వేలేరు, ఫిబ్రవరి 22 : సమ్మక్క-సారలమ్మ తల్లుల దీవెనలతో ఈ ప్రాంతానికి సాగునీరు అందించేందుకు కృషి చేస్తానని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. గురువారం పీచర గ్రామంలోని మినీ మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులకు మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసిన పైపులైన్ పనుల్లో ఒక ప్యాకెజ్ పూర్తయి మండలంలోని కొన్ని ప్రాంతాలకు నీళ్లు కూడా వస్తున్నట్లు పేర్కొన్నారు. కన్నారం నుంచి పీచర గ్రామానికి సాగునీరు వచ్చే పనులను త్వరగా ప్రారంభించాలని అధికారులను కోరినట్లు తెలిపారు. గండి రామారం లిఫ్ట్ పనులకు ఉత్తర్వులు వచ్చినట్లు చెప్పారు. ఈ ప్రాంత కరువును పారదోలేందదుకు అందరు సహకరించాలని కోరారు. గతంలో ఈ సమయానికి పశువులు దాగేందుకు కూడా నీళ్లు ఉండేవి కావని, ఇప్పుడు రెండు, మూడు పంటలకు సరిపోయే సాగునీరు అందుతున్నదని హర్షం వ్యక్తం చేశారు. సోడాషపల్లి క్రాసు వద్ద పైపులైన్కు ప్రత్యేక పూజలు చేశారు.
మండలంలోని పీచర మినీ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గురువారం తల్లులను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. కార్యక్రమంలో ఎంపీపీ కేశిరెడ్డి సమ్మిరెడ్డి, జడ్పీటీసీ చాడ సరితారెడ్డి, వైస్ ఎంపీపీ సంపత్, కో ఆప్షన్ సభ్యుడు జానీ, జాతర కమిటీ చైర్మన్ కొయ్యడ మహేందర్, మండలాధ్యక్షుడు నర్సింగరావు, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ రాంగోపాల్రెడ్డి పాల్గొన్నారు.