వర్ధన్నపేట, డిసెంబర్ 2 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని కట్య్రాల గ్రామంలో రూ.కోటీ 24 లక్షలతో నిర్మించిన శ్మశానవాటిక, డంపింగ్యార్డు, పల్లెప్రకృతి వనం, సీసీరోడ్లు, ఇతర పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ గుజ్జ సంపత్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్ని ఇబ్బందులున్నా, కేంద్రం సహకరించకపోయినా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు.
గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారన్నారు. అందుకే రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ను ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఎమ్మెల్యేగా నిరంతరం శ్రమిస్తున్నానన్నారు. నియోజకవర్గ ప్రజలు తనపై నమ్మకంతో భారీ మెజార్టీతో రెండుసార్లు గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తున్నానని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కార్యకర్తలకు ప్రభుత్వం తరఫున అవకాశాలు కల్పిస్తూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని హామీ ఇచ్చారు. సమావేశంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, వైస్ ఎంపీపీ చొప్పరి సోమలక్ష్మి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, ఆత్మ చైర్మన్ గుజ్జ గోపాల్రావు తదితరులు పాల్గొన్నారు.