నాడు నీళ్లు లేక మన పల్లెలు పడ్డ గోస అంతాఇంతా కాదు.. నేడు అవే పల్లెలు నీటి వనరులతో కళకళలాడుతూ ఉపాధి ముల్లెలుగా తయారయ్యాయి. ఒకప్పుడు ఉపాధి లేక బొంబాయి, దుబాయికి వలసలతో కళ తప్పిన పల్లెలే ఇప్పుడు మరికొందరికి బతుకుదెరువు చూపుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో సాగునీటి వనరులు పుష్కలంగా అందుబాటులోకి రావడంతో వ్యవసాయం పండుగై ఇతర అనుబంధ రంగాల్లోనూ చేతినిండా పనులు దొరికే పరిస్థితులు నెలకొన్నాయి. వరి నాట్లేసేందుకు, పత్తి ఏరేందుకు, మిరప కాయలు తెంపేందుకు వస్తున్న కూలీలకు మన పల్లెలే జీవనాధారంగా మారాయి. ఉమ్మడి జిల్లాలోని చాలా గ్రామాలకు మహారాష్ట్ర, బీహార్, ఒడిషా, ఛతీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ నుంచి కూలీల వలసలు ఏటేటా పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఊరికో ట్రాక్టర్ ఉంటే ఎక్కువ అనిపించే స్థాయి నుంచి నేడు పదులు, వందల సంఖ్యలో రయ్యిరయ్యిన తిరుగుతున్నాయి. ఇలా కూలీలు, ట్రాక్టర్, లారీ డ్రైవర్లు, ఓనర్లకు సైతం ఫుల్ గిరాకీ ఉంటున్నది.
దామెర, సెప్టెంబర్ 23 : మిషన్ కాకతీయతో పూడికతీత, చెరువు కట్టలను బలోపేతం చేయడంతో చెరువుల్లో పుష్కలంగా నీరు ఉంటోంది. ఒకప్పుడు చెరువుల కింద వర్షాకాలంలోనే ఒక పంట పండేది. మిగతా కాలాల్లో ఇటు రైతులకు అటు వ్యవసాయ కూలీలకు పనే దొరక్కపోయేది. ఒక్కోసారి ఇల్లు గడవడం కూడా కష్టంగా మారేది. కొందరు పట్నంల ఇండ్లు కట్టే పనికి పోయేది. ఇప్పుడు చెరువుల్లో పుష్కలంగా నీరు ఉండడంతో ప్రతి రైతూ రెండు, మూడు పంటలు తీస్తున్నడు. ప్రభుత్వం ఉచి తంగా 24 గంటల కరెంటు ఇస్తుండడంతో పంటలకు అవసరమైనప్పుడల్లా నీరు పెడుతున్నం. అందరికీ చేతి నిండా పని దొరుకుతోంది. ట్రాక్టర్లు, లారీలొల్లకు గిరాకీ పెరిగింది. వడ్లు, పత్తి, ఇతర పంట ఉత్పత్తులను మార్కెట్లకు జారగొడుతూ చేతి నిండా సంపాదిస్తున్నరు. రైతులతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల వారు ఆర్థికంగా ఎదుగుతున్నరు. రైతుల మేలు కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉన్నం.
వరంగల్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/వరంగల్, (నమస్తే తెలంగాణ) : నాడు ఎకరం భూమి ఉన్నా నీళ్లు లేక పది గుంటల భూమిలో నాట్లేసేటోళ్లు. తిండి మందం పండించుకునేటోళ్లు. చెరువులున్నా చుక్క నీరు లేక ఆ పంట కూడా గగనమయ్యేది. వ్యవసాయం పెద్దగ లేక చేద్దామన్నా పని ఉండక రైతు కుటుంబాలే కూలీకివోయి పదో.. పర్కో సంపాదించుకుని పొట్ట పోసుకునేటియి. చాలా మంది ఎవుసం విడిచి వేరే పని చూసుకునేటోళ్లు. చివరికి పట్టణాలు, ఇతర రాష్ర్టాలు, దేశాలకు వలసబాట పట్టేటోళ్లు. స్వరాష్ట్రం వచ్చాక ఆది నుంచీ రైతుల మేలు కోరుతున్న బీఆర్ఎస్ సర్కారు, పాలనలో వ్యవసాయానికి పెద్దపీట వేసింది. దుక్కిదున్నే మొదలు, పంట అమ్ముకునేదాకా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నది.
