ములుగుటౌన్, ఆగస్టు 18 : రైతులకు వ్యవసాయంలో నూతన పద్దతులపై ఆసక్తి కలిగించి, ఆయిల్ పామ్ సాగుకు కార్యాచరణ సిద్ధం చేయాలని కలెక్టర్ ఎస్ కృష్ణఆదిత్య అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఆయిల్ పామ్ సాగు ప్రణాళిక కార్యాచరణ అమలుపై సమీక్ష నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. ఏఈవోలు ప్రతి గ్రామాన్ని సందర్శిస్తూ రైతులతో మమేకమై వ్యవసాయంలో నూతన పద్ధతులపై ఆసక్తిపెంచాలన్నారు.
గతంలో పండించిన పత్తి, వరి, మిర్చి పంటలే కాకుండా ఆయిల్ పామ్ సాగుపై రైతులను చైతన్యం చేయాలని సూచించారు. జిల్లాలోని ఏటూరునాగారం ఐటీడీఏ నర్సరీలో, తాడ్వాయి మండలం లవ్వాల, లింగాల వంటి గ్రామాల్లో మోడల్ ఆయిల్ పామ్ సాగు ప్రారంభించాలని తెలిపారు. సమీక్షలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గౌస్ హైదర్, హార్టికల్చర్ అధికారి పీవీ రమణ పాల్గొన్నారు.