వర్ధన్నపేట, ఏప్రిల్ 25 : వర్ధన్నపేట నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ సహకారంతో రూ.4,124.67 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టామని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ తెలిపారు. రూ.1,784.60 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేయడంతో పాటు సుమారు రూ.2,369.77 కోట్లను సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అందించామని వివరించారు. బీఆర్ఎస్ 23వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇల్లందలో ప్లీనరీ నిర్వహించారు. ఎమ్మెల్యే డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావుతో కలిసి తొలుత బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అమరవీరుల స్తూపానికి వందనం చేసి సభలో మౌనం పాటించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. మిషన్కాకతీయ, మిషన్భగీరథ వంటి పథకాలతో ప్రజలు, రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. మామునూరు ఎయిర్పోర్టు పునఃప్రారంభం, జక్కిలొద్ది వద్ద మినీ స్టేడియం, కులాల వారీగా కమ్యునిటీ ఆత్మగౌరవ భవనాలను నిర్మించేందుకు కృషి చేస్తానన్నారు. కేవలం 8 సంవత్సరాల్లోనే తెలంగాణను ఎంతో అభివృద్ధి చేసిన కేసీఆర్ లాంటి మహానేత దేశానికి అవసరమని అన్ని రాష్ర్టాల ప్రజలు, మేధావులు కోరుతున్నారని పేర్కొన్నారు. అనంతరం 13 తీర్మానాలను సభలో ప్రవేశపెట్టి ఆమోదించారు. కాగా, ప్లీనరీకి పార్టీ బాధ్యులు, ప్రజాప్రతినిధులు సుమారు 4వేల మంది వరకు హాజరయ్యారు. ప్లీనరీతో వర్ధన్నపేట పట్టణం గులాబీమయంగా మారింది. ఐదు మండలాలకు చెందిన పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరు కావడంతో సభా ప్రాంగణం కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది.
అలరించిన ఆటా-పాటా..
ప్లీనరీలో కళాకారుల ఆటా-పాటలు అలరించాయి. ప్రముఖ రచయిత, నందిఅవార్డు గ్రహీత మిట్టపల్లి సురేందర్, ప్రముఖ గాయకుడు మానుకోట ప్రసాద్, ఇతర కళాకారులు తమ పాటలతో కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. సమావేశంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షురాలు ఎల్లావుల లలితాయాదవ్, కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్రావు, ఎంపీపీలు అన్నమనేని అప్పారావు, మార్నేని మధుమతి, కమల, సునీత, జడ్పీటీసీలు మార్గం భిక్షపతి, సింగూలాల్, మండలాధ్యక్షులు తూళ్ల కుమారస్వామి, రజిని, శంకర్రెడ్డి, వర్ధన్నపేట మున్సిపల్ చైర్పర్సన్ అంగోత్ అరుణ పాల్గొన్నారు.