అందరూ కలిసికట్టుగా పని చేయాలి
గ్రూప్ రాజకీయాలను సహించేదిలేదు
ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య
ఐదు వేల ఇండ్ల మంజూరుకు కృషి
దళితులందరికీ దళిత బంధు
జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్
ములుగు, మే 20 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో టీఆర్ఎస్ బలోపేతానికి అందరూ కష్టపడి పనిచేయాలని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అధ్యక్షతన శుక్రవారం వెంకటాపూర్ మండలకేంద్రంలో జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్ష, కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన సారయ్య మాట్లాడారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రతి కార్యకర్త గులాబీ జెండాకింద పనిచేయాలన్నారు. రాబోయే ఎన్నికల్లో ములుగు నియోజకవర్గంలో అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టినా కష్టపడి పని చేసి గెలిపించుకోవాలన్నారు. గ్రూప్ రాజకీయాలకు పాల్పడుతూ తనకే ఎమ్మెల్యే టికెట్ వస్తుందని బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. కార్యకర్తల సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.
సీఎం కేసీఆర్, కేటీఆర్ తర్వాత జిల్లాకు నియోజకవర్గ ఇన్చార్జి జిల్లా అధ్యక్షుడి నిర్ణయమే పార్టీలో కీలకంగా ఉంటుందని అన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ మాట్లాడుతూ జిల్లాలో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వారు అధికంగా ఉన్నారని, వారందరికీ రాబోయే రోజుల్లో ఐదు వేల డబుల్ బెడ్రూం ఇండ్ల మంజూరుకు కృషి చేస్తానన్నారు. సీఎం కేసీఆర్ ములుగు జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారని, ప్రజల అవసరాలను గుర్తించి వారికి ఇండ్లను త్వరలో అందించనున్నారని తెలిపారు. కార్యకర్తలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ములుగు గడ్డపై గులాబీ జెండా ఎగురవేసేందుకు కృషి చేయాలని కోరారు. దళిత బంధు పథకం సైతం దళితులందరికీ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పోడు భూముల సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో పార్టీ మండల అధ్యక్షులు బాదం ప్రవీణ్, లింగాల రమణారెడ్డి, సాయికుమార్, వేణు, నూశెట్టి రమేశ్, గడదాసు సునీల్కుమార్, కుడుముల లక్ష్మీనారాయణ, సుబ్బుల సమ్మయ్య, ఎంపీపీ బీ రజిత, జడ్పీటీసీ జీ రుద్రమదేవి, నాయకులు మల్క రమేశ్, గోవింద్నాయక్తో పాటు అన్ని మండలాల కార్యకర్తలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.