కలహాలు, గ్రూపు రాజకీయాలకు కేరాఫ్ అయిన కాంగ్రెస్లో వర్గపోరు మరోసారి బయటపడింది. ఆదివారం పరకాలలో నిర్వహించిన కాంగ్రెస్ నియోజకవర్గ సమావేశం ఇందుకు వేదికైంది. ‘కొండా వద్దకు వెళ్లే వారు తన దగ్గరికి రావద్ద’oటూ పార్లమెంట్ ఇన్చార్జి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొండా వర్గీయులకు ఆగ్రహం తెప్పించగా, ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పార్టీలో కొండా అనుచరులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ సభావేదిక వైపు దూసుకెళ్లడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శాంతించాలని వేదికపై నుంచి ఎమ్మెల్యేలు చెప్పినా ఎవరూ పట్టించుకోకపోగా, జైకొండా అని నినదించిన కాంగ్రెస్ నేత గజ్జి విష్ణును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోక్సభ అభ్యర్థి గెలుపు కోసం నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం కాస్తా గ్రూప్ వార్తో రసాభాసగా మారి అర్ధాంతరంగా ముగిసింది.
– పరకాల, ఏప్రిల్ 14
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పరకాల శివారులో ఆదివారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం రసాభాసగా మారింది. కాంగ్రెస్ వరంగల్ పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక లలిత కన్వెన్షన్ హాల్లో ఈ సమావేశం ఏర్పాటు చేయగా పాలకుర్తి, వరంగల్ పశ్చిమ, భూపాలపల్లి, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యేలు యశస్వినీరెడ్డి, నాయిని రాజేందర్రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, కడియం శ్రీహరితో పాటు కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్రెడ్డి, అభ్యర్థి కడియం కావ్య హాజరయ్యారు. సమావేశం జరుగుతున్న క్రమంలో రేవూరి ప్రకాశ్రెడ్డి ‘కొండా వద్దకు వెళ్లే పార్టీ శ్రేణులు తన వద్దకు రావద్దు’ అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో అక్కడున్న పలువురు కొండా వర్గీయులు జై కొండా, జిల్లా టైగర్ కొండా మురళి అంటూ సభా వేదిక మీదకు దూసుకెళ్లే ప్రయత్నం చేయగా మరో వర్గం శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సభా వేదికపై నుంచి పలువురు ఎమ్మెల్యేలు శాంతించాలని సూచించినా పెడచెవిన పెట్టారు. కాగా జై కొండా అంటూ నినాదాలు చేసిన గజ్జి విష్ణు అనే నాయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. దీంతో ఆగ్రహించిన విష్ణు వర్గీయులు స్టేషన్ ముందు పోలీసులకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు.
కాంగ్రెస్లో గ్రూప్ వార్ మరోసారి బహిర్గతమవ్వడం చర్చనీయాంశమైంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ వద్ద జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో గ్రూపు రాజకీయాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో కొండా మురళీధర్రావు మీసం తిప్పడం, ఇనుగాల వెంకట్రామ్రెడ్డి తొడ కొట్టడం, ఇరువర్గాల శ్రేణులు నినాదాలు చేయడంతో పరిశీలకులు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో అప్పటి సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. కాగా ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య గెలుపు కోసం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావే శంలో మరోసారి గ్రూప్ వార్ బహిర్గతమైంది. ఇందులో కొండా వర్గీయులైన తమను చిన్నచూపు చూస్తున్నారంటూ పలువురు ఎమ్మెల్యేలు, అభ్యర్థి ముందే నిరసన చేయడంతో సమావేశం కాస్తా గ్రూపు రాజకీయాలకు వేదికగా మారింది.
కాగా పరకాల నియోజకవర్గ సమావేశానికి మంత్రి కొండా సురేఖ హాజరవుతారని నిర్వాహకులు ప్రకటించారు. దీంతో మంత్రి కొండా వర్గీయులు పెద్ద ఎత్తున సమావేశానికి తరలివచ్చారు. తీరా సభకు మంత్రి గైర్హాజరు కావడం, మంత్రిపై ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దూమారం లేపాయి. పరకాల నియోజకవర్గానికి తెలియని రేవూరిని ఎమ్మెల్యేగా గెలిపించేందుకు కొండా దంపతులు అహర్నిశలు కృషి చేశారని, వారి కృషితోనే ఎమ్మెల్యేగా గెలిచి, తీరా గెలిచిన తర్వాత కొండా దంపతుల పట్ల ఇలా వ్యవహరించడం తగదని పలువురు కార్యకర్తలు చర్చించుకున్నారు.
దేవరుప్పుల, ఏప్రిల్ 14: కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల పోరు మరోసారి భగ్గుమంది. జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని అక్షర గార్డెన్లో ఆదివారం కాంగ్రెస్ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డి సమక్షంలో ఇరువర్గాలు గొడవపడ్డాయి. సమావేశంలో దేవరుప్పుల, కామారెడ్డిగూడెం, గొల్లపల్లి, ధర్మాపురం, ధర్మగడ్డ తండాల్లోని బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లో చేరారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు పెద్ది కృష్ణ మూర్తి వర్గానికి చెందిన 30 మంది నాయకులు తమను సమావేశానికి ఎందుకు పిలవలేదని, తమను సంప్రదించకుండా తమ గ్రామాల్లోని వారిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని నిలదీశారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ పెరగడంతో పోలీసులు జోక్యం చేసుకొని పెద్ది అనుచరులు తోటకూర రమేశ్, అనిల్, ప్రకాశ్తో పాటు 15మందిపై కేసు నమోదు చేశారు.