మిషన్ కాకతీయతో బాగుపడిన గొలుసుకట్టు చెరువులతో పాటు సాగునీటి ప్రాజెక్టులు, కాలువలతో పంటలకు పుష్కలంగా నీరందుతున్నది. నాడు పడావుపడ్డ భూములు పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయి. పుష్కలమైన సాగునీరు, ఫుల్ కరెంటు ఇస్తూ రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం కూడా అందిస్తుండడంతో ప్రతి గ్రామంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. పెట్టుబడి సాయం, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందడం, సబ్సిడీపై యంత్రాలు అందుతుండడం, ఇతర సర్కారు ప్రోత్సాహకాలతో ఏటా ఒక్క పంటకే దిక్కు లేని పరిస్థితి నుంచి రైతులు రెండు, మూడు పంటలు వేసే స్థాయికి చేరారు. ఇలా వ్యవసాయ రంగం దినదినాభివృద్ధి చెందడంతో దాని అనుబంధ రంగాల్లోనూ చేతినిండా పనులు దొరుకుతున్నాయి. ఒకప్పుడు వలసలు వెళ్లినవారు సైతం ఇప్పుడు గ్రామాలకు వచ్చి సాగు పనులు చేసుకుంటున్నారు.
అందరూ సాగు బాట పట్టడంతో కూలీలకు కొరత ఏర్పడి ఇతర రాష్ర్టాల నుంచి కూలి పనులకు వలస వస్తున్నారు. సాగునీటి వనరులు పుష్కలంగా పెరగడంతో వ్యవసాయరంగంతో పాటు అనుబంధ రంగాల్లో చేతి నిండా పనులు దొరుకుతున్నాయి. ఇటు కూలీలు, అటు టాక్టర్, లారీ డ్రైవర్లు, క్లీనర్లు, ఓనర్లకు ఫుల్ గిరాకీ ఉంటున్నది. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఒకట్రెండు ట్రాక్టర్లు ఉంటే మహా ఎకువ. అలాంటిది ఇప్పుడు ఏ గ్రామంలో చూసినా పదులు, వందల సంఖ్యలో ట్రాక్టర్లు రయ్యిరయ్యిన తిరుగుతున్నాయి. ఒకానొక దశలో ట్రాక్టర్ డ్రైవర్లకు సంవత్సరానికి లక్షా50వేల రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల జీతం ఇస్తామన్న దొరకడం లేదు. మరోవైపు స్థానికంగా కూలీల కొరత ఉంటుండడంతో పక్క రాష్ర్టాల నుంచి కూలీలు మన పల్లెల్లో పనుల కోసం క్యూ కడుతున్నారు. వ్యవసాయ రంగం పుంజుకోవడంతో దీనికి అనుబంధంగా ఉన్న అన్ని రంగాల్లో ఉపాధి పెరిగింది.
మహబూబాబాద్, సెప్టెంబర్ 23(నమస్తే తెలంగాణ): నేను 40 ఏండ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నా. నా జీవితంల గిన్ని నీళ్లు ఎప్పుడూ చూడలే. సీఎం కేసీఆర్ పుణ్యమా అని మూడు పంటలకు నీళ్లు సరిపోతున్నాయి. తెలంగాణ రాకముందు ఉమ్మడి రాష్ట్రంలో వానకాలంలో కూడా నీళ్లు లేక అరిగోస పడ్డం. అట్లాంటిది ఇప్పుడు ఎండాకాలం, వానాకాలం అనే తేడా లేకుండా నీళ్లు వస్తున్నాయి. నీళ్లు పుషలంగా రావడం వల్ల పంటలు మంచిగ పండిస్తున్నా. వ్యవసాయ కూలీలకు కూడా డిమాండ్ బాగున్నది. సీజన్లో కూలీలు దొరకక వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలతో పనులు చేయిస్తున్నం. ఇదంతా తెలంగాణ వచ్చిన తర్వాతనే సాధ్యమైంది. కేసీఆర్ సార్ను మళ్లీ గెలిపించుకుంటం.
