శాయంపేట, నవంబర్ 20 : ఐదేళ్లలో ఎంతో చేశానని, ఆదరించి మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ భూపాలపల్లి అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శాయంపేట, ఆరెపల్లి, మైలారం గ్రామాల్లో సోమవారం రాత్రి ఎమ్మెల్యే గండ్ర, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతితో కలిసి రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున జనం తరలివచ్చారు. మహిళలు గండ్ర కు మంగళహారతులు పట్టారు. ఈ సందర్భంగా శాయంపేట సెంటర్లో రాత్రి ఆశీర్వాద సభలో పాల్గొని మాట్లాడుతూ చేసిన అభివృద్ధి కళ్ళ ముందు ఉందన్నారు. వెనకే ఉంటూ వెన్నుపోటు పొడిచే కట్టప్పల వ్యవహారం ప్రజలు తేలుస్తారన్నారు. ఏం చేసినా ప్రజా క్షేత్రంలోనే ఉంటామని స్పష్టంచేశారు. పార్టీలు మారాలనుకుంటే ఎన్నడో మారవచ్చని యుద్ధ రంగంలోకి వచ్చాక మారడం ధర్మమా అని ప్రశ్నించారు. కేసీఆర్ నేతృత్వంలో ఎంతో ప్రగతి జరిగిందన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ కరువు, కాకాలతో అల్లాడిపోయిందన్నారు. ఇప్పుడు రైతుల ముఖాల్లో కరెంటుతో వెలుగులు వచ్చాయన్నారు.
శాయంపేటలో రోడ్డు వె డల్పులో ఇండ్లు కోల్పోయిన వారికి అధికారంలోకి రాగానే ఇండ్లు మంజూరు ఇస్తామన్నారు. పద్మశాలీ కులస్తులకు కమ్యూనిటీ భవనం నిర్మిస్తామన్నారు. చేనేత సంఘంలో యువతకు కొత్త సభ్యత్వాలను అందిస్తామన్నారు. ఇవన్ని ఎన్నడో జరిగేవని, కానీ కొందరి స్వార్ధం వల్ల ఆగిపోయాయన్నారు. కాంగ్రెస్ నాయకుడి కి తనపై ఏం చెప్పాలో తెలియక నిరాధార ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. చేనేత రంగానికి కేసీఆర్ సర్కారు అండగా నిలిచి ఆదుకుందన్నారు. సం ఘాల రుణాలను మాఫీ చేసిందన్నారు. రేవంత్రెడ్డి వ్యవసాయానికి మూడు గంటలే కరెంటు ఇ స్తామంటున్నాడని, పొలం పారుతుందా? అని ప్రశ్నించారు. 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోవాలంటున్నాడని, ఎవరు కొనిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక ప్రభుత్వాలు మన విధానాలను అధ్యయనం చేస్తున్నాయన్నారు. గ్రామాలకు అన్ని సౌ కర్యాలు కల్పించినట్లు తెలిపారు. గోదావరి జలాలతో తాగునీరు అందించిన ఘనత కేసీఆర్దేనన్నారు.ఎన్నికల మ్యానిఫెస్టోను అమలుచేసి తీరుతామన్నారు. పనికి ఆహార పథకంలో బియ్యాన్ని బుక్కిన నాయకుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. తనకు సంపద భగవంతుడిచ్చాడని, ప్రజలకు సేవ చేస్తున్నానన్నారు. ట్రస్టు ద్వారా నిరుద్యోగులకు లైసెన్సులు ఇచ్చి ఉపాధి కల్పించామన్నారు.
ప్రజలకు తామిద్దరం సేవకులుగా పనిచేస్తున్నామని వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. సభలో ఆమె మాట్లాడుతూ ఇంకా అవసరమైన సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తామన్నారు. ఎమ్మెల్యే గండ్ర ఇచ్చిన మాట తప్పరన్నారు. శాయంపేటలో డబుల్ రోడ్డును, సెంట్రల్ లైటింగ్ను ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పించామన్నా రు. బంగారు తెలంగాణగా మారుస్తున్న నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. జరుగుతున్న అభివృద్ధిని కొనసాగించాలంటే గండ్ర వెంకటరమణారెడ్డిని మరోసారి గెలిపించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, మారెపల్లి నందం, గట్ల విజయ్పాల్రెడ్డి, గంగుల మనోహర్రెడ్డి, గుర్రం అశోక్, వంగాల నారాయణరెడ్డి, దైనంపెల్లి సుమన్, వలుపదాసు చంద్రమౌళి, దాసరి సమ్మయ్య, దిడ్డి రమేశ్, చిట్టిరెడ్డి రాజిరెడ్డి, ఆకుతోట సమ్మిరెడ్డి, గోలి మహేందర్రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.