కమలాపూర్, మార్చి 20: తన ఫోన్ కాల్ను రిక్డార్ చేసి లీక్ చేశారన్న ఆరోపణలతో గత ఆర్డీవోపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి ఫిర్యాదు చేశారు. ‘గత ప్రభుత్వంలో హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ఉంటే అధికార పార్టీ ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి చేతుల మీదుగా కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయించిండ్రు. ఇప్పుడు కౌశిక్రెడ్డి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాదు. మా కాంటెస్ట్ అభ్యర్థి ప్రణవ్ చేతుల మీదుగా, లేదంటే అధికారులే నేరుగా వెళ్లి లబ్ధిదారులకు చెక్కులు అందజేయాలి.
ఒక్క చెక్కు ఎమ్మెల్యే చేతికి పోయినా బాగుండదు ’ అని మంత్రి పొన్నం అప్పటి ఆర్డీవో, కమలాపూర్ తహసీల్దార్ మాధవికి ఆదేశాలు జారీ చేసిన ఆడియో ఐదు రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో తన ఫోన్ కాల్ లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సీఎస్కు మంత్రి ఫిర్యాదు చేశారు. కాగా, జనవరిలో కమలాపూర్ మండలంలోని కన్నూరు పంచాయతీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి ప్రారంభించకుండా మంత్రి అడ్డుకున్నారు.
ఎమ్మెల్యే సంయమనం పాటించి సర్పంచ్ల పదవీ కాలం ముగుస్తుండడంతో కార్యాలయ భవనం ప్రారంభానికి వచ్చానని, ప్రొటోకాల్ ప్రకారం మంత్రులు వస్తానంటే తనకు అభ్యంతరం లేదన్నారు. అనంతరం జనవరి 31లోపు మంత్రులు సమయం తీసుకుని ప్రారంభించాలని, లేదంటే తానే ప్రారంభిస్తానని ఎమ్మెల్యే మీడియా సమావేశం పెట్టి చెప్పారు. మంత్రుల కోసం వేచి చూసినా రాకపోవడంతో ఎమ్మెల్యేనే నూతన భవనాలను ప్రారంభించారు. ఈ సమస్య ముగిసిపోవడంతో ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ తహసీల్దార్, ఆర్డీవోతో మాట్లాడిన ఆడియో లీక్ కావడంతో ఎమ్మెల్యేపై మంత్రి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని మండలంలో చర్చ జరుగుతోంది.