జయశంకర్ భూపాలపల్లి, డిసెంబర్ 8(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో, 11 ఏరియాల్లో విస్తరించి ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో ఈ నెల 27న గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు జరగనున్నా యి. సంస్థలో పనిచేస్తున్న 39,832 మంది కార్మికులు ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుని ఏదో ఒక సంఘానికి గుర్తింపు హోదా తీర్పు ఇవ్వబోతున్నారు. 13 కార్మిక సంఘాలు ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఈ నెల 4న అన్ని కార్మిక సంఘాల నాయకులతో హైదరాబాద్లో డిప్యూటీ చీఫ్ లేబర్ కమీషనర్ తన కార్యాలయంలో సమావేశం నిర్వహించి ఓటర్ల జాబితాను అందజేశారు. సింగరేణిలో నాలుగు సార్లు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ), రెండు సార్లు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్)లు గుర్తింపు కార్మిక సంఘం హోదా దక్కించుకున్నాయి. ప్రస్తుతం 7వ సారి జరుగనున్న గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో గెలుపొందేందుకు సంఘాలు పోటీ పడుతున్నాయి. అక్టోబర్ 19న సింగరేణి ఎన్నికలు జరుపాలని డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషన్ నిర్ణయించగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా డిసెంబర్ 27కి వాయిదా వేస్తూ హైకోర్టు తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ, సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ నాయకులు సింగరేణిలోని కోల్బెల్ట్ ఏరియాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం విశేష కృషిచేశారు. కోల్బెల్ట్ ఏరియాలోని కాంగ్రెస్ అభ్యర్థులు అందరూ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వారి గెలుపు వెనుక ఏఐటీయూసీ నాయకుల శ్రమ ఎంతో ఉంది. కాగా ప్రస్తుతం సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సింగరేణి కోల్మైన్స్ లేబర్ యూనియన్ (ఐఎన్టీయూసీ), సీపీఐ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ)లు పోటీలో దిగుతున్నాయి. గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వారి అనుబంధ ఐఎన్టీయూసీ గెలుపునకు కృషి చేయాలా.. మరోవైపు వారి విజయానికి కృషి చేసిన ఏఐటీయూసీ నాయకులకు సహకరించాలా..? లేక డివిజన్లను పంచుకుని పొత్తుతో పనిచేయాలా అనే విషయమై సందిగ్ధం నెలకొంది. ఈ పరిస్థితి రెండు యూనియన్ల కేడర్లను డైలమాలో పడేసింది.
సింగరేణిలోని 11 ఏరియాల్లో 39,832 మంది కార్మికులు పనిచేస్తున్నారు. బెల్లంపల్లి ఏరియాలో 985 మంది, మందమర్రిలో 4876మంది, శ్రీరాంపూర్లో 9124, కార్పొరేట్లో 1112, కొత్తగూడెంలో 2370, ఇల్లెందులో 603, మణుగూరులో 2414, రామగుండం-1లో 5430, ఆర్జీ-2లో 3479, ఆర్జీ-3లో 3063, భూపాలపల్లిలో 5350 మందితో పాటు అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులో 944 మంది, నైనిలో ఇద్దరు కార్మికులు పనిచేస్తున్నారు. కాగా సింగరేణిలోని మందమర్రి, శ్రీరాంపూర్, ఆర్జీ-1, భూపాలపల్లి డివిజన్లలో అత్యధికంగా కార్మికులు ఉన్నారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపు, ఓటములను నిర్ణయించే ఈ నాలుగు డివిజన్లపైనే కార్మిక సంఘాలు ఎక్కువగా దృష్టిసారిస్తున్నాయి. గతంలో జరిగిన గుర్తింపు ఎన్నికల్లో ఈ నాలుగు డివిజన్లు గెలుపు బాటలు వేశాయి.
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఎమ్మెల్సీ, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కవిత కోల్బెల్ట్ ఏరియా టీబీజీకేఎస్ నేతలతో ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారు. టీబీజీకేఎస్ అగ్రనేతలు వెంకట్రావ్, మిర్యాల రాజిరెడ్డి, కెంగర్ల మల్లయ్యతో కవిత ప్రత్యేకంగా భేటీ అయి పరిస్థితులపై సమీక్షించారు. గురువారం రాత్రి భూపాలపల్లి, మణుగూరు, ఇల్లెందు, కొత్తగూడెం ఏరియాల టీబీజీకేఎస్ ముఖ్య నాయకులతో రివ్యూ నిర్వహించారు. క్రమక్రమంగా మిగిలిన డివిజన్ల నాయకులతో సమీక్షలు జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పోగొట్టిన జాతీయ సంఘాల పనితీరును ఎండగట్టాలని, వారసత్వ ఉద్యోగాలు ఇప్పించిన టీబీజీకేఎస్ను ఆదరించాలని, కార్మికుల్లోకి వెళ్లాలని కవిత నాయకులను దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే మనం సాధించిన ప్రతీ హక్కును కార్మికులకు వివరించాలని కోరుతున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైందని ఎవరూ బాధపడొద్దని, అధైర్యపడొద్దని, ఎలాంటి సపోర్టు లేనప్పుడే కొట్లాడి తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చుకున్నామని, అదే స్ఫూర్తితో ముందుకుసాగుదామని నాయకుల్లో ధైర్యం నింపుతున్నారు. ఓడినా ఎల్లప్పుడూ మీ ముందే ఉంటామని, ప్రజల, కార్మికుల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటామని, పార్టీ కార్యకర్తలు, యూనియన్ నాయకులను కంటిరెప్పలా కాపాడుకుంటామని భరోసా ఇస్తున్నారు. తెలంగాణకే తలమానికం అయిన సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదేనని సింగరేణి ఇతర యూనియన్లు, పార్టీల చేతిలోకి వెళ్తే సంస్థ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని కవిత నాయకులకు తెలిపారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో పట్టుదలతో పనిచేయాలని ఏరియాల వారీగా ఇన్చార్జిలను నియమిస్తామని, త్వరలో మేనిఫెస్టోను విడుదల చేస్తామని నాయకులతో కవిత చెప్పారు.
సింగరేణి కాలరీస్ కంపెనీలో ప్రభుత్వం 1998లో తొలిసారి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించింది. 1998కి ముందు సింగరేణి కాలరీస్ కంపెనీలో సుమారు 78 కార్మిక సంఘాలు తమ కార్యకలాపాలు నిర్వహించేవి. దీంతో ప్రతీ సంఘంతో యాజమాన్యం సంప్రదింపులు జరుపడం ఇబ్బందిగా మారి పారిశ్రామిక సంబంధాలకు విఘాతం కలిగేది. మాటిమాటికి సమ్మెలు జరిగేవి. దీంతో ప్రభుత్వం సింగరేణిలో 1998లో తొలిసారి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించి గెలిచిన సంఘంతో మాత్రమే సంప్రదింపులు జరపాలని నిర్ణయించింది. ఈ క్రమంలో మొదటిసారి 1998లో ఎన్నికలు నిర్వహించగా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) విజయం సాధించింది. అప్పుడు గుర్తింపు కార్మిక సంఘం కాలపరిమితి రెండేళ్లు ఉండేది. అనంతరం 2001లో రెండోసారి జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో మళ్లీ అదే యూనియన్ రెండేళ్ల కాలపరిమితితో గెలుపొందింది. మూడవసారి 2003లో ఎన్నికలు జరగగా మళ్లీ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గెలుపొందగా ప్రభుత్వం అప్పుడు నాలుగేళ్ల కాలపరిమితిని నిర్ణయించింది. అనంతరం 2007లో నాలుగోసారి మళ్లీ అదే సంఘం విజయం సాధించింది. ఈక్రమంలో నాలుగు సార్లు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గుర్తింపు సంఘంగా కొనసాగింది. 2012లో ఐదవ సారి జరిగిన ఎన్నికల్లో టీబీజీకేఎస్ విజయం సాధించింది. అనంతరం 2017లో జరిగిన ఆరవ సారి గుర్తింపు సంఘం ఎన్నికల్లో మళ్లీ టీబీజీకేఎస్ విజయం సాధించింది. ప్రస్తుతం ఏడవ సారి సింగరేణి ఎన్నికల్లో గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి.