ఉమ్మడి వరంగల్ జిల్లాలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఆయా గ్రామాల్లోని చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా గార్ల శివారులో ఉన్న పాకాల ఏరు పొంగి ప్రవహిస్తుండడంతో రాంపురం, మద్దివంచ గ్రామాలకు అధికారులు రాకపోకలు నిలిపివేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అలాగే మహబూబాబాద్ శివారు మున్నేరు ఉధృతంగా పారుతున్నది. అలాగే హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని కాలనీలు జలమయం కాగా, శివారులోని చలివాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో భారీ వర్షాలకు పంట పొలాలు, మిర్చి తోటల్లో వరద వచ్చి చేరడంతో నీట మునిగాయి.
మండలంలోని బూర్గుపేటలో మారేడు కొండ మత్తడి పడడంతో రోడ్డుపై వరద నీరు నదిలా ప్రవహిస్తున్నది. ములుగు-భూపాలపల్లి ప్రధాన రహదారి పైనుంచి మత్తడి నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇటు ములుగు జిల్లాకేంద్రంలో కుండపోత వాన పడడంతో కొద్దిసేపు జాతీయ రహదారిపై వరద నీరు నిలిచింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలకేంద్రంలోని గణప సముద్రం మత్తడి పడింది. అలాగే మోరంచ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అప్పయ్యపల్లి, సీతారాంపురం, కొండాపురం, రంగరావుపల్లి గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.
– నమస్తే నెట్వర్క్, సెప్టెంబర్ 22