ములుగుటౌన్, జనవరి 20 : కరోనా సెలవులతో ఇంటి వద్ద ఉంటున్న ఉపాధ్యాయులు తమ సృజనకు పదును పెట్టే అవకాశాన్ని రాష్ట్ర విద్యాశాఖ కల్పిస్తోంది. బోధన తీరును మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడం, నైపుణ్యాలను అభివృద్ధి చేసి విద్యార్థులకు ప్రయోగాత్మకంగా పాఠాలు బోధించేలా అభ్యసన ప్రణాళికలు రూపొందించడం, ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి(ఎస్సీఈఆర్టీ) ప్రతీ సంవత్సరం సదస్సులను నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రస్థాయి సదస్సుకు సైన్స్ ఉపాధ్యాయుల నుంచి పరిశోధన పత్రాలను ఆహ్వానిస్తోంది.
వృత్తిపరమైన అభివృద్ధి అంశాలతో..
జిల్లా పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ అధ్యాపకులు, సైన్స్ ఎడ్యుకేటర్లు, పరిశోధకులు, క్షేత్ర స్థాయిలో పనిచేసే పరిశోధకులు, ఎన్జీవోకు సంబంధించిన ఉపాధ్యాయులు తమ పరిశోధన నామపత్రాలను పంపవచ్చు. ఈ సైన్స్ సదస్సులో ఒక ప్రధాన అంశం, ఉప అంశాలు ఉంటా యి. 2021-22 సంవత్సరానికి సంబంధించి సైన్స్ బోధనా దృక్పథాలను పునర్నిర్వచించడం అంశం ప్రధానంగా ఉంటుంది. నిజ జీవితంలో ప్రయోగశాలలు, విపర్యాయము, స్థానిక సమస్యలు, సవాళ్లకు ప్రాజెక్టు అధారిత అభ్యసనం, 21వ శతాబ్దపు సైన్స్కు అనుగుణంగా బోధన ఉప అంశాల ఆధారంగా ఉపాధ్యాయులు తమ అనుభవాలను పరిశోధనా పత్రాలను పంపాల్సి ఉంటుంది.
ఆన్లైన్, పోస్ట్లో పంపే విధానం..
ఆసక్తి ఉన్న సైన్స్ ఉపాధ్యాయులు తమ పరిశోధనా పత్రాలను వెయ్యి పదాలకు మించకుండా నాలుగు పేజీల్లో రాసి పంపాల్సి ఉంటుంది. ఆంగ్ల భాషలో రాసేవారు ఎంఎస్ వర్డ్, తెలుగు భాషలో రాసే వారు అనూ స్క్రిప్ట్లో రాసి పీడీఎఫ్ ఫార్మేట్ పంపాలి. వివరాలను tgscertmathsscience@ gmail.com మెయిల్ ఐడీకి ఫిబ్రవరి 2వ తేదీలోగా పంపాలి. లేదా ఎస్సీఈఆర్టీ కార్యాలయం పేరుతో పోస్టు ద్వారా కూడా పంపవచ్చు. పంపిన పత్రాలను పరిశీలించి ఎంపికైన వారికి ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సదస్సులో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. వీటిలో ఉత్తమమైనవి ఎంపిక చేసి క్షేత్రస్థాయిలో అమలు చేసేలా చర్యలు తీసుకుంటారు.
ఇదొక మంచి అవకాశం
మన ఆలోచనలు, అనుభవాలను తెలిపేందుకు ఇది ఒక మంచి అవకాశం. పెరుగుతున్న సాంకేతికతకు అనుగుణంగా సైన్స్ బోధనా విధానంలో మార్పులు తీసుకొచ్చేందుకు ఎస్సీఈఆర్టీ ప్రతీ సంవత్సరం ఈ సదస్సులను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈసారి కూడా దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి.