ఐనవోలు, అక్టోబర్ 31 : పదేళ్ల క్రితం అన్నమో రామచంద్ర అన్న తెలంగాణ.. బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో దేశానికే అన్నపెట్టేలా మారిందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని గర్మిళ్లపల్లి ఏర్పాటు చేసిన అత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా గ్రామానికి విచ్చేసిన కడియం శ్రీహరికి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడారు. తాను 30 సంవత్సరాలుగా వరంగల్ జిల్లా రాజకీయల్లో ఉన్నానని, స్టేషన్ ఘన్పూర్ నియోవజర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యే, ఒక్కసారి ఎంపీ అయ్యానన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నానని తెలిపారు. కానీ, 30 ఏళ్లలో మీకు సేవ చేసే అవకాశం రాలేదని, నేను ఘన్పూర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు గర్మిళ్లపల్లి వర్ధన్నపేట నియోకవర్గంలో ఉందని తెలిపారు. ఈ గ్రామం స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి వచ్చిన్నపటి నుంచి తాను ఎమ్మెల్యేగా లేనని తెలిపారు. ఇప్పుడు ఒక్క అవకాశం వచ్చిందని, మీకు సేవ చేసుకునేలా ఆశీర్వదించాలని కోరారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు ఈ గ్రామం మీద ప్రేమతో భూమి కొనుగోలు చేసి ఇండ్లు లేని పేదలకు స్థలాలను ఇచ్చి విషయం గుర్తు చేశారు. అలాగే, 300 ఎకరాల భూమిని పేద, నిరుపేదలకు పంపిణీ చేసిన్నట్లు తెలిపారు. మీరంతా అశీర్వదిస్తే గ్రామాన్ని అభివృద్ధిలో నియోజకవర్గంలో మొదటి స్థానం ఉంచేలా కృషి చేస్తానన్నారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ర్టాన్ని ఇవ్వలేదని, కేసీఆర్ నాయకత్వంలో ప్రజానీకం కొట్లాడి సాధించుకున్నారని కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్కు తెలంగాణ ప్రజలపైన ప్రేమ ఉంటే ఎంతో మంది ఎందుకు ప్రాణ త్యాగం చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీనే రాష్ట్రం ఇవ్వకుండా జాప్యం చేసిందన్నారు. అందుకే వందలాది మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారన్నారు. మన బిడ్డల ఆత్మబలిదానాలకు కాంగ్రెస్ నాయకులే సమాధానం చెప్పాలన్నారు. పేద ప్రజలకు లబ్ధి జరితే కాంగ్రెస్ , బీజేపీలు ఓర్చుకుంటలేవని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొనసాగే పథకాలను ఆపాలని ఈసీకి లేఖలు రాస్తున్నట్లు తెలిపారు. ప్రజలే అలోచించి, 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చే బీఆర్ఎస్ కావాలా? 3 గంటల కరెంటు ఇచ్చి కొర్రిలు పెట్టే కాంగ్రెస్ పార్టీ కావాలో తేల్చుకోవాలన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు ఎన్నికలు వచ్చిన్నప్పుడు మాత్రమే గ్రామాలు గుర్తుకు వస్తాయని, ప్రచారానికి వచ్చిన ఆ నాయకులను ప్రజలే నిలదీయాలని కడియం శ్రీహరి అన్నారు. కేసీఆర్ కొత్తగా ప్రవేశపెట్టి మ్యానిఫెస్టోతో అందరికీ లబ్ధి జరుగుతుందన్నారు. గర్మిళ్లపల్లి ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు, ఎంపీపీలు మార్నేని మధుమతి, సుదర్శన్, మార్కెట్ చైర్మన్ రాజు, సొసైటీ చైర్మన్ కరుణాకర్రావు, సర్పంచ్ మల్లికాంబ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జయపాల్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కమిటీ సభ్యులు బ్రహ్మరెడ్డి, వైస్ ఎంపీపీ కనుకయ్య, డైరెక్టర్లు శంకర్, పద్మ, నాయకులు రమేశ్, మల్లేశం, ఎల్వీఆర్, కుమారస్వామి, ప్రేమదాసు, రాజయ్య, ప్రతాప్రెడ్డి, నాగరాజు, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
జఫర్గఢ్ : ప్రజలు ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపిస్తే గ్రామాల అభివృద్ధే ఎజెండాగా పని చేస్తానని బీఆర్ఎస్ స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని కూనూరు, రఘునాథపల్లి, ఉప్పుగల్లు, తమ్మడపల్లి(ఐ), తిమ్మంపేట గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన పార్టీ గ్రామస్థాయి విస్తృత సమావేశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కడియం శ్రీహరి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ స్టేషన్ ఘన్ఫూర్ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా తనకు అవకాశం ఇచ్చారని, ప్రజలు ఆదరిస్తే ఎమ్మెల్యేగా సేవలందిస్తానని అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న బీఆర్ఎస్ పాలనపై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీకి ప్రజలు గుణపాఠం చెప్పాలని కడియం శ్రీహరి కోరారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడం లేదో నిలదీయాలని ఆయన ప్రజలను కోరారు. కాగా, బీఆర్ఎస్ విస్తృత స్ధాయి సమావేశాలకు హాజరైన ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరికి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు.