పరకాల, నవంబర్ 27 : అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన అందిస్తున్నారని, ప్రజల మద్దతు బీఆర్ఎస్కే ఉందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తొమ్మిదిన్నరేండ్లలో రూ.5వేల కోట్లతో పరకాల నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులను చేసుకున్నామని పేర్కొన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు నిర్మాణం నియోజకవర్గానికే తలమానికమన్నారు. ఇందులో ప్రత్యక్షంగా లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు, పరోక్షంగా మరెంతో మందికి ఉపాధి లభిస్తుందన్నారు. రెండు కొత్త మండలాలను ఏర్పాటు చేసి ప్రజలకు పాలన చేరువ చేశామని చెప్పారు.
పరకాలను మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసుకుని, పట్టణంలో 100 పడకల దవాఖాన నిర్మిస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ చొరవతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే పరకాలను ముందంజలో నిలిపినట్లు పేర్కొన్నారు. ఇంటింటికి మిషన్ భగీరథ నీటిని అందించి ఏండ్లుగా నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. ఎస్ఆర్ఎస్పీ కాల్వల పునరుద్ధరణ, కోనాయిమాకుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా అదనంగా సుమారు 50వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. కాని విపక్ష నాయకులు అభివృద్ధిని అడ్డుకునే విధంగా వ్యవహరిస్తు అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. విపక్ష నాయకులు ప్రజలను దోచుకోవడానికే వస్తున్నారని, ఆ విషయాన్ని నియోజకవర్గ ప్రజలు గమనించాలన్నారు.
దొంగలు దొంగలు జత కట్టి ప్రజలను మాయమాటలతో మోసం చేయాలని చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చేస్తున్న విమర్శలు అర్థరహితమని పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వెంటే దొంగలందరు ఉన్నారని, వారిని నమ్మి ఓటేస్తే నయవంచనకు గురవుతారని అన్నారు. ‘వాళ్లు ఐదేండ్లకు ఓ సారి వస్తుంటారు. తిరిగి పోతుంటారు. కాని గెలిచినా, ఓడినా పరకాల ప్రజల వెంబడి ఉండేది చల్లా ధర్మారెడ్డి మాత్రమే’నని అన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. గతంలో పరకాలలో ఉన్న గూండాగిరి ప్రస్తుతం లేదని, పదేండ్లుగా ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉందని, మళ్లీ విపక్షాలకు ఓటేస్తే రౌడీరాజ్యం మొదలవుతుందని హెచ్చరించారు. కర్ణాటక రాష్ట్రంలో అమలు కాని గ్యారెంటీలు తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా అమలు చేస్తారని ప్రశ్నించారు. విపక్షాలకు చెందిన అభ్యర్థులు ఓడిపోతామని ముందుగానే ఊహించి మతిభ్రమించి అసహనంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
డిసెంబర్ 3 తర్వాత కాంగ్రెస్, బీజేపీ పార్టీలు గల్లంతు కావడం ఖాయమని ఆయన తెలిపారు. పరకాల ప్రాంత ప్రజలు విజ్ఞులని, వారు మంచీ చెడు ఆలోచించి ఓటు వేస్తారని ఆయన అన్నారు. అభివృద్ధి చేసి బీఆర్ఎస్ను ఆదరించాలని, రాష్ర్టంలో మళ్లీ కేసీఆర్ సీఎం అయితేనే మరిన్ని సంక్షేమ పథకాలు అమలు అవుతాయని, ప్రజలంతా సంతోషంగా ఉంటారని పేర్కొన్నారు. ఈ నెల 30న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని చల్లా ప్రజలను కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మడికొండ శ్రీనివాస్, బండి సారంగపాణి, సోదా రామకృష్ణ, రేవూరి జయపాల్ రెడ్డి, నిప్పాని సత్యనారాయణ, నల్లెల్ల లింగమూర్తి, గుండెబోయిన నాగయ్య, చందుపట్ల తిరుపతి రెడ్డి, మడికొండ సంపత్కుమార్, ఏకు రాజు, పసుల రమేశ్, దగ్గు విజేందర్ రావు, పాలకుర్తి గోపి, అడప రాము, పావుశెట్టి వెంకటేశ్వర్లు, మార్క రఘుపతి, బండి సదానందం, పాడి భగవాన్రెడ్డి, దామె మొగిలి, చందుపట్ల రమణారెడ్డి, శనిగరపు నవీన్, పలువురు నాయకులు పాల్గొన్నారు.