జనగామ చౌరస్తా, మార్చి 16 : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కుట్ర పూరిత చర్య అని జనగామ మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమునాలింగయ్య అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బీఆర్ఎస్ పట్టణ, రూరల్ కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోకల జమున మాట్లాడుతూ కవితను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గతంలో సుప్రీం కోర్టుకు ఇచ్చిన హామీని విస్మరించి కవితను అరెస్ట్ చేయడం దారుణమని తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువడే సమయంలో కవితను అరెస్ట్ చేసి బీఆర్ఎస్ ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని ఆమె విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజార్టీ సీట్లను గెలుస్తుందన్నారు. జనగామ మున్సిపాలిటీకి రూ.25కోట్లు, చేర్యాలకు రూ.10కోట్లు మంజూరు కావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ నాయకులు కలిసి రావాలని ఆమె కోరారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, మార్కెట్ మాజీ చైర్మన్ బాల్దె సిద్ధిలింగం మాట్లాడుతూ కవిత అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ఈ ప్రాంత అభివృద్ధి కోసం గతంలో ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని జనగామ, చేర్యాల మున్సిపాల్టీలకు రూ.35కోట్ల మంజూరు చేయించారని తెలిపారు. వీటిని తాము తీసుకొచ్చినట్లు కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిని విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేశ్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్, కౌన్సిలర్లు సమద్, దేవరాయ నాగరాజు, నీల శ్రీజ రాంమనోహర్, మాజీ ఎంపీపీ బైరగోని యాదగిరి, మాజీ కౌన్సిలర్ గజ్జెల నర్సిరెడ్డి, సీనియర్ నాయకులు పసుల ఏబేల్, వీరేందర్రెడ్డి, ధర్మపురి శ్రీనివాస్, నీల యాదగిరి, ఊడ్గుల కిష్టయ్య, తిప్పారపు విజయ్, పానుగంటి ప్రవీణ్ పాల్గొన్నారు.