హనుమకొండ, జనవరి 11 : రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ధ్వజమెత్తారు. హనుమకొండ నక్కలగుట్టలోని హరితకాకతీయ హోటల్లో ఎంపీ పసునూరి దయాకర్, మాజీ ఎంపీ సీతారాంనాయక్తో కలిసి బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతూ, అసమానతలను పెంచుతోందని పేర్కొన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతోందని అన్నారు. అలాగే, ఆహారపు అలవాట్లను సైతం నియంత్రిస్తోందని కడియం ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై దళిత మేధావులు, ప్రజాసామ్యవాదులు అప్రమత్తం కావాలని పిలుపునిచ్చారు. 1961 నుంచి 2021 వరకు ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు కేంద్రం ప్రభుత్వం పెంచలేదన్నారు. దేశ జనాభాలో ఎస్సీలు 18 శాతం, ఎస్టీలు 10 శాతం ఉన్నారని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేసిన కడియం.. దామాషా ప్రకారం ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుందని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కు రిజర్వేషన్లు అని, అంబేదర్ ఇచ్చిన దళితుల హకులను కాలరాయొద్దని ఆయన కోరారు. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మ్యానిఫెస్టోలో పెట్టిన బీజేపీ.. 8 ఏండ్లలో కనీసం 16 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో మోదీ సర్కారు పూర్తిగా విఫలమైందని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్పరం చేస్తూ ఉద్యోగులను రోడ్డుపాలు చేసి, నిరుద్యోగులకు మొండి చేయి చూపుతోందని ధ్వజమెత్తారు. కులాలు, మతాల మధ్య కేంద్రం పెట్టే చిచ్చుతో దళిత వర్గాలే ఎక్కువగా నష్టపోతున్నాయని అన్నారు. 8 సంవత్సరాల పాలనలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలపై దాడులు, హత్యలు, లైంగిక దాడులు ఎక్కువగా పెరిగాయన్నారు. కేంద్రం విధానాలతో ఎస్సీ, ఎస్టీలకు నాణ్యమైన విద్యకు అందుబాటులో ఉండడం లేదని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 744 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
తెలంగాణ రాక ముందు కేవలం 303 గురుకుల పాఠశాలలు మాత్రమే ఉండేవన్నారు. 1716 గురుకుల పాఠశాలలు, కేజీవీబీలు, మాడల్ స్కూళ్లలో 8 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని, ఒక్కో విద్యార్థిపై రాష్ట్ర సర్కారు రూ. 1.20లక్షలు ఖర్చు చేస్తున్నదని తెలిపారు. అలాగే దళితుల ఆర్థిక సాధికారత కోసం దళిత బంధు పథకం ప్రవేశపెట్టి, రూ.10 లక్షల చొప్పున గ్రాంట్ రూపంలో ఇస్తున్నట్లు వివరించారు. రానున్న బడ్జెట్లో గిరిజన బంధును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. తెలంగాణ మోడల్ను దేశవ్యాప్తంగా కోరుకుంటున్నారని, అందుకే బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని కోరారు. ఈ నెల 18వ తేదీన ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, ఇతర వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని, సీఎం కేసీఆర్కు అండగా ఉండాలని కడియం శ్రీహరి పిలుపునిచ్చారు.
జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలి : ఎంపీ పసునూరి దయాకర్
జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు పెంచాలని ఎంపీ పసునూరి దయాకర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా ఒకటే పాలసీ అంటున్న కేంద్రం దేశ వ్యాప్తంగా ఒకే రిజర్వేషన్ విధానం అమలు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం దళితులపై వివక్ష చూపుతోందని, అన్ని రంగాల్లో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతోందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మతిలేకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. బీజేపీ నాయకులు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయకుండా కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని పేర్కొన్నారు.
రిజర్వేషన్లు పెంచాల్సిందే : మాజీ ఎంపీ సీతారాంనాయక్
60 ఏళ్లుగా ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు పెంచకపోవడం వెనుక ఆర్ఎస్ఎస్ కుట్ర ఉందని మాజీ ఎంపీ సీతారాంనాయక్ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల పెంపుపై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. 50 శాతం కంటే ఎకువైనా ప్రత్యేక చట్టం ద్వారా రిజర్వేషన్లు పెంచే అవకాశం ఉన్నా ఆదిశలో కేంద్రం చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.