ములుగు, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : మరికొద్ది రోజుల్లో మొదలయ్యే వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఊరువాడన గణనాథుల సందడి కనిపించనున్నది. ప్లాస్టర్ ప్యారిస్ విగ్రహాలతో పర్యావరణానికి ముంపు వాటిల్లుతుందని కొంతకాలంగా పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించేలా ప్రజలను ప్రోత్సహిస్తూ వస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అత్యాధునిక యంత్ర పరికరాలపై దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 4వేల మంది వృత్తిదారులకు మట్టి విగ్రహాల తయారీపై బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. ఇందులో భాగంగా ములుగు జిల్లా ఇంచర్ల శివారు ఎర్రిగట్టమ్మ దేవాలయం వద్ద నివసించే కమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశాడపు దేవేందర్ సైతం శిక్షణ కార్యక్రమంలో మట్టి విగ్రహాల తయారీపై శిక్షణ పొందాడు. ప్రభుత్వం జిల్లా కుమ్మరి సంఘానికి అందించిన ప్రభుత్వ భూమిలో మట్టిపాత్రల తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేశాడు. ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారుల ప్రోత్సాహంతో మండపాల్లో నెలకొల్పే 40 పెద్ద విగ్రహాలతో పాటు ఇండ్లలో ప్రతిష్ఠించే 400 చిన్న విగ్రహాలను తయారు చేసి అమ్మకానికి ఉంచారు. మూడు నుంచి ఆరు ఫీట్ల ఎత్తు కలిగిన మట్టి వినాయక విగ్రహాలను రూ.5వేల నుంచి 10వేల వరకు, ఎనిమిది ఇంచుల చిన్న విగ్రహాన్ని ఒక్కొ దాన్ని రూ.50చొప్పున విక్రయించేందుకు సిద్ధంగా ఉంచారు.
పీఓపీతో పర్యావరణానికి నష్టం
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీకి ఉపయోగించే మిశ్రమంలో క్యాల్షియం, సల్ఫేట్, ఎనామిల్ రంగులతో సీసం వంటి విషపదార్థాలు ఉంటాయి. వీటిని విగ్రహాల తయారీలో ఉపయోగించడం, వాటితో తయారు చేసిన విగ్రహాలను చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేయడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి. చెరువులు, సరస్సులు, నదులు, జలవనరులను, వ్యర్థ పదార్థాల వినియోగం తగ్గించడంతోనే సాధ్యమవుతుంది. విగ్రహాల తయారీలో కృత్రిమ రంగులు, విషపదార్థాలు ఉపయోగించడం వల్ల వృక్ష, జంతు జీవనంపై అనేక ప్రభావం చూపిస్తున్నాయి. నీటిలో కలిసిన అనేక రసాయాలతో మానవులకు ఊపిరితిత్తులతో పాటు చర్మ, కంటి, రక్త సంబంధ వ్యాధులు వస్తున్నాయి. మండప నిర్వాహకులు విగ్రహాల ఎత్తును ఎంచుకుంటూ పోతూ వివిధ లోహాలు, పాస్టర్ ఆఫ్ ప్యారీస్ రంగులతో తయారీ చేసిన విగ్రహాల కారణంగా పర్యావరణానికి ఎంతో నష్టం వాటిల్లుతుంది. దీనింతటిని నివారించాలంటే మట్టితో చేసిన గణపతులనే పూజించాలని ప్రభుత్వం అవగాహన కల్పిస్తూ వస్తున్నది. భక్తిభావంతో ప్రకృతిని కాపాడేలా నిర్వాహకులు చర్యలు చేపట్టినట్లయితే పండుగ విశిష్టతకు భంగం వాటిల్లకుండా ఉంటుంది.
పర్యావరణానికి మేలు : ఆశాడపు దేవేందర్
మట్టి విగ్రహాలను పూజిస్తే పర్యావరణానికి మేలు. నాలుగేళ్ల క్రితం భూదాన్ పోచంపల్లిలో రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది. అప్పటినుంచి మట్టి విగ్రహాలను తయారు చేస్తున్నాం. ముందుగా ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకుంటున్నారు. చెరువు, కుంటల నుంచి నల్లమట్టి తెచ్చి మట్టి పిసికే యంత్రం సహాయంతో విగ్రహానికి కావాల్సిన మట్టిని తయారు చేస్తాం. ఒక్కో విగ్రహాన్ని వారం పడుతుంది. మట్టి విగ్రహాలతో పాటు మా కేంద్రంలో కుండలు, రంజాన్లు, వంట పాత్రలు తయారుచేస్తాం. అన్ని రకాల వస్తువులు మట్టితో చేసి తక్కువ ధరలకు వినియోగదారులకు అందిస్తాం.