వరంగల్ : దళితుల సాధికారిత కోసం సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా మొదటి దఫాలో మంజూరైన 53 దళితబంధు యూనిట్లను ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ గోపితో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గానికి మొదటి విడతగా 100 దళిత బంధు యూనిట్లను సీఎం కేసీఆర్ మంజూరు చేశారన్నారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ దళితుల ఆర్థిక పరిపుష్టి కోసం దళితబంధు పథకాన్ని తీసుకొని వచ్చారని ఆయన పేర్కొన్నారు. రెండో దశలో నియోజకవర్గానికి 1500 మందికి దళిత బంధు యూనిట్లను త్వరలోనే పంపిణీ చేస్తామన్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.