నర్సంపేట రూరల్, ఆగస్టు 6: తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధిరాలేదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, సాధించిన ప్రగతి, సమగ్ర అభివృద్ధిపై పెద్ది ప్రసంగించారు. 23 ఏళ్లుగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో పని చేసే అదృష్టం కలిగినందుకు చాలా గర్వపడుతున్నానని చెప్పారు. పిడికెడు మందితో తెలంగాణ నినాదం మొదలైందని, ఆనాటి నుంచి నేటి వరకు కేసీఆర్ మనోధైర్యం, చిత్తశుద్ధి, ప్రణాళికా పద్ధతులు గొప్పవన్నారు. తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ రాష్ట్ర ఏర్పాటుకు ముందు, ఏర్పడిన తర్వాత చేసిన అనేక కుట్రలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని గుర్తు చేశారు. రాష్ట్ర ఆవిర్భావం కంటే ముందున్న మన హైదరాబాద్ స్వతంత్య్ర రాష్ర్టాన్ని ఆంధ్రాతో కలిపిన పాపం కాంగ్రెస్ పార్టీదేనన్నారు. అలాంటి కాంగ్రెస్ అక్కడ, ఇక్కడ స్టేట్మెంట్లు ఇస్తుందని, రాష్ర్టాన్ని మేమే ఇచ్చామని మాట్లాడే కాంగ్రెస్ పార్టీ నాయకులు.. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. ఆనాడు హైదరాబాద్ రాష్ర్టాన్ని ఆంధ్రాతో కలిపి మన గొంతు కోసింది కాంగ్రెస్సే అన్నారు. ఆ తర్వాత 1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని లొంగదీసుకొని తెలంగాణ వాదాన్ని రెండోసారి మింగిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. 1969లో వందలాది మందిని కాల్చిచంపిన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటికీ రాష్ర్టాన్ని ఇవ్వలేదని, అనేక రంగాల్లో అస్థిత్వం లేని ప్రాంతంగా తెలంగాణను తయారు చేసిన కాంగ్రెస్ ప్రథమ దోషి అని పేర్కొన్నారు. ఎంతో మంది త్యాగాలు చేస్తేనే ఇవ్వాల తెలంగాణ రాష్ర్టాన్ని కళ్లారా చూడగలుగుతున్నామని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలు పార్టీలకతీతంగా అన్ని వర్గాల వారికి అందుతున్నాయన్నారు.
ఉద్యమాన్ని అణచివేసింది కాంగ్రెస్సే..
తెలంగాణ సాధన సందర్భంగా అనేక విధ్వంసాలు సృష్టించి అణచివేసింది కాంగ్రెస్ పార్టీ అని, అలాంటి కుట్రల నుంచి శాంతియుతమైన ఆలోచలనలు చేసి, మేధోమథనం చేసి ఇవ్వాల తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, సమగ్రంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందనారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేస్తున్న విద్యార్థులు, యువకులు, నాయకులపైన దేశద్రోహం కేసులు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు. 2004లో రాష్ట్రం ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని, గెలిచిన తర్వాత తెలంగాణ గొంతు నొక్కే ప్రయత్నం చేసిందన్నారు.
సీఎం నోట నర్సంపేట పెద్ది మాట
ముఖ్యమంత్రి కేసీఆర్ నోట నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మాట వినిపించింది. ఆదివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది, నియోజకవర్గ అభివృద్ధి, పాకాల సరస్సు, సాగునీటి రంగం అభివృద్ధిని ప్రస్తావించారు. పాకాల ప్రాజెక్టు విషయంలో ఎమ్మెల్యే పెద్ది తనతో పట్టుబట్టి నిధులు మంజూరు చేయించుకున్నారని, దీంతో దేవాదుల లిఫ్టు ఇరిగేషన్కు పాకాలను లింకు చేసినట్లు తెలిపారు. పాకాల ఆయకట్టు కింద ఉన్న రైతులకు ఎలాంటి ఢోకా లేదని, రెండు పంటలను దర్జాగా పండిస్తున్నారంటే కారణం పెద్ది పుణ్యమేనని సీఎం అన్నారు. అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధిలో ముందుకెళ్తున్నామని చెప్పారు.