సిటీబ్యూరో, మే 7 (నమస్తే తెలంగాణ) ;నాలుగేండ్ల పిల్లోడి పేరు శ్రీయాన్. తల్లిదండ్రుల వెంట షాపింగ్కు వెళ్లాడు. పేరెంట్స్ తమ షాపింగ్ పని ముగించే వరకు ఆ బాబు చేతిలో మొబైల్ ఉంచారు. అప్పటి వరకు బాబు ఎంతో బుద్ధిమంతుడిగా ఓ పక్కన కూర్చొని సెల్ఫోన్ ప్రపంచంలో మునిగిపోయాడు. సీన్ కట్ చేస్తే అతడి తండ్రి చాలా సేపట్నుంచి మొబైల్ వాడుతున్నాడంటూ బాబు నుంచి మొబైల్ లాక్కున్నాడు. ఇక షురూ అయింది. సైతాన్ ఆ బాబులో చేరినట్టుగా షాపింగ్ మాల్ అంతా ధ్వనించేలా ఏడుపు అందుకున్నాడు. అటు ఇటూ పరుగెడుతూ కేకలు వేస్తున్నాడు. కిందపడిపోయి బొర్లుతున్నాడు. ముందర ఉన్న వస్తువులను విసిరిపడేస్తున్నాడు. పిల్లాడి ప్రవర్తనను చూసిన అక్కడి వారంతా ఏం జరుగుతుందోనని తదేకంగా చూస్తున్నారు. వామ్మో అనుకున్న తండ్రి .. వాడి చేతిలో మళ్లీ సెల్ఫోన్ ఉంచగానే ఒక్కసారికి ఉరుముల వాన.. ఆగిపోయినట్టుగా ప్రశాంతత ఆవరించింది.” ఇలాంటి సంఘటనలు చాలా మంది తల్లిదండ్రులకు అనుభవమే.
పేరెంట్స్ మీదే బాధ్యత..!!
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితాల్లో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు పదేపదే ఏడుస్తున్నారని, దేనికో మారాం చేస్తున్నారని చటుక్కున మొబైల్ ఫోన్ ఇవ్వడం సాధారణంగా మారింది. ఇది చాలా ప్రమాదకరం. మొదట వారు ప్రతీది చుట్టూ ఉన్న బాహ్య వస్తువులకే అలవాటు పడాలి. అప్పుడే వాళ్ల మెదడు సహజంగా వృద్ధి చెందుతుందనే విషయం గుర్తుంచుకోవాలి. పిల్లల ముందర పేరెంట్స్ అధికంగా మొబైల్లో గడపకూడదు. ఇది చాలా ప్రమాదకరం. వారు వచ్చి మాట్లాడితే పట్టించుకోకుండా మొబైల్లో గడిపితే వారు కూడా మిమ్మల్నీ అనుసరిస్తారు. పక్కనుండే వారిని పట్టించుకోరు. ఇది వారిలోని భాషా నైపుణ్యాలను ఎదగనివ్వదు.
చంటి పిల్లలూ.. జరభద్రం!!
మొబైల్ ఎక్కువగా వాడడంతో పిల్లలకు ఆటిజం లాంటి సమస్య కూడా వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఓ చిన్నారి ఏడుస్తుందని పేరెంట్స్ ఆమెకు సెల్ఫోన్ ఇస్తే ఆడుకుంటుండగా మొబైల్ పేలి ఆ బాలిక చనిపోయింది. ఏ విధంగా చూసినా పిల్లలు మొబైల్ వాడకం ప్రమాదకరమే అనే విషయం గుర్తుంచుకోవాలి. పిల్లల ఎదుగుదలలో తొలి రెండు నుంచి నాలుగేండ్లు చాలా కీలకం. వాళ్ల మెదడు వేగంగా వికసించే వయసు ఇది. తల్లిదండ్రులు చెప్పే మాటలు విని ఊకొట్టి, వాళ్లని అనుసరించే అన్నీ నేర్చుకుంటారు. ఆట వస్తువుల్ని తడిమి చూసే స్పర్శజ్ఞానం తెలుసుకుంటారు. బయట పిల్లలతో కలిసి ఆటలాడడం ద్వారా వ్యక్తీకరణ, ఎమోషన్స్ నేర్చుకుంటారు. సహజమైన ఈ ఎదుగుదలకు గ్యాడ్జెట్లు అడ్డుపడుతున్నాయి. పిల్లలను పూర్తిగా తమ వశం చేసుకొని కదలనివ్వకుండా చేస్తున్నాయి.
