ఖానాపురం, మే 12 : భర్త వేధింపులు భరిం చలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యా ప్రయ త్నం చేసిన రంగాపురం జూనియర్ పంచాయతీ కార్యదర్శి బైరి సోని(31) చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన వరంగల్ జిల్లా ఖానాపురం మండలం రంగాపురంలో శుక్రవారం జరిగింది. నర్సంపేట ఏసీపీ సంపత్రావు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సంపేట పట్టణానికి చెందిన బైరి శ్రీనివాస్-మంజుల దంపతుల కుమార్తె బైరి సోనికి వరంగల్లోని రంగశాయిపేటకు చెందిన రంగు ప్రసాద్తో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఎనిమిదేళ్ల కూతురు శ్లోక ఉంది. కాగా సోని నాలుగేళ్ల క్రితం మండలంలోని రంగాపురం గ్రామ జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగంలో చేరింది.
ఉద్యోగంలో చేరిన నాటి నుంచి భర్త ఆమెపై అనుమానం పెంచుకొని తరచూ వేధిస్తూ చిత్రహింసలకు గురిచేసేవాడు. ఉద్యోగం మానేయాలని పలుమార్లు ఒత్తిడి చేశాడు. అయినప్పటికీ ఉద్యోగం మానేయకపోవడంతో నువ్వు పనిచేసే గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే చనిపోవాలని పదే పదే వేధించేవాడు. ఎంతో కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సంపాదిస్తే తన భర్త ఉద్యోగం మానేయాలని తనను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని తోటి ఉద్యోగులతోనూ పలుమార్లు చెప్పుకొని బాధపడుతుండేది. ఆరేళ్లు సోని దంపతులు నర్సంపేటలోనే ఉండేవారు. కానీ ఆరు నెలల క్రితం ప్రసాద్ తన స్వస్థలం రంగశాయిపేటకు వెళ్లాడు. అప్పటినుంచి సోని తన తల్లిగారింట్లోనే ఉంటున్నది. సోని భర్త తరచూ వచ్చి పోయే ఉండేవాడు.
ఇటీవల సోనీని రంగశాయిపేటలోనే ఉండాలని ఒత్తిడి చేశాడు. రంగశాయిపేట నుంచి విధులకు వెళ్లడం కష్టమవుతుందంటే ఉద్యోగం మానేయాలని అనేవాడు. దీంతో సోని తీవ్ర మానసిక ఒత్తిడిలోకి గురై శుక్రవారం ఉదయం విధులకు వెళ్లిన ఖానాపురం, రాగంపేట పంచాయతీ కార్యదర్శులతో కలిసి కొత్తూరులో స్వచ్ఛ సర్వేక్షణ్పై మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటింటా సర్వే నిర్వహించారు. అనంతరం ఎవరి గ్రామ పంచాయతీ కార్యాలయాలకు వారు వెళ్లిపోయారు. జీపీకి వెళ్లిన అనంతరం సోని బీరువాలో ఉన్న గడ్డిమందును తాగి రాగంపేట జీపీ కార్యదర్శికి ఫోన్చేసి ‘తాను పురుగులమందు తాగాను..’
అని చెప్పి తన స్కూటీపై ఖానాపురం వైపు బయలుదేరి కొత్తూరు శివారులో పడిపోయింది. అప్పటికే రంగాపురం వైపు వెళ్లిన రాగంపేట కార్యదర్శి సోనిని ఇతరుల సాయంతో బైక్పై నర్సంపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ సోని మృతిచెందింది. మృతురాలి తండ్రి శ్రీనివాస్రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని ఏసీపీ తెలిపారు. సోని మరణవార్త తెలుసుకున్న నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆసుపత్రికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి కుటుంబసభ్యులను పరామర్శించారు.
సమ్మెకు సోని మృతికి సంబంధం లేదు : డీపీవో కల్పన
నర్సంపేటకు చెందిన బైరి సోని రంగాపురంలో 2019 ఏప్రిల్ 12 జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా విధుల్లో చేరింది. ఉద్యోగంలో చేరి నాలుగు సంవత్సరాలైంది. మొదట జేపీఎస్ సమ్మెలో పాల్గొంది. జేపీఎస్లు అందరూ విధుల్లో చేరాలని ప్రభుత్వం నోటీసు ఇవ్వడానికి ముందే ఈ నెల 6న తనే స్వయంగా మళ్లీ విధుల్లో చేరింది. ఆమె ఆత్మహత్యకు జేపీఎస్లకు సమ్మెకు ఎలాంటి సంబంధం లేదు.
సోని మృతిపై రాజకీయం
భర్త వేధింపుల తాళలేక ఆత్మహత్య చేసుకున్న జేపీఎస్ సోని మృతిని సమ్మెలో పాల్గొంటున్న జిల్లాలోని వివిధ గ్రామాల జేపీఎస్లు రాజకీయంగా వాడుకుంటున్నారు. సోని మృతదేహాన్ని పోస్ట్మార్టం చేసిన తర్వాత ఇంటికి తీసుకెళ్లే క్రమంలో జేపీఎస్లు అంబులెన్స్కు అడ్డుగా నిలిచి నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు అలాగే ఉండడంతో పోలీసులు సంయమనం పాటించారు. కొన్ని రాజకీయ పార్టీల నాయకులు సైతం అక్కడికి చేరుకుని జేపీఎస్లకు అనుకూలంగా వ్యవహరించారు. కుటుంబ కలహాలతోనే ఆమె మృతి చెందినట్లు స్పష్టమైనప్పటికీ జేపీఎస్లు ఆందోళన చేయడం విడ్డూరం.