వర్ధన్నపేట, నవంబర్ 11: నియోజకవర్గంలో పదేండ్లుగా సేవకుడిగా పనిచేస్తున్న తనను మూడోసారి గెలిపించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్ ప్రజలను అభ్యర్థించారు. మండలంలోని నల్లబెల్లికి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జక్కి శ్రీకాంత్, కాంగ్రెస్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు కుమారస్వామి ఆధ్వర్యంలో సుమారు 50 మంది యువకులు, నల్లబెల్లి, ఉప్పరపల్లి గ్రామాలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో శనివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావుతో కలిసి గులాబీ కండువాలు కప్పి స్వాగతించారు. నియోజకవర్గ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే రమేశ్ మాట్లాడుతూ కేసీఆర్ ఆశీర్వాదంతో రెండు సార్లు నియోజకవర్గ ప్రజల సహకారంతో ఎమ్మెల్యేగా పనిచేశానని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో పదేళ్లలో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవలు అందించానని చెప్పారు. కానీ కొందరు ఎన్నికల సమయంలోనే వివిధ పార్టీల్లో చేరి అభ్యర్థులుగా ప్రజల్లోకి వచ్చి కల్లబొల్లి మాటలు చెబుతున్నారన్నారు. వారి చరిత్ర తెలుసుకొని తగిన విధంగా గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు. మూడోసారి కూడా తనకు అవకాశం కల్పిస్తే మీబిడ్డగా మరింత సేవలందిస్తానని అన్నారు. కొత్తగా చేరినవారిని కాపాడుకుంటానని భరోసానిచ్చారు. జడ్పీటీసీ మార్గం భిక్షపతి, మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, వైస్ చైర్మన్ ఎలేందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్ఖన్నా, కౌన్సిలర్ తుమ్మల రవీందర్, పార్టీ ముఖ్య నాయకులు తుమ్మల యాకయ్య, సిలువేరు కుమారస్వామి, పూజారి రఘు, శ్యాంసుందర్రెడ్డి, కస్తూరి అరుణ్ పాల్గొన్నారు.
హసన్పర్తి: గ్యారెంటీ వారెంటీ లేని పథకాలతో వచ్చే కాంగ్రెసోళ్లకు ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ 65 డివిజన్ పరిధిలోని రాజరాజేశ్వరి ఫంక్షన్హాల్లో చుంచు రవీందర్ ఆధ్వర్యంలో ఉమ్మడి హసన్పర్తి మండలానికి చెందిన వెయ్యి మంది కాంగ్రెస్, బీజేపీ నుంచి శనివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి అరూరి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. బీజేపీ 54 డివిజన్ అధ్యక్షుడు వెన్నరెడ్డి జగన్రెడ్డి, బీజేపీ జిల్లా నాయకులు చుంచు ఎల్లయ్య, పోరిక స్వప్నా రాజునాయక్, ఎస్టీ మోర్చా జిల్లా నాయకులు రూప్సింగ్కు కూడా రమేశ్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఏమి చెప్పాలో క్లారిటీ లేని వాళ్లు ప్రజల వద్దకు వస్తున్నారన్నారు. వారి మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని, కాంగ్రెస్కు ఓటు వేస్తే తెలంగాణను అంధకారంగా మారుతుందన్నారు. సీఎం కేసీఆర్ సంక్షేమ, అభివృద్ధి ఫలాలను ప్రతి గడపకూ అందేలా కృషి చేశారని చెప్పారు. రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ లలితాయాదవ్, ఎంపీపీ సునీత జడ్పీటీసీ సునీత, వైస్ ఎంపీపీ బండా రత్నాకర్రెడ్డి, కార్పొరేటర్ దివ్యరాణీ రాజునాయక్, పార్టీ మండల అధ్యక్షుడు రజనీకుమార్, గ్రామ పొలెపెల్లి రాజు మైఖేల్, ఆత్మ డైరెక్టర్ భూపాల్గౌడ్, దేవేంద్ర, మాజీ జడ్పీటీసీ సుభాశ్గౌడ్, పాక్స్ డైరెక్టర్ విజేందర్. రవి, వాసుదేవరెడ్డి, 65 డివిజన్ ఇన్చార్జి కరుణాకర్, రాజు, మార్త, సతీశ్, ధర్మారెడ్డి, రవి పాల్గొన్నారు.
నయీంనగర్: హనుమకొండ ప్రశాంత్నగర్లోని అరూరి రమేశ్ నివాసంలో ముల్కలగూడెం, వంగపహాడ్, హసన్పర్తి గ్రామాలకు చెందిన 300మందికిపైగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేశ్ గులాబీ కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు కావడంతో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని విశ్వసిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ హామీలను నమ్మి మోసపోవద్దన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.