హుస్నాబాద్, జనవరి 26 : రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నాడని, ఆయన విధానాన్ని మార్చుకోవాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన పొన్నం ఆయన లేకుండా అభివృద్ధి పనులు చేయొద్దని ఆదేశాలు జారీ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కరీంనగర్, సిద్దిపేట, హనుమకొండ జిల్లాల్లో తాను లేకుండా అభివృద్ధి పనులు ప్రారంభించొద్దని, శంకుస్థాపనలు చేయొద్దని అధికారులు, అక్కడి ప్రజాప్రతినిధులను ఆదేశించడం ఆయన నియంతృత్వ ధోరణికి నిదర్శనమన్నారు.
మంత్రి తీరు వల్ల ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు విలువలేకుండా పోతోందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో మంత్రి అజమాయిషీ ఎక్కువయిందని విమర్శించారు. ఇటువంటి ధోరణిని మానుకొని హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు. అలాగే హుస్నాబాద్ నియోజకవర్గంలో కొత్త గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం పూర్తయిందని, వీటిని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ల పదవీకాలం ముగుస్తున్నందున వారి హయాంలోనే జీపీ భవనాలు ప్రారంభిస్తే వారు చేసిన సేవలకు గుర్తింపు ఉంటుందన్నారు. ఈ నెల 30వ తేదీలోపు జీపీ భవనాలు ప్రారంభించాలని, లేకుంటే సర్పంచ్లే ప్రారంభించుకుంటారని అన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, వైస్ చైర్పర్సన్ అయిలేని అనితారెడ్డి, ఎంపీపీలు లకావత్ మానస, మాలోత్ లక్ష్మీ, జడ్పీటీసీ భూక్యా మంగ పాల్గొన్నారు.