దేశానికి తెలంగాణ రాష్ట్రం ధాన్యాగారమని ఎమ్మెల్సీ, కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ అన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 51, 52, 59 డివిజన్ల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా దేశపతి హాజరై మాట్లాడుతూ ప్రధాని మోదీ దేశ సంపదను అదానీ, అంబానీకి దోచి పెడుతున్నారని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడంతో పాటు హైదరాబాద్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కూడా ఏర్పాటు చేశారని వివరించారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల ఆస్తి పెంచితే.. సీఎం కేసీఆర్ ప్రజల ఆస్తి పెంచారని చీఫ్ విప్ పేర్కొన్నారు.
– హనుమకొండ, ఏప్రిల్ 7
హనుమకొండ, ఏప్రిల్ 7 : దేశానికి తెలంగాణ రాష్ట్రం ధాన్యాగారంగా మారిందని ఎమ్మెల్సీ, కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని 51, 52, 59 డివిజన్ల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం వీరేందర్ అధ్యక్షతన పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ముందుగా సీఎం కేసీఆర్ సందేశాన్ని చీఫ్ విప్ చదివి వినిపించారు. డివిజన్ల సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. ముఖ్య అతిథిగా దేశపతి శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ వరంగల్కు ఎంతో ఘనచరిత్ర ఉందన్నారు. ఒక మహిళ రాజ్యం ఏలుతుందని వరంగల్ నిరూపించిందన్నారు. అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాలు, స్ఫూర్తిని నిజం చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడంతో పాటు హైదరాబాద్లో 125 అడుగుల విగ్రహం కూడా ఏర్పాటు చేయనున్నారన్నారు. తెలంగాణ మట్టిలో నీతి నిజాయితీ ఉందన్నారు.
సమైక్య పాలనలో కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులు ఆదరణకు నోచుకోలేదన్నారు. రైతులు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలున్నాయన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ తెలంగాణ కోటి రతనాల వీణ అనే విధంగా వ్యవసాయాన్ని పండుగ చేశారన్నారు. వేసవిలో సైతం చెరువులు, కుంటలు మత్తడి పోయడం, వాగులు, వంకలు పొంగడంతోపాటు భూగర్భ జలాలు పెరిగాయని చెప్పారు. తద్వారా వరిసాగు సైతం పెరిగిందన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగుతోందన్నారు. దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా రాష్ట్రం అవతరించిందని దేశపతి అన్నారు. పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పారిశుధ్యంతో పాటు పచ్చని చెట్లు స్వాగతం పలుకుతున్నాయన్నారు. సీఎం తీసుకుంటున్న నిర్ణయాలతో గ్రామాల నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు తిరిగి వస్తున్నారని తెలిపారు.
ఒక్క రూపాయి ఇవ్వని కేంద్రం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని దేశపతి శ్రీనివాస్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలు ప్రశాంత జీవనం గడుపుతుంటే మతతత్వ బీజేపీ చిచ్చుపెట్టి రక్తం పారించే ప్రయత్నం చేస్తోందన్నారు. అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని, ఏటా 2వేల కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన మోదీ ఇప్పటి వరకు ఏం చేశారని ప్రశ్నించారు. విభజన చట్టంలోని ఒక్క హామీని నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. పూర్తిగా కార్పొరేట్ వ్యవస్థలకు కొమ్ముకాస్తోందన్నారు. బీజేపీలో చేరండి లేకుంటే జైలుకు వెళ్లాల్సి వస్తుందని ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నిరంగాల్లో రాష్ర్టాన్ని అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ను కాపాడుకొనేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్మికవర్గాన్ని ఆదుకోవడంలో దాస్యం వినయ్భాస్కర్ రాష్ర్టానికే ఆదర్శంగా నిలిచారన్నారు. ప్రజలపై దాస్యం.. నాయకుడి పట్ల వినయం.. ప్రతిపక్షాల పట్ల భాస్కరుడు.. అతడే దాస్యం వినయ్భాస్కర్ అని దేశపతి శ్రీనివాస్ కొనియాడారు.
అన్నదాతల ఏడుపులు, ఆకలి కేకలు లేవు : చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ సైనికులు పండుగ వాతావరణంలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి ఇంటింటా వివరించాలని కార్యకర్తలకు సూచించారు. 60 లక్షల మంది గులాబీ సైనికులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. నాడు ఎట్లా ఉన్న తెలంగాణ నేడు ఎట్లా ఉందన్నారు. అన్నదాతల ఏడుపులు, ఆకలి కేకలు, ఆత్మహత్యలు లేవన్నారు. 60 ఏండ్లలో జరుగని అభివృద్ధి ఎనిమిదేళ్లలోనే జరిగిందన్నారు. రా ష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బీఆర్ఎస్, సీఎం కేసీఆర్కు దేశ వ్యాప్తంగా వస్తున్న ఆదరణను చూసి కొన్ని రాజకీయ పార్టీలు కుట్రలకు పాల్పడుతున్నాయని పేర్కొన్నారు. కేంద్రం కార్పొరేట్ల ఆస్తి పెంచితే, సీఎం కేసీఆర్ ప్రజల ఆస్తి పెంచారని వివరించారు. దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ నిలుస్తుందన్నారు. కార్యకర్తలు బలం, ప్రజలు బలగం అని అన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ పతనం ఖాయమన్నారు. కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్, మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ తాళ్లపల్లి జనార్దన్గౌడ్, కార్పొరేటర్లు, డివిజన్ల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.
రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేసింది కేసీఆరే
దేశంలో ఎక్కడా లేనివిధం గా 9 సంవత్సరాల్లో రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం కేసీఆర్దే. అలాగే వ్యవసాయాన్ని పండుగ చేశారు. ఇప్పుడు ఎక్కడ చూసినా చెరువులు నిండుకుండలా మారాయి. ఒకప్పుడు మురికి కూపంగా ఉన్న హౌసింగ్ బోర్డు కాలనీ ఇప్పుడు సీసీ రోడ్లు, డ్రైనేజీలు, చెత్తలేకుండా కళకళలాడుతోంది. ఇదంతా చీఫ్విప్ వినయ్భాస్కర్తోనే సాధ్యమైంది. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చూస్తాం.
– జయపాల్, బీఆర్ఎస్ నాయకుడు
పేదింటి మేనమామ సీఎం కేసీఆర్
పేదల మేనమామ సీఎం కేసీఆర్ అయ్యారు. అట్టడుగు వర్గాల వారికి ఇంటి పెద్ద దిక్కుగా నిలిచారు. గతంలో ఏ సీఎం ఇవ్వనట్లుగా అందరి కోసం పథకాలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా పేదింటి ఆడపిల్లల వివాహాలకు కల్యాణలక్ష్మి పథకం అమలు చేయడంతో ఎంతోమంది నా లాంటి వాళ్లకు న్యాయం జరుగుతోంది.
– వనజ, 52వ డివిజన్