పోచమ్మమైదాన్, మే 28: మతాలు, మనుషుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే బీజేపీని రానున్న ఎన్నికల్లో ప్రజలు నిలదీయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. వరంగల్లోని 34 డివిజన్ శివనగర్లో తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అధ్యక్షతన ఆదివారం రాత్రి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆమె మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు రాష్ట్రంలో డిపాజిట్లు దక్కే పరిస్థితులు లేవని, మళ్లీ బీఆర్ఎస్ అధికారంలో రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పట్టణాలు, గ్రామాల అభివృద్ధి కోసం రూపాయి ఖర్చు పెట్టని బీజేపీని ప్రజలు తిరస్కరించే రోజులు వచ్చాయన్నారు. ఢిల్లీలో నిర్మించిన నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని దేశంలోని 21 పార్టీలు బహిష్కరించడమే మోదీ పాలనకు నిదర్శనమన్నారు. అలాగే, ఎన్నికల రాగానే ప్రజలకు వద్దకు వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులకు రోజులు దగ్గర పడ్డాయన్నారు. ప్రస్తుతం ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలు పగటి వేషాలు ధరించి వస్తారని, వీరిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతేకాకుండా సొంత లాభాల కోసం పని చేసే నాయకులకు రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
తొమ్మిదేళ్లలో అభివృద్ధి
గత పాలకులు 75 ఏళ్లలో చేయని అభివృద్ధిని సీఎం కేసీఆర్ తెలంగాణలో తొమ్మిదేళ్లలో చేసి చూపించారని మంత్రి సత్యవతి కొనియాడారు. హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైన వరంగల్ను మరింత అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చర్యలు చేపట్టారన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ నాయకత్వంలో రూ. 3,800 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతుండడం విశేషమన్నారు. ప్రత్యేకంగా జిల్లాకేంద్రం ఏర్పాటు కావడం, కలెక్టరేట్, ఆధునిక బస్టాండ్, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయని వివరించారు. అధిష్ఠానం వద్ద ఎమ్మెల్యే నరేందర్ తన పరపతిని ఉపయోగించి ఊహించని విధంగా తూర్పును అభివృద్ధిలోకి తీసుకొస్తున్నారని ప్రశంసించారు. ప్రజల కోసం, ప్రజల మధ్య తిరుగుతున్న నరేందర్ను మరోసారి గెలిపించుకోవాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. సామాన్య మహిళగా ఉన్న తనకు సీఎం కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో గ్రామాలు, పట్టణాల్లో ఆత్మీయ సమ్మేళనాలు విజయవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రజలందరూ ఒకచోట కలిసి సమస్యలు చర్చించుకోవడం, జరిగిన అభివృద్ధి పనులు, చేయాల్సిన పనుల కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి ఆత్మీయ సమ్మేళనాలు ఉపయోగపడుతున్నాయని ఆమె వివరించారు.
నరేందర్ను మరోసారి గెలిపించుకోవాలి
‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే నరేందర్ను డబుల్ మెజార్టీతో గెలిపించుకోవాలి. ఒకప్పుడు బురదమయంలో ఉన్న శివనగర్లో ఈ రోజు ఎంత అభివృద్ధి జరిగిందో మీరు ఊహించుకోండి. శివనగర్కు ప్రత్యేక చరిత్ర ఉంది. నరేందర్ రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుంచే ఆరంభమైంది. కార్పొరేషన్ ఎన్నికల్లో చాలామంది కుట్రలు, కుతంత్రాలు చేసినా, కార్పొరేటర్గా ఆయనను గెలిపించారు. తర్వాత నరేందర్ మేయర్, ఎమ్మెల్యేగా ఎదిగారు. ఆనాడు ఎమ్మెల్యే నరేందర్ను ఓడించేందుకు చేసిన ప్రయత్నాలను శివనగర్ ప్రజలు తిప్పికొట్టారు. అలాగే, మేయర్గా ఉన్నప్పుడు కూడా ఇబ్బందులు పెట్టిండ్రు. అయినా ఆయన ఎదుర్కొని ఎమ్మెల్యేగా గెలిచి అధిక నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీర్చిదిద్దారు. ప్రజల కోసం కష్టపడుతున్న నరేందర్ వెంట ఉండి గెలిపించుకోవాలి’ అని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ పిలుపునిచ్చారు. పట్టుదలతో పని చేస్తున్న నరేందర్ నాయకత్వాన్ని ప్రజలందరూ కోరుతున్నారని, రైల్వేగేట్ బిడ్డగా ఉన్న ఆయనను మరోసారి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
రూ. వంద కోట్లతో శివనగర్ను అభివృద్ధి చేశా..
‘ఎంతో వెనుకబడిన శివనగర్ను రూ.100 కోట్లతో అభివృద్ధి చేశా. ఆనాడు ఉన్న మట్టిరోడ్లు నేడు అందమైన రోడ్లుగా మారాయి. భవిష్యత్లో మరిన్ని అభివృద్ధి పనులు చేసుకోవాల్సి ఉంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కార్పొరేటర్గా, మేయర్గా, ఎమ్మెల్యేగా అవకాశం కల్పించి శివనగర్ ప్రజలు నన్ను మనసారా ఆశీర్వదించారు. తూర్పు నియోజకవర్గంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి’ అని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఇందుకు నిదర్శనంగా వరంగల్ హెల్త్హబ్గా మారడం, అధునాతన బస్టాండ్, నూతన కలెక్టరేట్, గురుకుల పాఠశాలలు, అన్ని డివిజన్లలో రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేశారని చెప్పారు. ఖిలావరంగల్లో ఎన్నో అభివృద్ధి పనులు పూర్తి చేశానన్నారు. అర్హులందరికీ గృహలక్ష్మి, దళితబంధు పథకాలు అందేలా కృషి చేస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో కార్యకర్తలందరూ సైనికుల్లా పని చేయాలని కోరారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనకు పేదల కష్టాలు తెలుసునని, వారి అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పేదల అభ్యున్నతి కృషి చేస్తేనే తనకు సంతృప్తి కలుగుతుందన్నారు. తమ ఇంటి బిడ్డగా ఆదరిస్తున్న శివనగర్తోపాటు నియోజకవర్గ ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
మళ్లీ గెలిపించుకుంటాం..
తూర్పు ఎమ్మెల్యేగా నన్నపునేని నరేందర్ను మరోసారి గెలిపించుకుంటామని శివనగర్ ప్రజలు అన్నారు. ఆత్మీయ సమ్మేళనానికి ఉత్సాహంగా పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు హాజరయ్యారు. కార్పొరేటర్గా, మేయర్గా, ఎమ్మెల్యేగా ఆయన చేస్తున్న అభివృద్ధి పనులు తమను ఎంతగానో ఆకర్షిస్తున్నాయని వారు తమ అభిప్రాయాలను తెలియజేశారు. శివనగర్ ఎంత అభివృద్ధి చెందిందో మాటల్లో చెప్పలేమన్నారు. తామంతా ఎమ్మెల్యేకు, బీఆర్ఎస్ పార్టీకి ఎల్లవేళలా అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఆత్మీయ సమ్మేళనంలో కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి, ఎనుమాముల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ దిడ్డి భాగ్యలక్ష్మి, పలు డివిజన్ల కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.