– గుగులోత్ ఈర్యా, రైతు, భజనతండా
బచ్చన్నపేట : సీఎం కేసీఆర్ ముందుచూపు వల్లే పంటలకు ఫుల్లు నీళ్లు వస్తున్నయ్. లో వోల్టేజీ కష్టాల్లేకుండా 24గంటల కరెంటు వస్తాంది. పెట్టుబడికి రంది లేకుంట రైతుబంధు ఇచ్చి అదునుకు ఆసరా అయితాండు. అనుకోకుండా రైతుకు ఏదైనా జరిగితే ఐదు లక్షల బీమా ఇస్తాండు. ఇంకా ఎక్కడచూసినా చెరువులు, కుంటలు నీళ్లలో నిండి కళకళలాడుతానయ్. సాలుకు రెండు పంటలు పుష్కలంగా పండుతానయ్. వ్యవసాయం పెరిగి మాకు కూడా చేతి నిండా పని దొరుకుతాంది. నేను మబ్బుల్నే ట్రాక్టర్ ఎక్కుతం. మధ్యాహ్నం అన్నం తిని చేసి మళ్లీ పనికి ఎక్కుతం, పొద్దుపోయే దాక ట్రాక్టర్ను నడుపుతూనే ఉంటం. చేతి నిండా పని, జేబునిండా పైసల్. కుటుంబాన్ని మంచిగ పోషించుకుంటాన. ట్రాక్టర్ కిస్తీలు కట్టుకుంటున్న. ఇప్పడు మంచిగ ఉంది. కేసీఆర్ సర్కార్ మంచిగ ఉండాలె. మళ్లీ అధికారంలోకి రావాలె.
– పర్వతం రాజు, ట్రాక్టర్ డ్రైవర్, ఆలింపూర్
పాలకుర్తి, సెప్టెంబర్ 23 : స్వరాష్ట్రంలో పంటలు ఆశాజనకంగా ఉన్నాయి. నీటి వనరులకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ప్రభుత్వం నుంచి రైతుబంధు సాయం, సకాలంలో విత్తనాలు, ఎరువులను అందుతున్నాయి. సరైన సమయంలో పంటలు వేసుకున్నాం. సీజన్ ప్రారంభం నుంచి సాగుకు వర్షాలు వాతావరణం అనుకూలించడం వల్ల మంచి దిగుబడి వస్తోంది. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను వ్యవసాయరంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది. సమైక్యపాలనలో సాగునీరు, కరెంట్ లేక రైతులు చాలా ఇబ్బందిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత విద్యుత్ కష్టాలు పోయాయి. కేసీర్ ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నది. నాకు ఉన్న ఏడు ఎకరాల్లో వరి వేశాను. పంటకు పెట్టబడి కనీసం రూ.10వేలు ఖర్చు అవుతుంది. సొంత ట్రాక్టర్ ఉంది. బావులు, బోరులో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. కరెంట్ ఫుల్ ఉంటాంది. ఇక పంటలకు ఎలాంటి ఇబ్బందులు లేవు.
