ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పర్యటనకు సర్వం సిద్ధమైంది. నాలుగు జిల్లాల్లో రూ.383 కోట్లతో పూర్తయిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి సోమవారం రామన్న రానుండగా పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు అధికారయంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. తొలుత జయశంకర్ భూపాలపల్లిలో రూ.116కోట్లతో అత్యాధునిక హంగులతో సిద్ధమైన సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించి అనంతరం 1100మందికి దళితబంధు, 416మందికి డబుల్బెడ్రూమ్ ఇండ్లు, 4,500మందికి గృహలక్ష్మీ ప్రొసీడింగ్స్ పంపిణీ చేసి నియోజకవర్గ లబ్ధిదారులతో సభలో పాల్గొంటారు. ఆ తర్వాత పరకాల చేరుకొని రూ.114.65 కోట్లతో మున్సిపల్, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలు, మిషన్ భగీరథ ఓఆర్హెచ్ఎస్ ట్యాంకులు, ఇంటర్నల్ పైప్లైన్స్ ప్రారంభోత్సవంతో పాటు పలు శంకుస్థాపనలు చేసి బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం తొర్రూరులో రూ.90.92కోట్లతో మున్సిపల్ ఆఫీస్, మినీ ట్యాంక్బండ్ సహా పలు పనులకు శంకుస్థాపన చేసి పాలకేంద్రం సమీపంలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. చివరగా కొడకండ్లకు వెళ్లి మినీ టెక్స్టైల్ పార్కు నిర్మాణానికి శ్రీకారం చుడతారు. ఈమేరకు ఆయాచోట్ల ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి పరిశీలించి కేటీఆర్ సభలను విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు.
– జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ)/తొర్రూరు/పరకాల
జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ)/తొర్రూరు/పరకాల : ఉమ్మడి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరి 10.15గంటలకు జయశంకర్ భూపాలపల్లి చేరుకొని సమీకృత జిల్లా కార్యాలయ సముదాయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేసిన తర్వాత సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అక్కడినుంచి జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించి, సుభాష్కాలనీలో బహిరంగ సభా స్థలికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1.30గంటలకు భోజనం చేసి 2గంటలకు హెలికాప్టర్ ద్వారా పరకాలకు వెళ్తారు. అక్కడ నూతన మున్సిపాలిటీ భవనానికి చేరుకుని అక్కడే పలు అభివృద్ధి పనులను ప్రారంభించి, నూతన పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
అక్కడి నుంచి స్థానిక పశువుల సంతలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. అటునుంచి సాయంత్రం 4.30 గంటలకు హెలికాప్టర్లో తొర్రూరులోని యతిరాజారావు స్మారక పార్కులోని హెలిప్యాడ్ వద్ద చేరుకుంటారు. ఆర్అండ్బీ గెస్ట్హౌస్ వద్ద తొర్రూరు మున్సిపాలిటీలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం పాలకేంద్రం సమీపంలో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం 6గంటలకు తొర్రూరు నుంచి రోడ్డు మార్గంలో జనగామ జిల్లా కొడకండ్ల మండలకేంద్రానికి చేరుకుని మినీ టెక్స్టైల్ పార్కు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. రామన్న వెంట మంత్రి కేటీఆర్తో పాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననుండగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
అత్యద్భుతంగా పాలనా సౌధాలు
సిద్ధమైన జయశంకర్ జిల్లా కలెక్టరేట్, పోలీస్ భవనాలు
కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు పాలన చేరువ చేసిన సీఎం కేసీఆర్ జిల్లా కేంద్రాల్లో అన్ని కార్యాలయాలు ఒకే చోట ఉండేలా సకల సౌకర్యాలతో భవనాన్ని నిర్మించి ప్రజల వ్యయ ప్రయాసలను దూరం చేశారు. భూపాలపల్లి జిల్లాకేంద్రంలో 33 కార్యాలయాలతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని నిర్మించారు. పోలీస్ శాఖకు సంబంధించిన అన్ని కార్యాలయాలను ఒకేచోటికి తీసుకువచ్చి, అన్ని హంగులతో జిల్లా పోలీస్ కార్యాలయాన్ని నిర్మించారు. నేటి నుంచి ఈ పాలనా సౌధాలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.
33 ఆఫీసులు ఒకే చోట
భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని మంజూర్నగర్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం 17 ఎకరాల్లో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని రూ.59.45 కోట్లతో అన్ని సౌకర్యాలతో నిర్మించింది. అందులో 33 కార్యాలయాలకు అనువుగా గదులను నిర్మించారు. ఇందులోనే జిల్లా ఇన్చార్జి మంత్రికి ప్రత్యేక చాంబర్ కూడా ఏర్పాటు చేశారు. కలెక్టర్ చాంబర్, అడిషనల్ కలెక్టర్ చాంబర్లు రెండు, కలెక్టరేట్ స్టాఫ్ హాల్, వెయిటింగ్ హాళ్లు రెండు, అడ్మిన్ ఆఫీసర్, స్టాఫ్ రూమ్, 25మంది కూర్చునేలా మినీ కాన్ఫరెన్స్ హాల్, 300మంది కూర్చునేలా మీటింగ్ హాల్, ఫ్లోర్కు ఒకటి చొప్పున 50మంది కూర్చునేలా కాన్ఫరెన్స్ హాళ్లు, రికార్డు రూమ్, స్ట్రాంగ్ రూమ్, సెంట్రల్ కోర్టు యార్డు, ఫౌంటేన్తో పాటు ఆయా శాఖల అధికారులకు ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. భవనానికి వెనుక వైపు రెండు హెలిప్యాడ్లను ఏర్పాటుచేశారు.
ఆకట్టుకునేలా జిల్లా పోలీస్ ఆఫీస్
జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయ సమీపంలో 37 ఎకరాల విశాలమైన స్థలంలో ప్రభుత్వం రూ.35కోట్లతో జిల్లా పోలీసు కార్యాలయాన్ని నిర్మించింది. సమీపంలోనే ఏఆర్ కార్యాలయ భవనం, పోలీసు నివాస గృహాలు నిర్మాణంలో ఉన్నాయి. జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ శాఖకు చెందిన అన్ని కార్యాలయాలను ఏర్పాటు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఎస్పీ చాంబర్, పబ్లిక్ గ్రీవెన్స్ హాల్, ఏఎస్పీ క్యాబిన్లను అన్ని రకాల హంగులతో ఏర్పాటు చేసి ఫర్నిచర్ను సమకూర్చారు. రామన్నతో పాటు మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి, స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ పాల్గొంటారు.
పంపిణీకి ‘డబుల్’ ఇండ్లు సిద్ధం
కేటీకే-5 ఇైంక్లెన్ సమీపంలో ప్రభుత్వం రెండో విడుత రూ.22.04కోట్లతో నిర్మించిన 416 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంత్రి కేటీఆర్ నేడు లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. 4,500మంది గృహలక్ష్మి లబ్ధిదారులకు, 1,100 మంది దళితబంధు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసి సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సుభాష్కాలనీ సమీపంలో మినీ స్టేడియం నిర్మాణ స్థలంలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేయగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ భవేశ్మిశ్రా, ఎస్పీ పుల్లా కరుణాకర్ పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. సుమారు 1000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
పరకాలలో రూ.114.65 కోట్లతో అభివృద్ధి
పరకాలలో రూ.114.65 కోట్లతో మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపన చేయనున్నారు. మిషన్ భగీరథలో భాగంగా రూ.38 కోట్లతో నాలుగు ఓహెచ్ఎస్సార్ ట్యాంక్లు, 79 కిలోమీటర్ల మేర ఇంటర్నల్ పైప్ లైన్ను నిర్మించి పట్టణ వ్యాప్తంగా ప్రతి ఇంటికీ నల్లాను ఏర్పాటు చేశారు. రూ.4.8కోట్లతో నూతన మున్సిపాలిటీ భవనం, రూ.2.15కోట్లతో తహసీల్దార్ కార్యాలయ భవనం, 2.8కోట్లతో అధునాతన హంగులతో నిర్మించిన ఆర్డీవో కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించనున్నారు. రూ.21.5కోట్లతో చలివాగుపై నిర్మించనున్న చెక్డ్యాం, రూ.2కోట్లతో ధోబీఘాట్, రూ.13కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవనం, రూ.1.4కోట్లతో ప్రైమరీ హెల్త్ సెంటర్, రూ.29కోట్లతో పరకాల నుంచి దామెర వరకు డబుల్రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. పలువురు లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను అందించనున్నారు.
పరకాలలో 25వేల మందితో సభ
పరకాలలోని పశువుల సంత ఆవరణలో బహిరంగ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించారు. సభా వేదిక, గ్యాలరీ వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. సుమారు 25వేల మందితో సభ నిర్వహిస్తామని, ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్ రావు, మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనితారామకృష్ణ, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మడికొండ శ్రీను, మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి పాల్గొన్నారు.
తొర్రూరుకు రూ.90.92కోట్లతో..
తొర్రూరు, అక్టోబర్ 8 : మంత్రి కేటీఆర్ సోమవారం తొర్రూరులో పర్యటించనున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మిషన్ భగీరథశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి ఆయన పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు మున్సిపాలిటీలో రూ.90.92 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 16 వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వసతుల కోసం స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ రూ.22కోట్లతో, రూ.3.50కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులతో ప్రస్తుత ఆర్అండ్బీ గెస్ట్హౌస్ ఉన్న స్థలంలో నూతన మున్సిపల్ కార్యాలయ భవనం, రూ.14 కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులతో తొర్రూరు పెద్ద చెరువు మినీ ట్యాంక్బండ్, కాల్వల పనులు, తొర్రూరు మున్సిపాలిటీకి అమృత్ పథకం ద్వారా మంజూరైన రూ.27.42కోట్ల నిధులతో చేపట్టనున్న పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం 90.92కోట్ల విలువైన అభివృద్ధి పనులకు తొర్రూరు ఆర్అండ్బీ గెస్ట్హౌస్ వద్ద శంకుస్థాపన చేయనున్నారు. మంత్రి కేటీఆర్ రాక సందర్భంగా తొర్రూరు పట్టణం గులాబీమయమైంది.