నర్సంపేట, మార్చి 16 : కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ర్టానికి నిధులు తేకుండా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అసమర్థుడిగా మిగిలిపోతున్నాడని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. గురువారం కిషన్రెడ్డికి పెద్ది బహిరంగ లేఖ పంపించారు. రాష్ట్రం నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్రెడ్డి బాధ్యతలను మరిచి బీఆర్ఎస్పై చిల్లర విమర్శలకే పరిమితమయ్యారని లేఖలో పేర్కొన్నారు. ఏనాడూ తెలంగాణ ప్రయోజనాల కోసం పని చేయలేదని, తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేయకుండా పారిపోయిన విషయం గుర్తుచేశారు. పక్క రాష్ర్టాలకు కేంద్రం నిధులిస్తుంటే పట్టించుకోవడం లేదు గాని సిగ్గులేకుండా ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారని లేఖలో ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం గోదావరి వరదల సమయంలో రూ. వెయ్యి కోట్ల సహాయం చేయాలని అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.
భారీ వర్షాలతో హైదరాబాద్లో వరదలొస్తే బండిపోతే బండి ఇస్తాం అంటూ డంబాచారాలు పలికారు. అర్థ రూపాయి కూడా సాయం చేయలేదు. తెలంగాణ ప్రభుత్వమే వారిని అదుకుంది. వరంగల్ జిల్లాలో గత ఏడాది జనవరిలో వరగండ్ల వానతో రైతులు తీవ్రంగా నష్టపోతే సీఎం కేసీఆరే ఇన్పుట్ సబ్సిడీని అందించారు. ఎన్నికలు ఉన్న ఐదు రాష్ర్టాలకు కేంద్రం ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి కింద రూ.1,816.16 కోట్లు కేటాయించింది. కానీ తెలంగాణకు రూపాయి ఇవ్వలేదు. తెలంగాణపై బీజేపీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను చూపుతున్నది. మీ చేతగాని తనం తెలంగాణకు శాపంగా మారింది. సీఎం కేసీఆర్ కుటుంబంపై చిల్లర విమర్శలు చేస్తూ నిస్సిగ్గుగా నీచ రాజకీయం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ప్రజల అవసరాలను విస్మరించి ప్రశ్నించిన వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. అధికార వాంఛతో అడ్డదారులు తొక్కుతున్నారని, మీ వికృత రాజకీయ క్రీడలను ప్రజలు గమనిస్తున్నారని, ప్రజలే మీకు సరైన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.