‘మంత్రిగా.. డిప్యూటీ సీఎంగా.. ఎమ్మెల్సీగా మీలో ఒకడిగా ఉన్నా. సమస్యలు తెలుసుకొని ఏ ఊరికి ఏమి కావాలో ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించా. ఇక నుంచి నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళిక తయారుచేసి ప్రజల అభీష్టం మేరకు ముందుకుపోతా.. నా మార్క్ అభివృద్ధి ఏమిటో చూపిస్తా..’ అని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పేర్కొన్నారు. బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించగా, స్టేషన్ ఘన్పూర్ నుంచి కడియం శ్రీహరికి అవకాశం లభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గురువారం ‘నమస్తే తెలంగాణ’కు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులు, మంత్రి కేటీఆర్ మార్గదర్శనంలో స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. దేవాదుల మూడో దశను పూర్తి చేసి, ప్రతి ఎకరానికి సాగు నీరందిస్తానన్నారు. ముఖ్యమంత్రి కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష అని, బీఆర్ఎస్పై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉన్నదని, మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
జనగామ, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): ‘మంత్రిగా.. డిప్యూటీ సీఎంగా.. ఎమ్మెల్సీగా మీలో ఒకడిగా తిరిగా.. కష్ట, సు ఖాలు, కన్నీళ్లు, సమస్యలు తెలుసుకొని ఏ ఊరికి ఏమి కావాలో ప్రాధాన్యతా క్రమంలో గ్రామాభివృద్ధికి ప్రణాళిక తయారు చేసుకొని ప్రజల అభీష్టం మేరకు ముందుకుపోతా.. ప్రజలు ఆశీర్వదిస్తే నా మార్క్ అభివృద్ధి ఏమిటో చూపిస్తా.. స్టేషన్ ఘన్పూర్ను మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయిస్తా, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, వంద పడకల ఆస్పత్రిని పూర్తి చేయిస్తా, బస్టాండ్ను పునఃనిర్మించి అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా’ అని బీఆర్ఎస్ స్టేషన్ఘన్పూర్ అసెంబ్లీ అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి స్పష్టం చేశారు. గురువారం ‘నమస్తే తెలంగాణ’కు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తనకు పార్టీ అభ్యర్థిగా అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందని, సీఎం కేసీఆర్ ఆశీస్సులు, మంత్రి కేటీఆర్ మార్గదర్శకంగా కచ్చితంగా భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
కొత్తగా ఏర్పడిన చిల్పూరు, వేలేరు మండల కేంద్రాల్లో సమీకృత ఆఫీస్ కాంప్లెక్సులు నిర్మించి, గ్రామీణ ప్రాంత లింక్ రోడ్లను అభివృద్ధి చేసి, దేవాదుల మూడు దశల పనులు పూర్తి చేసి ప్రతీ ఎకరాకు సాగునీరించేలా చూడడం నా ముందున్న తక్షణ కర్తవ్యమని అన్నారు. మొదటి ప్రాధాన్యతా అంశంగా లక్ష ఎకరాలకు రెండు పంటలకు సాగునీరందించి, రిజర్వాయర్లను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తానని, పల్లె, పట్టణ ప్రగతి ప్రణాళికల మాదిరిగా నియోజకవర్గ, గ్రామ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి వాటినే ఎన్నికల ఎజెండాగా ప్రకటించి పనులు చేయిస్తానన్నారు. విద్య, వైద్యం, అభివృద్ధికి పెద్దపీట వేస్తానని, ప్రధానంగా అవినీతికి తావులేకుండా నిజాయితీ, నిబద్ధత, చిత్తశుద్ధితో సేవలందిస్తానని తెలిపారు. గడప గడపకూ సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అందించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.
నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్ మీకు టికెట్ ఇవ్వడంపై మీ స్పందన ఏమిటి? ఇప్పుడు ఎలా ఫీలవుతున్నారు?
కడియం శ్రీహరి: ప్రజల అభిమతం, సర్వేలు, నివేదికలు, వివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని అధిష్టానం టికెట్ మార్పుచేసింది. కేసీఆర్ నన్ను ఆశీర్విదించి టికెట్ కేటాయించడం చాలా సంతోషంగా ఉన్నది. డిప్యూటీ సీఎంగా, ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి ప్రజలకు సేవచేసే భాగ్యం కల్పించిన కేసీఆర్కు రుణపడి ఉంటా. కేటీఆర్, మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్సీ కవితకు ధన్యవాదాలు.
నమస్తే తెలంగాణ : బీఆర్ఎస్పై విపక్షాలు చేస్తున్న విమర్శలపై ఏమంటారు?
