నెక్కొండ, అక్టోబర్ 7: బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను చూసి అంతా దద్దరిల్లడం ఖాయమని, కాంగ్రెస్ నాయకులు నిద్రలేని రాత్రులు గడపడం ఖాయమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండలంలోని నాగారం, పెద్దకొర్పోలు గ్రామాల్లో వట్టెవాగులపై చెక్డ్యామ్ కమ్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శనివారం నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, జడ్పీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్నతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం నెక్కొండలో ఏర్పాటు చేసిన ప్రగతి సభలో మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో అమలు చేయని స్కీంలను తెలంగాణలో అమలు చేస్తామంటే తెలంగాణ ప్రజలు నమ్ముతరా? అని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలోని ఇతర ఏ రాష్ట్రంలోనూ సాగడం లేదన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎంత పెన్షన్ ఇస్తుందో చెప్పాలని, అది చెప్పకుండా ఇక్కడ రూ.3వేలు ఇస్తామంటే ప్రజలు నమ్మరని తెలిపారు. రూ.80వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథ ప్రాజెక్ట్, 24గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా వంటి భారీ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేసి చూపారని, అసాధ్యాలను సుసాధ్యం చేయడం సీఎం కేసీఆర్కే సాధ్యమన్నారు. ఏడాది కాలంలో అందరికీ ఇల్లు ఉండేలా చూడటమే లక్ష్యమని చెప్పారు. భారీ ప్రాజెక్ట్లు అయిపోయాయని, ఇక సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో ఎలాంటి వరాలు ప్రకటిస్తారో, ఎలాంటి పథకాలకు శ్రీకారం చుడుతారోనని ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్తో తెలంగాణలో రెండు పంటలు పండుతున్నాయని, దీంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయని చెప్పారు.
తన 40ఏళ్ల రాజకీయ జీవితంలో నచ్చిన ముఖ్యమంత్రులు ఇద్దరేనని, ఒకరు ఎన్టీఆర్, మరొకరు సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ హయాంలో నర్సంపేట కొట్లాటలకు కేంద్రంగా ఉండేదని, ఇప్పుడు రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్ట్లను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఇక్కడికి తీసుకువచ్చారని, జిల్లాలోనే నర్సంపేట నియోజకవర్గానికి అత్యధిక నిధులు వచ్చాయని వివరించారు. ఎకరానికి రూ.10వేల పంటనష్ట పరిహారం అందడం ఎమ్మెల్యే పెద్ది కృషే కారణమన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో నంబర్ వన్గా నిలుపుతున్న సీఎం కేసీఆర్ను, నర్సంపేటను అభివృద్ధిలో అగ్రపథాన నిలుపుతున్న ఎమ్మెల్యే పెద్దిని గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవాలన్నారు. నెక్కొండ మండలం జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సూచించారు.
నర్సంపేట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేలు తమ హయాంలో చేసిన పనులు చెప్పుకునే ధైర్యం ఉందా? అని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా తాను ఒక్క నెక్కొండ మండలంలోనే రూ.250కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు చెప్పారు. ఎమ్మెల్యేగా తాను, వారు చేసిన పనులను ప్రజాక్షేత్రంలో చెబితే ప్రజలే ఆశీర్వదిస్తారని, ఈ సవాల్కు వారు సిద్ధమేనా? అని ప్రశ్నించారు. తన హయాంలో ఎన్ని కిలోమీటర్ల రోడ్లు వేశారో, ఊర్లలో అంతర్గతంగా బీటీ రోడ్లు వేశారో, ఎన్ని లింక్ రోడ్లు వేశారో ఇలా జరిగిన ప్రతి అభివృద్ధి పనులను ప్రజల ముంగిట ఉంచాలన్నారు.
మండలంలోని నాగారం – ఇంటికన్నె, పెద్ద కొర్పోలు – చిన్నకొర్పోలు మధ్య వట్టెవాగుపై బ్రిడ్జిల నిర్మాణం కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ప్రజల కల నేడు సాకారమైందని చెప్పారు. కరోనా సమయంలో రాష్ట్రంలోనే మొదట ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశానని, రెండు విడుతల్లో ప్రజల బాగోగులు చూసుకున్నానని తెలిపారు. పంట నష్టపరిహారం ఎకరానికి రూ.10వేల చొప్పున 40వేల మందికి అందించామని, ఇంకా రూ.75వేల కోట్ల విలువైన వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయని, కాంగ్రెస్ కుట్రలను రైతులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ను, తనను నిండు మనసుతో ఆశీర్వదించాలని, నర్సంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని కోరారు.
అనంతరం పంట నష్టపరిహారం చెక్కులను మంత్రి, ఎమ్మెల్యే కలిసి పంపిణీ చేశారు. ఎంపీపీ జాటోత్ రమేశ్, జడ్పీటీసీ లావుడ్య సరోజ హరికిషన్, సొసైటీ చైర్మన్లు మారం రాము, జలగం సంపత్రావు, ఘంటా దామోదర్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, ప్రధాన కార్యదర్శి తాటిపెల్లి శివకుమార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అబ్దుల్నభి, నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేశ్యాదవ్, మాజీ సొసైటీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్రెడ్డి, సర్పంచ్లు మహబూబ్పాషా, కర్ర వెంకట్రెడ్డి, బొంపెల్లి రాజేశ్వర్రావు, ఆశమ్మ, జల్లె సుదర్శన్, సీనియర్ నాయకులు చల్లా చెన్నకేశవరెడ్డి, సూరం రాజిరెడ్డి, గుంటుక సోమయ్య, మండల నాయకులు అన్నమనేని సంతోశ్, మాదాసు రవి, సారంగపాణి, దేవన బోయిన పాల్గొన్నారు.