– పుర్మ రఘపాల్రెడ్డి, రైతు, మల్లంపల్లి
నల్లబెల్లి, సెప్టెంబర్ 23 : గోదావరి జలాలతో పాటు ఎస్సారెస్పీ నుంచి డీబీఎం-38 కెనాల్ ద్వారా వచ్చే నీళ్లతో బీడు భూములు సైతం సస్యశ్యామలమయ్యాయి. గత ప్రభుత్వాలు ఏనాడూ రైతులను పట్టించుకోలేదు. సాగునీరు, కరంటు సరిగా లేక అరిగోస పడేది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ సీఎం కావడం వల్లే వ్యవసాయానికి మంచిరోజులు వచ్చినయ్. 24గంటల కరెంట్ సరఫరాతో కష్టాలు తీరాయి. ఇప్పుడు రెండు పంటలు మంచిగ పండిస్తున్న. కాలం కలిసిరావడం మరోవైపు గోదావరి జలాలతో పాటు ఎస్సారెస్పీ నీరు సమృద్ధిగా రావడం వల్ల మండు వేసవిలో కూడా చెరువులు మత్తళ్లు పడుతున్నయ్. నా 65 ఏండ్ల జీవితంల ఎండాకాలంల చెర్వులు మత్తడి పడింది చూడలే. ఇదంతా కేసీఆర్ పుణ్యమే. తాగునీటి కోసం నల్లాల కాడ బీడుపడేది. ఇయ్యాల మిషన్ భగీరథ నీళ్లు వచ్చి తాగునీటి కష్టాలు తీర్చినయ్. ఒకనాడు ఖరీఫ్ సీజన్ వచ్చిందంటే పంట పెట్టుబడికి అప్పులు కోసం తిరిగేది. సాగునీరు, కరెంటు లేక పంటలు పండక అప్పులు పాలయ్యేది. సీఎం సార్ అదునుకు రైతుబంధు డబ్బులు ఇవ్వడం వల్ల అప్పులు తేవడం తప్పింది. పంట దిగుబడి పెరగడం వల్ల కుటుంబమంతా సంతోషంగా బతుకుతున్నం.
-బుచ్చిరెడ్డి, రైతు, రుద్రగూడెం
వర్ధన్నపేట, సెప్టెంబర్ 23 : తెలంగాణ వచ్చినంక నీళ్లు పుష్కలంగా ఉంటానయ్. చెరువులు, కుంటలు నిండుగా ఉండడం వల్ల రెండు పంటలు పండిస్తున్నా. వరితో పాటు మెట్ట పంటలు కూడా రైతులు సమృద్దిగా సాగు చేసుకుంటాన్రు. దీనివల్ల రైతు కూలీలకు కూడా గ్రామాల్లో చేతినిండా పనిదొరుకుతాంది. తెలంగాణ రాకముందు రోజుకు రూ.400ల కూలీ దొరుకుడే కష్టంగా ఉండేది. కానీ నీళ్లు పుష్కలంగా ఉండడం వల్ల పంటలు ఎక్కువగా సాగవుతున్నాయి. వ్యవసాయ పనులు పెరిగినయ్. పనులు ఉండడం వల్ల కూలీలు దొరుకుడు కష్టమై.. రైతులు కూలీ రేట్లు కూడా పెంచుతాన్రు. ఈ వానకాలంల పొలం పనులకు పోతే రోజుకు రూ.900 వరకు కూలీ గిట్టుబాటు అయింది. నేను, నా భార్య, ఇద్దరం కూలీ పనులకు పోతే రోజుకు రూ.1300ల వరకు వస్తున్నయ్. ఇద్దరు పిల్లల్ని కూడా మంచిగ చదివించుకుంటానం. తెలంగాణ రాకముందు నేను జీతం ఉండేది. ఇప్పుడు నీటి సౌలత్ పెరగడం వల్ల జీతం ఉండుడు మానేసి రోజూ కూలీ పనులు, హమాలీ పనికి పోతున్నా. నాతో పాటు మా ఊళ్లో ఎప్పటికీ పనులు ఉంటానయ్. ఇదంతా కేసీఆర్ సార్ పుణ్యమే.
