Vande Mataram : వందేమాతరం గేయంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ వివాదం కొనసాగుతోంది. వందేమాతరంలోని రెండు చరణాలు మాత్రమే పాడుతామని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకోవడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. కాంగ్రెస్ నిర్ణయం దేశ వ్యతిరేక చర్య అని, ఆ పార్టీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. వందేమాతరం గేయంలోని ఆరు చరణాలు పాడాలి అంటూ కేంద్రం చట్టం చేసిన సంగతి తెలిసిందే.
అయితే, దీనిపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. వందేమాతరం గేయం విషయంలో 1937లో అప్పటి కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం.. స్వంతంత్య్రోద్యమం సమయంలో వందేమాతరంలోని రెండు గేయాల్ని మాత్రమే పాడాలని అప్పట్లో మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్భాయ్ వంటి లీడర్లు నిర్ణయం తీసుకున్నారు. 1937 నుంచి దీన్నే అనుసరిస్తు్న్నారు. దీంతో తాము అప్పటి నిర్ణయానికి అనుగుణంగా గేయంలోని రెండు చరణాలను మాత్రమే పాడుతామని కాంగ్రెస్ తేల్చి చెప్పింది.
కేంద్రం చట్టం చేసినట్లుగా ఆరు చరణాలు పాడబోమని స్పష్టం చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ నిర్ణయంపై తాజాగా అమిత్ షా మీడియాతో మాట్లాడారు. వందేమాతరం గేయంలోని ఆరు చరణాలు పాడాలి అంటూ పార్లమెంట్ చేసిన చట్టాన్ని కాంగ్రెస్ అవమానించిందన్నారు. కాంగ్రెస్ చేస్తున్న ఈ బుజ్జగింపు రాజకీయాలకు అతీతంగా అందరూ గళమెత్తాలని అమిత్ షా పిలుపునిచ్చారు. రాహుల్ నాయకత్వంలో ఆ పార్టీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ నిర్ణయంపై బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీ, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా మండిపడ్డారు.
జాతీయ గేయాన్ని కాంగ్రెస్ అగౌరవపరుస్తోందని, ఇది స్వతంత్రం కోసం పోరాడిన వారి త్యాగాల్ని అవమానించడమే అని వారు వ్యాఖ్యానించారు. అయితే, బీజేపీ విమర్శలపై కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. స్వతంత్రోద్యమంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ పాత్ర ఏంటని కాంగ్రెస్ ఎంపీ పవన్ ఖేరా ప్రశ్నించారు. జాతీయ నాయకుల్ని బీజేపీ అవమానిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ నిర్ణయాన్ని విమర్శించడమంటే రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాస్ చంద్రబోస్, నెహ్రూ, పటేల్ వంటి నేతల్ని అవమానించడమే అన్నారు.