హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 10: తనను ఎమ్మెల్యేగా గెలిపించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా హనుమకొండ వచ్చిన సందర్భంగా ఆయనకు ఘనస్వాగతం పలికారు. డీజిల్కాలనీ నుంచి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఫాతిమానగర్లోని మదర్ థెరిస్సా విగ్రహానికి, కలెక్టర్ బంగ్లా వద్ద ఉన్న కీర్తి స్థూపం, అదాలత్ జంక్షన్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపం, వద్ద ఉన్న కాళోజీ నారాయణరావు కాంస్య విగ్రహానికి, అంబేదర్ సరిల్ వద్ద ఉన్న అంబేదర్ కాంస్య విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానన్నారు. తన గెలుపు కోసం పనిచేసిన ప్రతి ఒకరికీ కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియాగాంధీ రుణం తీర్చుకునేందుకు ప్రజలు కాంగ్రెస్కు అధికారాన్ని ఇచ్చారని, ఇప్పుడు ప్రజల రుణం తీర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని వెల్లడించారు. అందులో భాగంగానే సీఎం రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగానే ఆరు గ్యారెంటీల్లో రెండింటిని అమలులోకి తెచ్చారని అన్నారు. మహిళలు రాష్ట్రంలో ఎకడికైనా ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం, ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ.10లక్షల వరకు పెంచాని తెలిపారు. మిగతా నాలుగు గ్యారెంటీలను త్వరలోనే ప్రభుత్వం అమలులోకి తీసుకువస్తుందన్నారు. కాగా, ర్యాలీగా వచ్చిన ఎమ్మెల్యే నాయినికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. కాంగ్రెస్ నాయకులు గజమాలతో ఘనంగా సత్కరించారు. పుష్పగుచ్ఛాలు అందజేస్తూ, షేక్హ్యాండ్ ఇస్తూ, అభినందనలు తెలిపారు. కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, రజాలీ, పోతుల శ్రీమన్నారాయణ, బంక సంపత్యాదవ్, సరళ, నాయిని లక్ష్మారెడ్డి, ప్రణీత్, కార్యకర్తలు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.
కాజీపేట: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి జిల్లాకు విచ్చేసిన నాయిని రాజేందర్రెడ్డికి డీజిల్ కాలనీ చౌరస్తా, కాజీపేట పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు ఆదివారం ఘనంగా స్వాగతం పలికారు. డీజిల్ కాలనీ చౌరస్తా నుంచి నగరానికి విజయోత్సవ ర్యాలీ పట్టణంలోని ముఖ్య ప్రాంతాల్లో కాంగ్రెస్ శ్రేణులు పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, విజయశ్రీ రజాలీ, మాజీ కార్పొరేటర్లు సుంచు అశోక్, గుంటి కుమారస్వామి, శ్రీనివాస్, అరూరి సాంబయ్య, చిలుకపాటి శివకుమార్, దువ్వ రాజు పాల్గొన్నారు.
వరంగల్ : నగరంలోని ప్రసిద్ధ భద్రకాళీ అమ్మవారిని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా నగరానికి విచ్చేసిన ఆయన ఆదివారం కుటుంబంతో కలిసి ఆయన భద్రకాళీ ఆలయానికి విచ్చేశారు. ఆయనకు ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. తొలుత వల్లభ గణపతిని దర్శించుకున్న ఆయన భద్రకాళీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. నాయిని దంపతులకు ఆలయ మహామండపంలో అర్చకులు మహా ఇచ్చి అమ్మవారి శేషవస్ర్తాలను బహూకరించారు. కాంగ్రెస్ నాయకులు ఈవీ శ్రీనివాస్, ఆలయ ఈవో శేషుభారతి పాల్గొన్నారు.
కాజీపేట: ఫ్లెక్సీల ఏర్పాటు కాంగ్రెస్ పార్టీలో రెండు గ్రూపుల మధ్య ఆదివారం గొడవకు దారితీసింది. పశ్చిమ ఎమ్మెల్యేగా నాయిని రాజేందర్రెడ్డి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా జిల్లాకు వస్తున్న సందర్భంగా కాజీపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఒక గ్రూపు కాజీపేట చౌరస్తా, బాపూజీనగర్, రోడ్డు డివైడర్ మధ్య ఫ్లెక్సీలు పెట్టారు. ఇంకో గ్రూపు వారు తమ ఫ్లెక్సీల ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరినా వినలేదు. దీంతో ఆయా చోట్ల ముందు చేసిన ఫ్లెక్సీలపై మరో గ్రూపు వారు తమ ఫ్లెక్సీలను కట్టారు. ఈ క్రమంలో తమ ఫ్లెక్సీలపై ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించగా రెండు గ్రూపుల నాయకులు వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో కార్యకర్తల మధ్య తోపులాట జరగ్గా ఆప్రాంతం వాతావరణం నెలకొంది.