కడియం శ్రీహరి : బీజేపీ, కాంగ్రెస్ జాతీయ పార్టీలుగా ఉండి, వారు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో పథకాలను అమలు చేయకుండా, డిక్లరేషన్లు ప్రకటించకుండా రాష్ర్టానికి ఒక విధానంఎలా పాటిస్తారు? ఇది వారి రాజకీయ దివాళాకోరుతనం కాదా? పక్కనన్ను గుజరాత్, కర్నాటకలో లేని పథకాలను ఇక్కడ చెబితే నమ్మేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. ఎన్నికల కోసం ప్రజలను బ్రమల్లో పెట్టి మోసం చేసే ఎత్తుగడగా భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తున్న వివిధ డిక్లరేషన్లను దేశ వ్యాప్తంగా ప్రకటించాలి.
నమస్తే తెలంగాణ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో విపక్షాల పరిస్థితి ఎలా ఉంటుంది?
కడియం శ్రీహరి: బీజేపీకి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్క నియోజకవర్గంలో డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు. వారికి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకులు లేరు. అయినా గల్లీ లీడర్ల ఢిల్లీ మాటలు కోటలు దాటుతున్నాయ్. వాళ్లను ప్రజలు నమ్మడం లేదు. ఇక కాంగ్రెస్ పార్టీ గతంలో తెలంగాణ ప్రాంతాన్ని పాలించింది. ఆ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి మరిచి స్కాంలు చేసి ప్రజలను ఏ రకంగా దోచుకుతిన్నారో అందరికీ తెలుసు.
నమస్తే తెలంగాణ : మంత్రిగా, డిప్యూటీ సీఎంగా వరంగల్ అభివృద్ధిని ఎలా చూస్తారు?
కడియం శ్రీహరి: సీఎం కేసీఆర్ ఆశ్వీర్వాదం, నాయకత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో డిప్యూటీ సీఎంగా పనిచేశా. ఆ రోజుల్లో ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దాలనే కోరిక ఉండే. అం దుకే అనేక ఇనిస్టిట్యూషన్స్ తెచ్చాం. వరంగల్ సమగ్రాభివృద్ధి చెందాలంటే ఔటర్ రింగ్రోడ్డు ఉండాలని ప్రతిపాదించాం. అనేక నేతన్నల వలసల నివారణ కోసం మెగా టెక్స్టైల్ పార్కు కు శంకుస్థాపన చేశాం. ఇప్పుడు అనేక మందికి ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తున్నది. వరంగల్కు మాస్టర్ప్లాన్, ఓఆర్ఆర్పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా సమస్యలు నాకు తెలుసు కాబట్టి వరంగల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, స్టామ్ వాటర్ వ్యవస్థ ఉండాలని ఇటీవలే మంత్రి కేటీఆర్ వద్ద ప్రతిపాదిస్తే, వెంటనే కన్సల్టెన్సీ ద్వారా డీపీఆర్ పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
నమస్తే తెలంగాణ : నియోజకవర్గంలో అభివృద్ధిప్రాధాన్యతా అంశాలు ఏమిటీ?
కడియం శ్రీహరి : ప్రధానంగా విద్య, వైద్యం, అరోగ్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల పెంపు. వంద పడకల ఆస్పత్రి ఈ మధ్యనే సీఎం మంజూరు చేశారు. వెంటనే నిర్మించుకోవాలి. నియోజకవర్గ కేంద్రంలో జనరల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మంజూరు చేయించడం, రోడ్ నెట్వర్క్ పెంచడం, గ్రామాల్లో సీసీరోడ్లు, మండల కేంద్రం నుంచి మండల కేంద్రానికి లింక్రోడ్లను విస్తరించి అభివృద్ధి చేసుకోవాల్సి ఉన్నది. మండలానికో రిజర్వాయర్ను టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన ఉన్నది. వేలేరు, చిల్పూరు కొత్త మండలాల్లో సమీకృత కాంప్లెక్సుల నిర్మాణం సహా ధర్మసాగర్, స్టేషన్ఘన్పూర్, జఫర్గడ్, అశ్వారావుపల్లి, నవాబ్పేట దేవాదుల రిజర్వాయర్లను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది.
నమస్తే తెలంగాణ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నియోజకవర్గ ప్రజల ముందుంచే అభివృద్ధి ఎజెండా అంశాలేమిటీ?
కడియం శ్రీహరి : ముఖ్యమంత్రి ఆశీస్సులతో టికెట్ వచ్చింది. ప్రజలు ఆదరించి ఆశీర్విదిస్తే స్ట్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో కడియం మార్క్ అభివృద్ధిని చూపిస్తా. తొలి ప్రాధాన్యతగా స్టేషన్ఘన్పూర్, శివునిపల్లి, ఛాగల్ను కలుపుతూ మున్సిపాలిటీగా ఏర్పాటు చేయించి, సీఎం కేసీఆర్ ఆశీస్సులతో నియోజకవర్గ కేంద్రం అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు తెస్తా. ఒకవైపు 100 పడకల ఆస్పత్రి, మరోవైపు డిగ్రీ కాలేజీ, మంచి బస్టాండ్ నిర్మాణంతో స్టేషన్ఘన్పూర్ను తీర్చిదిద్దుతాం.
నమస్తే తెలంగాణ : నియోజకవర్గ ప్రజలకు మీరిచ్చే సందేశం ఏమిటీ?
కడియం శ్రీహరి : అవినీతికి దూరంగా ఉంటూ నిజాయితీగా పనిచేస్తా. తప్పు పని చేయను. ప్రజలకు తలవంపులు తెచ్చేలా వ్యవహరించను. ఎమ్మెల్యే అంటే కడియం శ్రీహరి లెక్క ఉండాలని అనిపించుకుంటా. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించడమే నా లక్ష్యం. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, సమస్యలు తెలుసు. వాటి పరిష్కారం తెలుసు. ప్రజలు ఆశీర్విదిస్తే పల్లె, పట్టణ ప్రగతి ప్రణాళిక మాదిరిగానే గ్రామ అభివృద్ధి ప్రణాళిక, నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళిక తయారు చేసుకొని వాటినే ఎజెండాగా ప్రజలకు వివరించి అమలు చేస్తా. ఇది నా కమిట్మెంట్..
నమస్తే తెలంగాణ : దేవాదుల ప్రాజెక్టు ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉన్నది?
కడియం శ్రీహరి : దేవాదుల ఎత్తిపోతల పథకం ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఒక వరం లాటింది. ప్రత్యేకంగా దీన్ని కేవలం వరంగల్ జిల్లాకే డెడికేట్ చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ విధానపరమైన నిర్ణయం తీసుకొని, 100 టీఎంసీలు కేటాయిస్తున్నట్లు గతంలో ప్రకటించి జీవో కూడా ఇచ్చారు. వరంగల్ అర్భన్లోని రెండు నియోజకవర్గాలు మినహాస్తే మిగిలిన 10 రూరల్ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి లక్ష ఎకరాల సాగునీరందించేలా ప్రణాళిక రూపొందించారు. దేవాదుల మూడోదశ పనులు జరుగుతున్నాయి. త్వరలో పూర్తవుతాయి. ఒకటి, రెండు, మూడో దశ పూర్తయితే ఉమ్మడి జిల్లాలో 10లక్షల ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి వస్తుంది. దీనికితోడు ఎస్సారెస్పీ కాల్వ, కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు భీమదేవరపల్లి, హుస్నాబాద్ ప్రాంతాలకు గౌరాయపల్లి నుంచి వరద కాల్వ ద్వారా కూడా నీరందే అవకాశం ఉన్నది. నాలుగు ప్రాజెక్టుల ద్వారా ఉమ్మడి జిల్లాలో ప్రతి ఎకరానికి రెండు పంటలకు నీరందించే అవకాశమున్నది.
నమస్తే తెలంగాణ : బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు ఏమనుకుంటున్నారు?
కడియం శ్రీహరి: నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నది. తెలంగాణ ప్రజలు మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూడాలనుకుంటున్నారు. కేసీఆర్ చేతిలోనే రాష్ట్రం సురక్షితంగా ఉంటుంది. ఆయనకు మాత్రమే సమస్యలపై అవగాహన, చిత్తశుద్ధి ఉన్నది. వాటిని పరిష్కరించగలడనే న మ్మకం ప్రజల్లో ఉన్నది. కాబట్టి కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష. మాకు కనిపిస్తున్నది, మేం కార్యక్రమాలకు వెళ్లినా, గ్రామాలకు వెళ్లినా స్పష్టంగా తెలుస్తున్నది. కాబట్టి ఎవరెన్ని మాటలు మాట్లాడినా, విమర్శలు, కుట్రలు చేసినా మూడోసారి తెలంగాణ ప్రజలు కేసీఆర్ను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు. అఖండ విజయాన్ని అందించబోతున్నారు.
నమస్తే తెలంగాణ : స్టేషన్ఘన్పూర్ వంటి ఎగువ ప్రాంతంలో సాగునీటి పరిస్థితి ఎలా ఉంది?
కడియం శ్రీహరి : నా లక్ష్యం ఒక్కటే. ప్రతి ఎకరాకు సా గునీరందించడం. ప్రత్యేకించి స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో దేవాదుల ప్రాజెక్టు పనులు పూర్తికావస్తున్నది. మొదటి ప్రాధాన్యతగా దేవాదుల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయించి, ప్రతి ఎకరానికి రెండు పంటలకు నీ రందించేలా ప్రణాళిక ఉంటుంది. అశ్వారావుపల్లి రైట్ మొయిన్ కెనాల్ కింద దాదాపు 40వేల ఎకరాలకు సాగు నీరందించాలి. దాంట్లో ప్రధానంగా లింగాలఘనపురం మండలానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. దీనిపై కలెక్టర్, అధికారులతో సమీక్షించి ఆరు నెలల్లో నీరందించవచ్చు. జఫర్గడ్, ధంసా చెరువులను రిజర్వాయర్లుగా మార్చడం సహా అశ్వారావుపల్లి కుడి కాల్వ, గండిరామారం కుడి, ఎడమ కాల్వల పనులు పూర్తి చేయించి, నియోజకవర్గంలో రెండు పంటలకు నీరందించడానికి ప్రణాళిక ఉంటుంది.