జనగామ చౌరస్తా, డిసెంబర్ 23 : క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రతిఏటా నిరుపేదలకు బట్టలు పంపిణీ చేయాలని కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తూనే మరో వైపు అధికారులను అడ్డుపెట్టుకొని ఓడిపోయిన ఆ పార్టీ జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్రెడ్డితో అధికారిక కార్యక్రమాలను కొనసాగిస్త్తూ ప్రొటోకాల్ను ఉల్లంఘించింది. శనివారం ఉదయం 11 గంటలకు జనగామ నియోజకవర్గ కేంద్రంలోని వడ్లకొండ రోడ్డులో ఉన్న ఎస్సార్ గార్డెన్లో క్రిస్మస్ దుస్తుల పంపిణీ ఉందని మూడు రోజుల క్రితం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డికి సంబంధిత జిల్లా అధికారులు ఆహ్వానం అందించారు. ఆ తర్వాత స్థానిక గాయత్రి గార్డెన్లో కార్యక్రమం ఉంటుందని, ముఖ్య అతిథిగా మంత్రి కొండా సురేఖ హాజరవుతారని ఎమ్మెల్యే పల్లాకు సమాచారం ఇచ్చారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమం పేరిట ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అందులో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొన్నం ప్రభాకర్తో పాటు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి ఫొటోలు మాత్రమే పెట్టి, స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఫొటోను విస్మరించారు. ఎమ్మెల్యే పల్లా లేకుండానే కొమ్మూరి ప్రతాప్రెడ్డి చేతుల మీదుగా జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి ఇస్మాయిల్, డీఆర్డీవో రాంరెడ్డి, ఆర్డీవో మురళీకృష్ణ, తహసీల్దార్ మహిపాల్రెడ్డి తదితరులు కొద్దిమంది లబ్ధిదారులకు దుస్తులు పంపిణీ చేసి వెళ్లిపోయారు. దీనికి నిరసనగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ శివలింగయ్య ఎదుట నిరసన చేపట్టారు. ఆహ్వానం తనకు పంపించి ఏ హోదాలో కొమ్మూరితో మరోచోట కార్యక్రమం నిర్వహిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా చేయమని మీకు స్పష్టమైన ఆదేశాలు ఉంటే తమకు చూపించాలని కలెక్టర్ను చాంబర్లోనే నిలదీశారు.
ఎమ్మెల్యే పల్లాకు, కలెక్టర్కు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు కలెక్టర్ చాంబర్ నుంచి బయటకు వెళ్లాలంటూ ఏసీపీ దేవేందర్రెడ్డి అనడంతో ఎమ్మెల్యే పల్లా వారించారు. మహాలక్ష్మీ పథకం, ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలకు పెంపు కార్యక్రమంతో పాటు క్రిస్మస్ దుస్తుల పంపిణీలో ఇప్పటి వరకు రెండు సార్లు ప్రొటోకాల్ ఉల్లంఘించిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శివలింగయ్యకు ఎమ్మెల్యే పల్లా రాతపూర్వక ఫిర్యాదు చేశారు. అనంతరం పల్లా మీడియాతో మాట్లాడుతూ క్రిస్మస్ సందర్భంగా ప్రభుత్వం పేద ప్రజలకు మాత్రమే దుస్తులు పంపిణీ చేయాలన్నారు. ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరికి అధికారులు వత్తాసు పలికి మంత్రి కొండా సురేఖ వస్తున్నారని తనకు మాయ మాటలు చెప్పారని తెలిపారు. ప్రొటోకాల్ పాటించకుండా పేదలకు అందాల్సిన 950 గిఫ్ట్ ప్యాకెట్లను అధికారులతో కలిసి కాంగ్రెస్ నాయకులు వారి కార్యకర్తలకే పంచుకున్నారని విమర్శించారు. నాతోపాటు కలెక్టరేట్కు వచ్చిన వారంతా కార్యకర్తలు కాదు, ప్రజాప్రతినిధులు. వీరందరికీ అధికారులు ఆహ్వానం అందిస్తేనే వచ్చారు, కానీ మేమెవరం లేకుండానే కార్యక్రమం ముగించారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వాళ్లు పేదలకు కానుకలు ఇవ్వాలనిపిస్తే వారి పార్టీ కార్యాలయం వద్ద ఇచ్చుకోవాలని పేర్కొన్నారు. కలెక్టర్ శివలింగయ్యతో ఆవేదన చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటే పోలీసులు జులుం ప్రదర్శించారన్నా రు. పోలీసులు దొంగలకు సద్దులు మోయొద్దని పల్లా హితవు పలికారు. బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ అని, ఎవరికీ భయపడమన్నా రు. ప్రొటోకాల్ ఉల్లంఘించిన అధికారులపై అసెంబ్లీ స్పీకర్, చీఫ్ సెక్రెటరీకి ఫిర్యాదు చేస్తామని పల్లా తెలిపారు. అనంతరం వడ్లకొండ రోడ్డు మార్గంలోని ఎస్సార్ ఫంక్షన్హాల్లో కలెక్టర్ శివలింగయ్యతో పాటు ఎమ్మెల్యే పల్లా, ఇతర ప్రజాప్రతినిధులు కలిసి క్రిస్మస్ కానుకల పంపిణీలో పాల్గొన్నారు.