ములుగు : మేడారం( Medaram ) గద్దెల దగ్గర ప్రమాదానికి ముమ్మాటికి మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ బాధ్యత వహించాలని రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీష్ రెడ్డి ( Y Satish Reddy ) డిమాండ్ చేశారు. హన్మకొండలోని హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న మేడాం పూజారి కుమారుడు యువన్ ను ఆయన పరామర్శించారు.
బాలుడి కుటుంబసభ్యులు తమ గోడు చెప్పుకుని కన్నీటి పర్యంతమయ్యారని ఆయన అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో, కాసుల కక్కుర్తితో ప్రమాదం జరిగి పసివాడు కాలును కోల్పోయి, మరో కాలు విరిగిపోయి ఉంటే ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. మంత్రి సీతక్క వచ్చి పరామర్శించి రూ.10 వేలు చేతిలో పెట్టి చేతులు దులుపుకుని పోవడం దుర్మార్గమన్నారు.
వందేళ్లు నిలిచిపోయేలా నిర్మాణాలు చేపడుతున్నామని గప్పాలు చెప్పుకుని, గాలికి ఊడిపోయే నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. కమిషన్లు పంచుకుని, కాసుల కక్కుర్తితో వ్యవహరించిన మంత్రులు బాలుడిని ఆదుకునేందుకు ముందుకు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ తప్పు ఒప్పుకోవాలని, ఆ పసివాడిని చూసి మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు.
బాలుడికి ప్రస్తుతం అయ్యే వైద్య ఖర్చులన్ని ప్రభుత్వమే భరించాలని, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక, అతడి భవిష్యత్ కోసం ప్రభుత్వం కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాలుడి తల్లిదండ్రులిద్దరు చదువుకున్న వారేనని, వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. ప్రతి దానికి సిట్లు, సీబీసీఐడీలు అంటున్న రేవంత్ రెడ్డి మేడారం ఘటనపై సిట్ వేసి నాసి రకం పనులకు సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.