కడియం శ్రీహరి అవకాశ వాది అని, ఆయనది నీచ చరిత్ర అని దాస్యం మండిపడ్డారు. నైతికత, నీతి, నిజాయితీ ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 31న నిర్వహించనున్న వరంగల్ పార్లమెంటరీ సమావేశం గురించి చర్చించేందుకు గురువారం సాయంత్రం కడియం నివాసానికి వెళ్లినప్పుడు కూడా పార్టీ మారే విష యం చెప్పలేదన్నారు. ఆ తర్వాత కడియం కావ్య వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తప్పుకుంటున్నట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు పంపిన లేఖ వాట్సాప్లో చక్కర్లు కొట్టడం చూసి ఆశ్చర్య పోయానని తెలిపారు. కడియం టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేసి అనేక పదవులు అనుభవించారని గుర్తుచేశారు.
ఎదుగుతున్న దళిత నాయకులపై కుట్రలు చేసి, చాడీలు చెప్పిన నీచమైన చరిత్ర ఆయనదని విమర్శించారు. శ్రీహరిని కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ కోసం తానూ, కేటీఆర్, పెద్ది నిస్వార్థంతో పార్టీలోకి ఆహ్వానించామన్నారు. బీఆర్ఎస్లోకి రాగానే విజయరామారావు, రాగమళ్ల పరమేశ్వర్, దొమ్మాటి సాంబయ్య, పసునూరి దయాకర్, అరూరి రమేశ్లు కడియం రాజకీయానికి బలైపోయారన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను కాదని కడియంకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే కాంగ్రెస్తో కుమ్మక్కై, ప్యాకేజీలు మాట్లాడుకొని బీఆర్ఎస్కు ద్రోహం చేశాడని మండిపడ్డారు.
‘నీతి, నిజాయితీ అని బ్లాక్ మెయిల్ చేసి నీ బిడ్డ కోసం వరంగల్ ఎంపీ టికెట్ సాధించావు.. నీ మీద, కావ్య అభ్యర్థిత్వంపై ఉద్యమకారులు, దళిత సంఘాలు వ్యతిరేకించినా వారిని ఒప్పిం చాం.. కానీ, రాత్రికి రాత్రే కాంగ్రెస్తో ప్రత్యేక ప్యాకేజీ మాట్లాడుకొని నువ్వూ, నీ బిడ్డ ఓ లేఖను విడుదల చేయడం సిగ్గుచేటు.. నీ సినియార్టీని గౌరవించిన కేసీఆర్ డిప్యూటీ సీఎం పదవి ఇస్తే ఇంతటి దిగజారుడు రాజకీయం చేస్తావా” అని ప్రశ్నించారు. కడియం శ్రీహరి లాంటి నీచమైన చరిత్ర ఉన్న నాయకుడిని తాను ఎన్నడూ చూడలేదన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన శ్రీహరి వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్లోకి వచ్చి అన్ని పదవులు అనుభవించిన శ్రీహరి దిగజారుడు రాజకీయం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్లో నెల రోజులుగా జరుగుతున్న పరిణామాలకు శ్రీహరే బాధ్యుడన్నారు. ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు కూడా ఇన్ని పదవులు అనుభవించలేదన్నారు. గులాబీ వనం లో చీడపురుగులా కడియం మారాడాన్నారు.
ఉద్యమ కాలమంతా టీడీపీలో ఉండి త ర్వాత బీఆర్ఎస్లో చేరిన కడియంకు కేసీఆర్ ఎంపీ పదవి, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ పద వి ఇచ్చారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ చరిత్రలో కడియం ఏనాడూ పదవి లేకుండా లేరన్నారు. ఇన్ని పదవులు అనుభవించేందుకు ఎందరో దళిత, ఉద్యమ నాయకులు త్యాగాలు చేశారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రేపటి నుంచి కాంగ్రెస్లో కూడా ఇద్దరిని కలువనియ్యరని గుర్తుచేశారు. రేపు స్టేషన్ఘన్పుర్లో నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం పెడుతున్నామని, కార్యకర్తలు అందరు కేసీఆర్ వెంటే ఉన్నారని పెద్ది అన్నారు.
దళితద్రోహి కడియం పార్టీ మారితే బీఆర్ఎస్కు జరిగే నష్టం ఏమీ లేదని జడ్పీ చైర్మన్ సుధీర్కుమార్ అన్నారు. రేవంత్రెడ్డిపై శ్రీహరి అసెంబ్లీలో మాట్లాడిన నీతి మాటలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. దళితులను ఎదగకుండా హింసించిన చరిత్ర కడియంది అని అన్నారు. దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణను అభాసుపాలు చేసేందుకు దుష్ట శక్తులన్నీ ఏకమవుతున్నాయన్నారు.
తెలంగాణకు బీఆర్ఎస్సే శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. అనంతరం మైనార్టీ నేత నయీమొద్దీన్ ఆధ్వర్యంలో కడియం దిష్టిబొమ్మను దహనం చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపునేని నరేందర్, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి, సుందర్రాజ్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు, ఉద్యమ నాయకులు జోరిక రమేశ్, వీరేందర్, బండి రజిని, నాయకులు పులి రజినీకాంత్, రవీందర్రావు, పరశురాములు పాల్గొన్నారు.