– అంగోత్ స్వామి, వ్యవసాయ కూలీ, డీసీతండా
రేగొండ, సెప్టెంబరు 23 : కేసీఆర్ సార్ పాలనలో సాగు నీళ్లకు ఢోకా లేదు. ఏడాది పొడవునా చేతినిండా పని ఉంటాంది. ఇదివరకు ఒక పంట కూడా సక్కగ నీళ్లుండకపోయేది. కరెంట్ ఎప్పుడత్తదో తెల్వక ఆగమయ్యేది. కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయినంక వ్యవసాయానికి మంచిరోజులు వచ్చినయ్. తెలంగాణ వచ్చిన కాన్నుంచి రైతులు బాగుపడాలని ఎంతో తపన పడుతున్నడు. చెరువులు నింపుతున్నడు. మిషన్ కాకతీయ పథకం కింద చెరువులకు రిపేర్లు చేపిచ్చిండు. తూములు, కట్టలకు బందవస్తు చేశిండు. వానలు సుత మంచిగ పడుతున్నయ్. ప్రాజెక్టులు కట్టి రైతులకు కడుపునిండా నీళ్లు ఇత్తాండు. నీళ్లు ఎప్పటికీ వచ్చుట్ల బావులు, బోర్లలో నీళ్లు మస్తుంటానయ్. కాలం మంచి అయి ఇప్పుడు మూడు పంటలు పండుతానయ్. చేతినిండా పని ఉంటాంది. దుక్కి దున్నడానికి ట్రాక్టర్లు, కైకిలోళ్లు దొరుకుతలేరు. వ్యవసాయం ఎక్కువై ఎవలూ రికాం ఉంటలేరు. ఒకప్పుడు కరువుతోటి ఆగమైనోళ్లు ఇప్పుడు సంతోషంగా ఉంటానం.
– బోయిని సమ్మయ్య, రైతు జగ్గయ్యపేట
ఐనవోలు, సెప్టెంబర్ 23: తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత చెరువులు, కుంటలు పూడిక తీయించింది. దీని వల్ల చెరువు, కుంటల్లో నీళ్ల నిల్వ పెరిగింది. బావులు, బోర్లలో కూడా నీళ్లు పెరిగి పంటలు పుష్కలంగా పండుతున్నాయి. గతంలో ఒక్క పంట పండిస్తేనే గొప్ప అనుకునేది. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఒక్కటి కాదు, మూడు పంటలు పండించే స్థాయికి వచ్చాం. నీళ్లకు కొదవలేదు. మా ఊళ్లో వాన పడితేనే చెరువులు నిండేటియి. కానీ గత ఆరేడు ఏండ్ల నుంచి ఏ రోజు కూడా ఎండిపోలేదు. ఇప్పుడు చూద్దామన్నా బీడు భూమి కనపడతలేదు. పంట సాగు ఎక్కువైంది. వ్యవసాయం చేద్దాం అంటే కూలీ మనుషులే దొరకడం లేదు. ఒక్కప్పుడు పనులు లేక ఖాళీగా ఉండేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ఇదంతా కేసీఆర్ సారు ముందుచూపు వల్లే.
– నిమ్మాని వెంకటేశ్వర్రావు, రైతు, కక్కిరాలపల్లి
మహబూబాబాద్, సెప్టెంబర్ 23(నమస్తే తెలంగాణ): నేను 2010లో ట్రాక్టర్ కొనుగోలు చేశా. అప్పటినుంచి అరకొరగా పనులు ఉండేవి. కొన్ని రోజులే గిరాకీ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిన తర్వాత ఎస్సారెస్పీ కాల్వల నుంచి ఏడాది పొడవునా నీళ్లు రావడం వల్ల వ్యవసాయం పెరిగింది. అప్పటినుంచి మళ్లీ పనులు మొదలయ్యాయి. 2017 నుంచి ట్రాక్టర్లకు మెల్లగా డిమాండ్ పెరుగుతూ వచ్చింది. 2020లో మరో కొత్త ట్రాక్టర్ కొనుగోలు చేశాను. దీనితో పాటు రోటవేటర్ కూడా కొన్న. గతంలో పనులు లేక మొరం, పెంటకుప్పల ట్రిప్పులు కొట్టేది. ఇప్పుడు 24గంటలు వ్యవసాయ పనులు ఉంటున్నాయి. రికాం లేకుండా పనిచేసుకుంటున్న. ఇదంతా తెలంగాణ వచ్చిన తర్వాతనే సాధ్యమైంది.
– తాళ్ల మధు, వావిలాల, నెల్లికుదురు