స్టేషన్ఘన్పూర్, డిసెంబర్ 23 : కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి మతఘర్షణలతో రాజకీయ పబ్బం గడుపుకునేందుకు యత్నిస్తున్న బీజేపీ ఆగడాలను అడ్డుకునేందుకే సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్ పార్టీగా మార్చారని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ను విస్తరించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. శుక్రవారం మండలంలోని శివునిపల్లి కేఆర్ గార్డెన్లో నియోజకవర్గంలోని వివిధ మండలాల్లోని చర్చిలకు కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.7.80 లక్షలు వెచ్చించి 156 సౌండ్ సిస్టంలను అందజేశారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కులాల మధ్య చిచ్చుపెడుతూ పలు రాష్ర్టాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తోందన్నారు. కానీ, తెలంగాణలో కులాలు, మతాల మధ్య ఎలాంటి గొడవలు లేకుండా ఎవరి ఆచారాలను వారు కొనసాగించుకునేలా ఇక్కడి ప్రభుత్వం సహకరిస్తున్నదన్నారు. అన్ని వర్గాల్లో నిరుపేద ప్రజలు ఉన్నారని, వారందరూ సంతోషంగా పండుగలను జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆధ్వర్యంలో బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగలను నిర్వహిస్తూ దేశంలోనే తెలంగాణకు కేసీఆర్ ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని కడియం అన్నారు. ఎమిదేళ్లుగా తెలంగాణలో అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు, అభివృద్ధి పనులను చేపడున్న ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం చల్లాగా ఉండేలా ఏసు ప్రభువును ప్రార్థించాలని పాస్టర్లను కడియం కోరారు.
రాజకీయ జీవితం సంతృప్తిని ఇచ్చింది
ముఖ్యమంత్రుల సహకారంతో ఈ నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి తనకు సంతృప్తిని ఇచ్చిందని కడియం శ్రీహరి అన్నారు. లాక్ డౌన్ సమయంలో కడియం ఫౌండేషన్ ద్వారా వివిధ వర్గాల ప్రజలతోపాటు పాస్టర్లకు బియ్యం, వంట సరుకులు అందించినట్లు తెలిపారు. అలాగే, 200 మంది పాస్టర్లకు 2వేల విలువైన రిఫరెన్స్ బైబిళ్లను అందించినట్లు చెప్పారు. ప్రస్తుతం 156 చర్చిలకు రూ.10 వేల విలువైన సౌండ్ సిస్టంలను 50 శాతం చర్చి ఫాదర్ల సహకారంతో అందించినట్లు తెలిపారు. సమావేశం అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి, పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, కడియం శ్రీహరిని పాస్టర్లు శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పాస్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మారపాక బాలస్వామి, పాస్టర్ దేవవరం, జనగామ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవెళ్లి కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు బెలిదె వెంకన్న, చింతకుంట్ల నరెందర్ రెడ్డి, రాజేశ్ నాయక్, రైతు బంధు సమితి సభ్యుడు రాంబాబు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పోగుల సారంగపాణి, మామిడాల లింగారెడ్డి, పెసరు రమేశ్, ఎంపీటీసీలు బూర్ల లతాశంకర్, రజాక్ యాదవ్, సర్పంచ్లు నాగరబోయిన మణెమ్మ యాదగిరి, అనుమాల మల్లేశం, ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు నీల గట్టయ్య, రైతు బంధు సమితి సభ్యుడు రాపోలు మధుసూదన్రెడ్డి, మాజీ జడ్పీటీసీ స్వామి నాయక్, ఎడ్ల వెంకటస్వామి పాల్గొన్నారు.