వరంగల్, మార్చి 6(నమస్తేతెలంగాణ):మంత్రి కేటీఆర్ ఏనుగల్లు పర్యటనను విజయవంతం చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. సోమవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే అరూరి రమేశ్తో కలిసి మంత్రి పర్వతగిరి మండలంలోని ఏనుగల్లులో సభా స్థలి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 8న ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి రామన్న గ్రామంలో మహిళల కోసం ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. గ్రామ పరిధిలోని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఈ నెల 8న పర్వతగిరి మండలంలోని ఏనుగల్లు గ్రామానికి రానున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతిమ ఫౌండేషన్ 8వ తేదీ నుంచి 10 వరకు మహిళల కోసం నిర్వహించనున్న క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరాన్ని బుధవారం ఆయన ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో ఏనుగల్లు గ్రామంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సోమవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఏనుగల్లు గ్రామాన్ని సందర్శించారు. హెలీప్యాడ్, సభా స్థలం, పార్కింగ్ ప్లేస్ ఏర్పాట్లను పరిశీలించారు.
వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్థానికులతోనూ మాట్లాడారు. ప్రతిమ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో జరిగే క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి కోరారు. బోయినపల్లి వినోద్కుమార్ మాట్లాడుతూ.. తాను ఎంపీగా ఉన్న సమయంలో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలు ఏర్పాటు చేసి ప్రాథమిక దశలోనే క్యాన్సర్ను గుర్తించడం ద్వారా అనేక మందిని కాపాడుకోగలిగామని చెప్పారు. తమ తల్లి క్యాన్సర్ బారిన పడి మృతిచెందిందని, ఆ రోజే క్యాన్సర్ నుంచి మహిళలను కాపాడేందుకు శాయశక్తుల కృషి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కలెక్టర్ బీ గోపి, ఈస్ట్జోన్ డీసీపీ కరుణాకర్, డీఆర్డీవో సంపత్రావు, వరంగల్ ఆర్డీవో మహేందర్జీ పాల్గొన్నారు.
మూడు రోజులు వైద్య శిబిరం : బోయినపల్లి వినోద్కుమార్
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల కోసం ఏనుగల్ గ్రామంలో ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ వెల్లడించారు. ఏనుగల్ గ్రామ పరిధిలోని పన్నెండు తండాల మహిళల కోసం ప్రత్యేకంగా ఈ శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిమ ఫౌండేషన్ చైర్మన్ బీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తన స్వగ్రామమైన ఏనుగల్లో నిర్వహించే ఈ శిబిరాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారన్నారు. కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్తో పాటు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు. క్యాన్సర్ నిపుణులతో కూడిన ప్రత్యేక వాహనంలో ఏనుగల్ గ్రామ స్కూల్ ఆవరణలో మూడు రోజుల పాటు క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహిస్తామని తెలిపారు. ఈ శిబిరం నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, దాదాపు ఐదారు వేల మంది కోసం భోజన సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి సోమవారం ఆయన ఏనుగల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరం ఏర్పాట్లను పర్యవేక్షించారు.