్యుడు మస్తాన్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.