నెమ్మదిగా దృష్టి మరల్చాలి..!!
మొబైల్కు వ్యసనంగా మారిన పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరు పిల్లలకు ఎంత సులభంగా మొబై ల్స్ అలవాటు చేస్తారో.. మాట వినకపోతే వాటిని వాళ్ల నుంచి అంతే బలవంతంగా తీసుకుంటారు. అప్పటికే మొబైల్ వ్యసనంగా మారిన పిల్లల్లో ఇది తీవ్రమైన మనోవ్యాకులతకు గురి చేస్తుందని సైకాలజిస్టులు తెలిపారు. అలా చేయడం ప్రమాదకరం. అలాంటి పరిస్థితుల్లో మొదటగా పిల్లలను ఆకట్టుకునే ఆటలూ, కథలూ, బాలగేయాలు నేర్పే యాప్స్ని డౌన్లోడ్ చేసి వారిని అవి చూసేలా ప్రోత్సహించాలి. నెమ్మదిగా వారు ప్రయోగకరమైన కంటెంట్లోకి వస్తారు. అందులో మంచి అలవాట్లు ఉండడంతో వాటిని పాటిద్దాం అంటూ పేరెంట్స్ అనుసరిస్తూ వారికి నేర్పించాలి. రోజులో గంటకు మించి మొబైల్ వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మొబైల్ని ఇచ్చినప్పుడు పొరబాటున కూడా అశ్లీల, హింసాత్మకమైన సైట్లు వాళ్ల కంటపడకుండా చూడాలని నిపుణులు చెబుతున్నారు.
భారంగా ఫీలవ్వొద్దు..
మొబైల్ను వాడుతున్న చిన్నారులు ఎక్కువగా కార్టూన్స్, చిన్న పిల్లల యాక్టివిటీస్ చూస్తుంటారు. వారికి అవే ఎంతో గొప్పగా అనిపిస్తాయి. అవి తప్ప మరేవి ఆసక్తికరంగా కనిపించవు. పది నిమిషాల కన్నా ఎక్కువ దేనిపైనా శ్రద్ధ పెట్టలేరు. దీనిని అటెన్షన్ డెఫిసిట్ సిండ్రోమ్ అంటారు. అయితే ఈ తప్పంతా తల్లిదండ్రులదే. పిల్లల్నీ సాంకేతిక పరికరాలకు అతుక్కుపోయేలా తల్లిదండ్రులు చేస్తున్నారు. పిల్లలను ఎలా అదుపు చేయాలో తెలియక ఎక్కువ మంది పేరెంట్స్ మొబైల్ ఇస్తున్నారు.
–ఎం. రామచందర్, సైకాలజిస్టు.
మారాల్సింది తల్లిదండ్రులే..
రాత్రుళ్లు మొబైల్ ఫోన్ల నుంచి వచ్చే లేత నీలి వెలుగు నిద్రను కరువు చేస్తుంది. వీటి బారినపడుతున్న పిల్లలు చిన్నప్పుడే తీవ్ర నిద్రలేమికి గురవుతున్నారు. ఏకాగ్రత కోల్పోతున్నారు. ఉద్వేగాలని అదుపు చేయగలిగే పరిస్థితి కూడా ఉండట్లేదు. ముందు గా మారాల్సింది తల్లిదండ్రులే. మనమెలా మార్గదర్శనం చేస్తే వాళ్లు అలా ముందుకెళ్తారు. ఏదైనా శారీరక, మానసిక వ్యాయామాన్ని ఇచ్చే క్రీడల్లో వాళ్లను ప్రోత్సహించాలి.
–కవిత పాన్యం, సైకాలజిస్టు
సెలవుల్లో ఇలా చేద్దాం..!!