మంత్రి సత్యవతి రాథోడ్కొత్తగూడ, నవంబర్ 17: ఎమ్మెల్యే సీతక్క ప్రచార ఆర్భాటం తప్ప ములుగుకు చేసిందేమీ లేదని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం కొత్తగూడ మండలం గుడి తండా, తిమ్మాపురం, గుండంపల్లి, మోకాళ్లపల్లి, ఎంచగూడెం, సాధిరెడ్డిపల్లి, పొగుళ్లపల్లి గ్రామాల్లో ములుగు అభ్యర్థి బడే నాగజ్యోతితో కలిసి మంత్రి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యవతి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు ఆరు గ్యారెంటీల పేరుతో ఓట్లు అడుగుతున్నారని, ఆ పార్టీ గెలుస్తుందనే గ్యారంటీనే లేదన్నారు. ఒకవేళ వారు గెలిచినా కలిసుంటారనే నమ్మకం గానీ, సీఎం అభ్యర్థి ఎవరనే గ్యారంటీ లేదన్నారు. ఎన్నికల్లో నాగజ్యోతి విజయం సాధించగానే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా గోదావరి జలాలను తెప్పించి గంగారం, కొత్తగూడ మండలాలను సస్యశ్యామలం చేస్తానన్నారు.
కేవలం మూడు గంటల్లో ఎకరం భూమి పారుతుందని టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. 24గంటల కరెంట్ కావాలా? మూడు గంటల కరెంట్ కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, నాగజ్యోతిని భారీ మెజార్టీతో గెలిపించి ములుగులో అభివృద్ధి బాటలు వేయాలని సూచించారు. నాగజ్యోతి మాట్లాడుతూ 20 ఏళ్లు రాజకీయంలో ఉన్న సీతక్క తన అత్తగారి ఊరైన మొండ్రాయిగూడెంలో చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని సవాల్ విసిరారు. ప్రచారంలో టీఎస్ రెడ్కో చైర్మన్ సతీశ్రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవింద్నాయక్, ఓడీసీఎంఎస్ వైస్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, దివంగత మంత్రి చందూలాల్ తనయుడు అజ్మీరా ధరంసింగ్, పార్టీ మండల అధ్యక్షుడు కొమ్మనబోయిన వేణు పాల్గొన్నారు.