కరీమాబాద్, మే 26: అన్నమో రామచంద్ర అన్న స్థాయి నుంచి.. నేడు దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని, బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే రాష్ర్టానికి శ్రీరామరక్ష అని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో శుక్రవారం రంగశాయిపేటలో 40, 41, 42 డివిజన్ల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కడియం హాజరై మాట్లాడారు. మానవతా దృక్పథంతో సీఎం కేసీఆర్ ప్రతి కుటుంబానికీ చేయూతనందిస్తున్నారని తెలిపారు. దేశంలోని మిగతా రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణ 40 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నదని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం సాకారం కాకముందు పరిస్థితులు.. వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో పరిస్థితులను ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. వాటిని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని కడియం శ్రీహరి అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ అందుతున్నాయని ఎమ్మెల్సీ కడియం అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు పారదర్శకంగా అందుతున్నాయన్నారు. రూ. 2016 ఆసరా పింఛన్, 24 గంటల విద్యుత్, ఇంటింటికీ తాగునీరు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి.. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు తెలంగాణలో అమలవుతున్నట్లు వివరించారు. ‘50 ఏండ్లకు పైగా అధికారంతో ఉన్న కాంగ్రెస్ అప్పుడు ఏం చేయలేదు. ఇప్పుడు చేస్తదట. బీజేపీ 30 ఏళ్లుగా పాలించిన గుజరాత్లో ఇలాంటి పథకాలు లేవు. ప్రజలు కాంగ్రెస్, బీజేపీ నాయకులను ప్రశ్నించాలి’ అని శ్రీహరి కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో ప్రతిపక్షాలకు పని లేకుండా పోయిందన్నారు. వరంగల్ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ అండగా ఉన్నారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా వరంగల్లో 24 అంతస్తుల దవాఖాన నిర్మిస్తున్నారని గుర్తుచేశారు. నూతన కలెక్టరేట్, కొత్త బస్స్టేషన్ నిర్మాణం కానున్నాయన్నారు. తెలంగాణలో బీజేపీకి మూడో స్థానమేనని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీని పాతాళంలో తొక్కే బాధ్యత ఆ పార్టీ నాయకులదే అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి రానుందని ధీమా వ్యక్తం చేశారు.
కలిసి పనిచేద్దాం.. గెలుపు మనదే అని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. అన్ని కులాలు ఆత్మగౌరవంతో బతికేలా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందన్నారు. రాష్ట్రంలో కనీవినీఎరుగని రీతిలో అభివృద్ధి జరిగిందన్నారు. నాయకులు, కార్యకర్తలు గల్లా ఎగురవేసుకునేలా బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి నాయకుడు రావడం మన అదృష్టమన్నారు. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ బడుగు బలహీన వర్గాలతోపాటు అన్ని వర్గాలకు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. మంత్రి కేటీఆర్ చొరవతో రాజధానిలో ఐటీ రంగం దూసుకుపోతున్నదన్నారు. తొమ్మిదేళ్లలో దేశంలో ఏ రాష్ట్రంలో జరుగని విధంగా తెలంగాణ అభివృద్ధి సాధించిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ మనమంతా బీఆర్ఎస్ను మరోసారి గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.
తూర్పు నియోజకవర్గంలోని కార్యకర్తల సంక్షేమానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటూ అర్హులకు సంక్షేమ పథకాలు అందిస్తానన్నారు. రాష్ర్టాన్ని సాధించిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి రాజీపడకుండా రాష్ట్రంలో అమలు చేస్తున్నారని కొనియాడారు. అందరి కృషితో కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఖిలావరంగల్ పీఏసీఎస్ చైర్మన్ కేడల జనార్దన్, కార్పొరేటర్లు మరుపల్ల రవి, పోశాల పద్మ, సిద్దం రాజు, డివిజన్ అధ్యక్షులు పూజారి విజయ్, ఈదుల రమేశ్, కర్ర కుమార్ మాజీ కార్పొరేటర్లు కేడల పద్మ, కొంతం తార నాగపురి కల్పన, బైరబోయిన దామోదర్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.