ములుగు టౌన్/ భూపాలపల్లి రూరల్, జూలై 25 : భారీ వర్షాలు, వరదల కారణంగా డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుడా నియంత్రణకు గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ బీఆర్కే భవన్ నుంచి సీజనల్ వ్యాధుల నియంత్రణ, రెసిడెన్షియల్ పాఠశాలలు, బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్పై సంబంధిత శాఖల మంత్రులు, సీఎస్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ కేసులు నమోదవుతున్నాయని, నియంత్రణకు పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ప్రతి శుక్రవారం ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహించాలని, దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
డెంగీ, మలేరియా బాధితుల చికిత్సకు అవసరమైన వసతులు, మందులు, ప్లేట్ లెట్స్ ప్రభుత్వ దవాఖానల్లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ పాఠశాలలు, గురుకులాలు, కస్తూర్బా విద్యాలయాలు, మోడల్ సూల్స్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందే విధంగా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని మంత్రి సూచించారు. బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ కోసం ప్రజా సంచారం అధికంగా ఉండే బస్టాండ్లు, రైల్వే స్టేషన్ మారెట్లలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాలు, మున్సిపాలిటీలో ఇంటింటా సర్వే నిర్వహించి అర్హులైన ప్రతి ఒకరికీ బూస్టర్ డోస్ వ్యాక్సిన్ వేయాలని మంత్రి ఆదేశించారు.
ములుగులో ఎక్కువగా మలేరియా కేసులు
ములుగు జిల్లాలో అధికంగా మలేరియా కేసులు నమోదవుతున్నాయని ప్రజెంటేషన్ ద్వారా మంత్రి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృష్ణఆదిత్య మాట్లాడుతూ జిల్లాలో 52 మలేరియా కేసులు నమోదయ్యాయని, 194 గ్రామాల్లో ఫీవర్ సర్వే పూర్తి చేసి మెడికల్ క్యాంపుల ద్వారా ప్రజలకు మందులు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. దోమల నివారణకు బ్లీచింగ్, అయిల్ బాల్స్, ఫాగింగ్ మిషన్ ద్వారా పిచికారీ చేసినట్లు తెలిపారు. ప్రతి మండలంలో హెల్త్ టీమ్లు చురుకుగా పనిచేస్తున్నాయని కలెక్టర్ మంత్రికి వివరించారు. 15 రోజుల్లో 12,14 ఏండ్ల పిల్లలకు బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామన్నారు. వీసీలో హనుమకొండ కలెక్టర్ రాజీవ్గాందీ హన్మంతు, వరంగల్ కలెక్టర్ గోపి, భూపాలపల్లి కలెక్టర్ భవేశ్మిశ్రా, ఐటీడీఏ పీవో అంకిత్, అదనపు కలెక్టర్లు ఇలాత్రిపాఠి, టీఎస్ దివాకర, డీఎంహెచ్వో అల్లం అప్పయ్య, శ్రీరామ్, డీపీవోలు వెంకయ్య, ఆశాలత, ములుగు డీఆర్వో రమాదేవి, డీఎల్పీవో దేవారాజ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.