తండోపతండాలుగా తరలివచ్చి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భక్తుల కోసం వనం నుంచి సమ్మక్క జనంలోకి వచ్చింది. అధికార యంత్రాంగం గౌరవ సూచకంగా ఏకే 47 తుపాకీతో కాల్పులు జరిపి స్వాగతించగా వేలాది మంది పోలీసుల రక్షణ వలయంలో చిలుకలగుట్ట నుంచి సమ్మక్క ఉద్విగ్నభరిత వాతావరణంలో తరలివచ్చింది. దారి పొడవునా పసుపు, కుంకుమలతో ముగ్గులు వేసి యాట బలులు, ఎదురుకోళ్లు, ఒడిబియ్యం మొక్కులు చెల్లిస్తూ అశేష భక్తజనం తన్మయత్వంతో ఎదురుచూస్తుండగా ఆదివాసీల నృత్యాల హోరు, శివసత్తుల పూనకాల జోరులో మేడారంలో గద్దెపై కొలువుదీరింది. మహాజాతరలో అత్యంత ప్రధానమైన ఈ ఘట్టం ప్రశాంతంగా ముగియగా మొక్కులు తీర్చేందుకు వస్తున్న వారితో తల్లుల ప్రాంగణం పోటెత్తుతున్నది.
తాడ్వాయి, ఫిబ్రవరి22 : వనం వీడి సమ్మక్క జనంలోకి వచ్చింది. భక్తుల కష్టాలు తీర్చి.. కోరిన కోర్కెలు నెరవేర్చేందుకు మేడారంలో గద్దెపై కొలువుదీరింది. చిలుకలగుట్ట నుంచి తనకు మాత్రమే తెలిసిన రహస్యతావు నుంచి ప్రధాన పూజారి కొక్కెర కిష్టయ్య కుంకుమ భరిణె రూపంలో సమ్మక్కను చేబూని జలకం వడ్డె జలకం చల్లుతుండగా కొమ్మువడ్డెలు వాయిద్యాలు మోగిస్తుండగా మేడారానికి గురువారం రాత్రి తీసుకొచ్చారు. ఇప్పటికే సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు ఉన్న గద్దెలపైకి అమ్మ సమ్మక్క చేరడంతో జాతర పరిపూర్ణమైంది. తల్లి ఆగమనానికి సంకేతంగా ములుగు ఎస్పీ డాక్టర్ పీ శబరీశ్ ఏకే 47గన్తో గాల్లోకి కాల్పులు జరిపి ఆకాశతల్లికి స్వాగతం పలికారు. మంత్రి సీతక్క, కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు ఇతర అధికారులు ప్రభుత్వ ప్రతినిధులుగా అమ్మవారిని ఆహ్వానించారు.
జనరాశిపై జలవడ్డె నీళ్లు చల్లారు. కొమ్ము వడ్డెలు కోయ తల్లికి ఇష్టరాగాలు ఆలపించారు. ఈ అద్భుత దృశ్యాన్ని కళ్లనిండా చూసిన మేడారం ఒళ్లంతా పులకించి పోయిం ది. సమ్మక్క నెలవైన చిలుకలగుట్ట పాదాల వద్ద భక్తకోటి మోకరిల్లింది. జాతర ప్రాంగణంలో వేలాది మంది భక్తజనం సమ్మక్క ముందు సాగిలపడింది. సాయం త్రం 7.11 గంటలకు చిలుకలగుట్ట నుంచి బయలుదేరిన సమ్మక్క రాత్రి 9.22 గంటలకు గద్దెపై కొలువుదీరింది. తల్లి రాక సందర్భంలో దారిపొడవునా కోళ్లు, మేకలు, గొర్లను భక్తులు సమర్పించారు. చెర్నాకోలాలు చేతబూని శివసత్తులు పూనకాలతో హోరెత్తించారు. చిలుకలగుట్ట నుంచి చెలపెయ్య చెట్టు దాకా, అక్కడి నుంచి మేడారం దాకా ఇసుక పోస్తే రాలనంత జనం పోగయింది. ‘సమ్మక్క తల్లికి జై.. మమ్మేలు తల్లీ.. దీవించు తల్లీ’ అంటూ భక్తుల ఘోషతో మేడారమంతా మార్మోగింది.
ములుగు, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ) : ములుగు జిల్లా ఏర్పడిన తర్వాత తొలి ఎస్పీగా డాక్టర్ సంగ్రామ్సింగ్ జీ పాటిల్ 2022 మహాజాతరలో ఏకే 47తో గాల్లోకి తూటాలు పేల్చి అమ్మవారికి స్వాగతం పలికారు. ప్రస్తుత జాతరలో ఎస్పీ డాక్టర్ పీ శబరీశ్ ఏకే 47తో సమ్మక్కను స్వాగతించారు. ఈ ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు ములుగులో తొలి పోస్టింగ్ పొందడంతో పాటు ఇద్దరూ వైద్యవిద్య అభ్యసించిన వారే కావడం విశేషం.
వనదేవతలను దర్శించుకునేందుకు గవర్నర్తో పాటు ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ర్ట మంత్రులు శుక్రవారం రానున్నారు. గవర్నర్ తమిళిసై ఉదయం 10గంటలకు, సీఎం రేవంత్రెడ్డి, రాష్ట్ర మంత్రి పొంగులేటి, కేంద్ర మంత్రి అర్జున్ ముండా మధ్యాహ్నం 12గంటలకు చేరుకోనున్నారు.