గీసుగొండ, జూలై 5: పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి స్థానం లేదని, ప్రజలంతా సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. విశ్వనాథపురం గ్రామానికి చెందిన భూక్యా వెంకన్న, గుగులోత్ కమల్తోపాటు పలువురు కార్యకర్తలు బుధవారం హనుమకొండలోని ధర్మారెడ్డి నివాసంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా చల్లా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికీ బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ప్రజా సంక్షేమ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి మనమంతా అండగా నిలువాలని పిలుపునిచ్చారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ సర్కారు అందిస్తున్నదని కొనియాడారు. రైతులకు 24 గంటల కరెంటుతోపాటు రైతుబంధు, రైతబీమా పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. రాష్ట్రంలో కులమతాలకతీతంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తనూ కంటికిరెప్పలా కాపాడుకుంటానన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వీరగోని రాజ్కుమార్, కార్యదర్శి చల్లా వేణుగోపాల్రెడ్డి, విశ్వనాథపురం సర్పంచ్ అంకతి నాగేశ్వర్రావు, ఊకల్ సొసైటీ వైస్ చైర్మన్ చల్లా కృష్ణారెడ్డి, నాయకులు గుగులోత్ రాజు, తిరుపతి, కొండా రాధ, మచ్చాపురం సర్పంచ్ బోడకుంట్ల ప్రకాశ్ పాల్గొన్నారు.
పేదల సంక్షేమమే సర్కారు ధ్యేయమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గీసుగొండ, సంగెం, ఖిలావరంగల్ మండలాలకు చెందిన ఐదుగురు లబ్ధిదారులకు ఆయన సీఎం ఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్రంలో సీఎంఆర్ఎఫ్ ద్వారా అనేక మందికి మెరుగైన వైద్య సేవలు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు జక్కు మురళి, నమిండ్ల రాజు, నాయకులు పాల్గొన్నారు.