కాజీపేట, మే 8 : కాజీపేట రైల్వే సబ్ డివిజన్ పరిధిలోని మూడో లైన్, కోమటిపల్లి భూగర్భ రైల్వే సొరంగ మార్గాన్ని ప్రధాని నరేంద్రమోదీ హైదబాదాద్ నుంచి వర్చువల్గా ఆదివారం ప్రారంభించనున్నట్లు శుక్రవారం రాత్రి రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్తర దక్షిణ భారతానికి ముఖ ద్వారమైన కాజీపేట రైల్వే జంక్షన్ సమీపంలోని కోమటిపల్లి వద్ద రైలు ట్రాఫిక్కు చెక్ పెట్టేందుకు రైల్వే శాఖ భూగర్భ సొరంగం మార్గం నిర్మించారు.
దీంతోపాటు సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలోని కాజీపేట-బలార్షా, కాజీపేట- విజయవాడ సెక్షన్లో రైళ్ల రద్దీకి అనుగుణంగా 421 కిలో మీటర్ల మూడో లైన్ను ఏర్పాటు చేశారు. గ్రాంట్ ట్రంక్ రూట్లో ఢిల్లీ-సికింద్రాబాద్, విజయవాడ సెక్షన్లో రైళ్ల రద్దీని తగ్గించేందుకు రైల్వేశాఖ దాదాపు 12 ఏళ్ల కాలంలో దాదాపు రూ.4015 కోట్ల వ్యయంతో నిర్మాణం చేసింది. ఈ రెండు ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించి జాతికి అంకితం చేస్తారని రైల్వే అధికారులు వెల్లడించారు.