ఖిలావరంగల్, ఏప్రిల్ 9: రాష్ట్రంలో భవిష్యత్ అంతా బీఆర్ఎస్దేనని వరంగల్ తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఎల్కతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవాల మహాసభ సన్నాహక సమావేశాన్ని గ్రేటర్ వరంగల్ 37వ డివిజన్ తూర్పుకోటలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నన్నపునేని మాట్లాడుతూ బీఆర్ఎస్ 25 ఏళ్లుగా తెలంగాణ ప్రజల ఆశయాలకు అంకితమై పని చేస్తున్నదన్నారు. పార్టీ సాధించిన విజయాలు ప్రతి కార్యకర్త గర్వపడేలా ఉన్నాయన్నారు.
రాబోయే రజతోత్సవ మహాసభ కార్యకర్తలకు పండుగలా మారనున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. వేసవి ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని సభకు హాజరయ్యే కార్యకర్తల కోసం మజ్జిగ ప్యాకెట్లు, తాగునీరు, భోజన సదుపాయం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి ఒకరూ తమ బాధ్యతగా భావించి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం చలో వరంగల్ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అలాగే, వరంగల్ 34వ డివిజన్ ఆర్యవైశ్య కమ్యూనిటీ భవనంలో కార్పొరేటర్ కుమారస్వామి అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశంలో నన్నపునేని పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ 37వ డివిజన్ అధ్యక్షుడు విజయ్, నాయకులు సంగరబోయిన ఉమేశ్, బిల్లా రాజు, పోలెపాక రాజు పాల్గొన్నారు. అలాగే, నన్నపునేని పడమరకోటలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎల్కతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు కార్యకర్తలు హాజరై ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు.