రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మళ్లీ బీఆర్ఎస్ను గెలిపిస్తాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. బుధవారం అరూరి ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకున్నానని, మూడోసారి భారీ మెజార్టీతో విజయం కట్టబెడ్తారనే నమ్మకం ఉన్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ సహకారంతో రూ.2వేల కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ప్రజలు విపక్షాల కల్లబొల్లి మాటలు నమ్మి మోసపోవద్దని, పని చేసే ప్రభుత్వాన్ని మళ్లీ దీవించాలని కోరారు.
– వర్ధన్నపేట, ఆగస్టు 23
వర్ధన్నపేట, ఆగస్టు 23: ‘వరంగల్ మహా నగరానికి చుట్టూ ఉన్న వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధి శరవేగంగా జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం నియోజకవర్గానికి తొమ్మిదేళ్లలో సుమారు రూ.2,300కోట్లను వివిధ అభివృద్ధి పనులకు మంజూరు చేసింది. దీంతో నియోజకవర్గ కేంద్రంతోపాటు నియోజకవర్గ పరిధిలోని ఐనవోలు, హసన్పర్తి, హనుమకొండ రూరల్ మండలాల్లో ప్రజా అవసరాలను గుర్తించి ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టింది. ఐనవోలు మల్లికార్జునస్వామి, మడికొండ మెట్టు రామలింగేశ్వరస్వామి ఆలయాలను అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించింది. ఆకేరువాగులో నీరు ఏడాదంతా నిల్వ ఉంచేందుకు వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు మండలాల్లో చెక్డ్యామ్లతోపాటు వంతెనలు నిర్మించడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మడికొండ టెక్స్టైల్ పార్కులో రూ.4.59కోట్లతో అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపట్టింది.
మిషన్ కాకతీయ పథకంలో నియోజకవర్గ పరిధిలోని 187 చెరువులను అభివృద్ధి, మిషన్ భగీరథ పథకంలో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు వాటర్ ట్యాంకుల నిర్మాణం, పైపులైన్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందిచేందుకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులను కేటాయించింది. విలీన గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించడంతో సమస్యలు పరిష్కారమయ్యాయి. దీంతో వచ్చే ఎన్నికల్లోనూ ప్రజలు తనను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఎమ్మెల్యే అరూరి రమేశ్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్ధన్నపేట అభ్యర్థిగా మూడోసారి సీఎం కేసీఆర్ ప్రకటించగా ఆయన బుధవారం ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
నమస్తే తెలంగాణ: సీఎం మూడోసారి అభ్యర్థిగా ప్రకటించారు కదా.. ఎలా ఫీలవుతున్నారు?
అరూరి రమేశ్: నాపై నమ్మకంతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాపై నమ్మకంతో ఈ అవకాశాన్ని కల్పించారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా 2014, 2018లో రాష్ట్రంలోనే రెండో భారీ మెజార్టీతో నియోజకవర్గ ప్రజలు గెలిపించారు. 2014లో ఎన్నికల సమయంలో అవకాశం ఇవ్వండి.. పెద్ద జీతగానిగా పనిచేస్తానని ప్రజలను కోరాను. ఈ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా పనిచేస్తున్నాను. మరోసారి కూడా నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు నావెన్నంటి ఉన్నారు. మరోసారి కూడా సీఎం కేసీఆర్ మంత్రులు కేటీఆర్, దయాకర్రావు సహకారంతో భారీ మెజార్టీతో విజయం సాధిస్తాననే నమ్మకం ఉంది.
ఎన్నికల ప్రచారంలోకి ఎలా వెళ్లబోతున్నారు?
నేను సీఎం కేసీఆర్ ఆశీస్సులతో నిత్యం ప్రజల్లోనే ఉన్నాను. రెండు సార్లు జరిగిన ఎన్నికల్లో ఐనవోలు మల్లికార్జునస్వామి, మెట్టు రామలింగేశ్వరస్వామి, ఇతర మత పెద్దల ఆశీస్సులతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించా. ఈసారి కూడా అదేపద్ధతిలో ప్రారంభించి, ప్రభుత్వం నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని పార్టీ ముఖ్యనాయకులతో కలిసి వివరిస్తాం. సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ అభివృద్ధి ఫలాలు కళ్లకు కనిపిస్తున్నాయి. సంక్షేమ ఫలాలు కూడా ప్రతి ఇంటికీ అవసరం మేరకు చేరుతున్నాయి. ప్రజలు పూర్తిస్థాయిలో బీఆర్ఎస్ను ఆశీర్వదించి గతంలో కంటే ఎక్కువ మెజార్టీని ఇస్తారనే పూర్తిస్థాయి నమ్మకం నాకు ఉంది.
నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులు వివరిస్తారా?
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్లలో నియోజకవర్గంలో రూ.2,300 కోట్లతో అభివృద్ధి చేపట్టినం. ఆకేరువాగుపై చెక్డ్యామ్లను రూ.40కోట్ల ఖర్చుతో నిర్మించడం వల్ల ఐనవోలు, పర్వతగిరి, వర్ధన్నపేట మండలాల్లో భూగర్భ జలాలు పెరిగి రైతులకు సమృద్ధిగా నీరు అందుతున్నది. నియోజకవర్గంలో సుమారు రూ.115 కోట్లతో వంతెనలను నిర్మించి రహదారులను మెరుగుపరచడంతో పాటుగా సుమారు రూ.500 కోట్లతో రహదారుల నిర్మాణం చేపట్డం వల్ల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపరచడం జరిగింది. ఐనవోలు దేవాలయం, మెట్టుగుట్ట దేవాలయం, మసీదులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నుంచి పెద్దమొత్తంలో నిధులు చేయించి అభివృద్ధి చేశాం. నియోజకవర్గంలో పేదల కోసం 1400 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించాం. ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రత్యక్షంగా చూస్తున్నారు.
మున్సిపాలిటీలో ఏ పనులు చేపడుతున్నారు?
గ్రామ పంచాయతీగా ఉన్న వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసుకున్నాం. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ పట్టణం, పట్టణ పరిధిలోని తండాల అభివృద్ధి కోసం రూ.100కోట్ల మేరకు నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నారు. పట్టణంలోని వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి వైడింగ్ చేసి, అభివృద్ధి చేస్తున్నం. సెంట్రల్ లైటింగ్, అధునాతన డ్రైనేజీ, వర్ధన్నపేట-జఫర్గఢ్ రహదారి అభివృద్ధి, అంతర్గత సీసీరోడ్ల నిర్మాణం చేపడుతున్నాం. వచ్చే ఏడాదికల్లా వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రం పూర్తిస్థాయిలో పట్టణ వాతావరణాన్ని సంతరించుకోనున్నది.
కార్యకర్తల సహకారం ఎలా ఉంది?
రెండు ఎన్నికల్లో నియోజకవర్గ కార్యకర్తలంతా కష్టపడి పనిచేసిండ్లు. నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సీఎం కేసీఆర్ నాకు మూడోసారి అభ్యర్థిగా అవకాశం ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాకు రెండు సార్లు భారీ మెజార్టీ రావడానికి కార్యకర్తల సహకారం ఎంతో ఉంది. ఎవరి మధ్య కూడా ఎలాంటి బేదాభిప్రాయాలు లేవు. వచ్చే ఎన్నికల్లోనూ కార్యకర్తలంతా కష్టపడి పనిచేసి భారీ మెజార్టీ వచ్చేలా కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
మీకు ఏ అంశాలు భారీ మెజారిటీని ఇస్తాయి?
వర్ధన్నపేట నియోజకవర్గం వరంగల్ మహా నగరం చుట్టూ ఉన్నప్పటికీ ప్రభుత్వాల వైఫల్యంతో అభివృద్ధిలో వెనుకబడింది. 2014లో ప్రజలు అవకాశం ఇచ్చాక నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశాం. ప్రధానంగా గ్రేటర్ వరంగల్లో విలీనమైన గ్రామాల్లోని సమస్యలను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పెద్ద మొత్తంలో నిధులను మంజూరు చేయించడం జరిగింది. దీంతో ఆయా గ్రామాల్లో అంతర్గత రోడ్లు, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన గోదావరి జలాలు, కమ్యూనిటీ భవనాలు, మినీ ఫంక్షన్హాళ్లు, ప్రజా అవసరాలను గుర్తించి పనులు చేపట్టడం జరిగింది. విలీన గ్రామాలు ఎంతో అభివృద్ధి సాధించగా ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఐనవోలు, హసన్పర్తి, వర్ధన్నపేట మండలాల్లోనూ అభివృద్ధి చేపట్టడంతో ప్రజల గుండెల్లో సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం నిలిచింది. దీంతో వచ్చే ఎన్నికల్లో ప్రజలు మరోసారి భారీ మెజార్టీని ఇస్తారు.
ప్రజలకు మీరిచ్చే సందేశం ఏమిటి?
2014 ఎన్నికల్లో నాకు అవకాశం ఇవ్వండి మీ పెద్ద జీతగాడిగా పనిచేస్తానని చెప్పిన. ఇచ్చిన మాట ప్రకారం నిత్యం ప్రజల్లో ఉంటూ సేవలందిస్తూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నా. ప్రజలు కూడా ఆలోచించారు. విపక్ష పార్టీల నాయకులు తప్పుడు ప్రచారాలు చేసి లబ్ధిపొందాలని ప్రయత్నిస్తరు. కానీ ప్రజలు వాటిని నమ్మొద్దు. ప్రజల కోసం పనిచేసే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. సీఎం కేసీఆర్తోనే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రజలు తప్పకుండా మరోసారి భారీ మెజార్టీతో గెలిపించి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారు.