మహబూబాబాద్, అక్టోబర్ 27 : మహబూబాబాద్ జిల్లా కేంద్రాన్ని ఇండస్ట్రియల్ హబ్గా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ను ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ కోరారు. శుక్రవారం శనిగపురం రోడ్డులో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. మానుకోటను ఇప్పటికే ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దారన్నారు. ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు, మెడికల్, నర్సింగ్, హార్టికల్చర్ డిగ్రీ కాలేజీ, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీలను మంజూరు చేసిన సీఎం కేసీఆర్ రుణాన్ని ఇక్కడి ప్రజలు తీర్చుకుంటారన్నారు. సీఎం ఆశీస్సులతో ఈ ప్రాంతం ఇప్పటికే అభివృద్ధి చెందిందని, మరోసారి కేసీఆర్ను సీఎం చేసుకుని మరింత అభివృద్ధి చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఎన్నో ఏళ్లు పోడు పట్టాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు భూమి హక్కు పత్రాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్దేనని అన్నారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించి వారి పాలిట దైవం అయ్యారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు 24 గంటల కరెంట్, తాగు, సాగు నీరు అందిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో ఉన్నడూ లేనంతగా ధాన్యం పండించి దేశానికే అన్నపూర్ణగా మారిందన్నారు. అమ్మానాన్నలు జన్మనిస్తే.. సీఎం కేసీఆర్ తనకు రాజకీయంగా పునర్జన్మనిచ్చారని, ఆయన రుణం తీర్చుకునేందుకు కృషి చేస్తానని వెల్లడించారు.