ములుగు, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ) : ములుగు కలెక్టర్ క్యాంప్ క్లర్క్ (సీసీ) క్రాంతి తీరు ములుగు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. ఉద్యోగ నియామకాల్లో అతడు చేస్తున్న పైరవీల తీరు చర్చకు తెరలేపింది. పంచాయతీ కార్యదర్శి నుంచి సీసీగా వచ్చిన సదరు వ్యక్తి అందిన కాడికి దండుకుంటూ అక్రమాలకు తెరలేపుతున్నాడు. కలెక్టర్ ఆదేశాల మేరకు అతని పరిధి దాటి పనులు చేయొద్దనే నిబంధనలున్నప్పటికీ అవేవీ పట్టించుకోకుండా కొంత మంది అధికారులను తన కంట్రోల్లో పెట్టుకొని ఆడిందే ఆట, పాడిందే పాటగా ప్రవర్తిస్తున్నాడు. ప్రస్తుత కలెక్టర్ ఇలా త్రిపాఠి గతంలో అదనపు కలెక్టర్గా పనిచేసిన సమయంలో గోవిందరావుపేట మండలం రాఘవపట్నం జీపీలో కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న క్రాంతిని సీసీగా తీసుకున్నారు. కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం క్రాంతి ఆమె సీసీగా కొనసాగుతున్నాడు. 2023 ఆగస్టు నెలలో డీఎంఎఫ్టీ ఫండ్ ద్వారా ల్యాబ్ టెక్నీషియన్గా తన మిత్రుడు మధూకర్ను ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఏటూరునాగారం ప్రభుత్వ దవాఖానలో ఉద్యోగం ఇప్పించాడు. ఉద్యోగంలో చేరిన అనంతరం కలెక్టర్ సీసీ అండదండలతో ఇష్టారీతిన విధులకు హాజరవుతున్నాడనే కారణంతో ములుగు జిల్లా దవాఖానకు కేటాయించారు. ప్రభుత్వ దవాఖాన టీహబ్లో ల్యాబ్ టెక్నీషియన్గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నాడు.
ఇటీవల రెగ్యులర్ కాంట్రాక్టు పోస్టుకు మధూకర్ను ఎంపిక చేయాలని డీసీహెచ్ఎస్ డాక్టర్ జగదీశ్వర్పై సీసీ క్రాంతి ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలిసింది. రెగ్యులర్ కాంట్రాక్టు పద్ధ్దతిలో కొన్నేళ్లుగా ఏటూరునాగారం ప్రభుత్వ దవాఖానలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ భాస్కర్ బాధ్యతాయుతంగా పనిచేయడం లేదని ప్రస్తుత అడిషనల్ కలెక్టర్ శ్రీజ విచారణ జరిపి టర్మినేట్ చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న క్రాంతి భాస్కర్ స్థానంలో తన మిత్రుడు మధూకర్కు ఉద్యోగాన్ని ఇప్పించేందుకు ప్రజావాణిలో అర్జీ పెట్టించి, దానిని కలెక్టర్తో ఎండార్స్ చేయించి డీసీహెచ్ఎస్ను కలిసి పైరవీ చేశాడు. ఈ క్రమంలో డీసీహెచ్ఎస్ రెగ్యులర్ కాంట్రాక్టు ఉద్యోగం భర్తీ కోసం నిబంధనల మేరకు నోటిఫికేషన్ విడుదల చేసి ఉన్నతాధికారుల సూచనలతో మెరిట్ ప్రకారం ఉద్యోగ నియామకాన్ని చేపట్టాల్సి ఉంటుందని క్రాంతికి తెలిపాడు. అంతటితో ఆగకుండా మధూకర్ చేత మంత్రి సీతక్క సిఫారసు లెటర్ తీసుకువచ్చి పోస్టింగ్ ఇవ్వాలని డీసీహెచ్ఎస్పై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై క్రాంతిని వివరణ కోరగా పేదవాడైన మధూకర్కు ఉద్యోగం ఇప్పించాలనే ఉద్దేశంతో తాను డీసీహెచ్ఎస్ను కోరినట్లు తెలిపాడు. ఇదే విషయమై డీసీహెచ్ఎస్ జగదీశ్వర్ను వివరణ కోరగా ఏటూరునాగారంలో ఖాళీ అయిన రెగ్యులర్ కాంట్రాక్టు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టును మధూకర్కు ఇప్పించాలని సీసీ క్రాంతి తనను కలిసినట్లు చెప్పారు. మంత్రి సీతక్కతో పాటు కలెక్టర్ సిఫారసు లెటర్ తీసుకువచ్చినప్పటికీ నిబంధనల మేరకు ఉద్యోగం ఇవ్వాల్సి ఉంటుందని సీసీకి తెలిపినట్లు పేర్కొన్నారు.