జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ)/గణపురం/ : రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గురువారం భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార, పోలీసు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. పర్యటన షెడ్యూల్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గురువారం ఉదయం 9.45 గంటలకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి మంత్రులు కేటీఆర్, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్రావు, జగదీశ్వర్రెడ్డి హెలికాప్టర్ ద్వారా బయల్దేరి ఉదయం 10.30 గంటలకు గణపురం మండలంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అనంతరం గణపురం మండలకేంద్రంలో కొత్తగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని ప్రారంభిస్తారు. 11గంటలకు గణపురం మండలం గాంధీనగర్ వద్ద నూతనంగా నిర్మించిన జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలను ప్రారంభిస్తారు.
అక్కడినుంచి బయల్దేరి 11.45 గంటలకు జిల్లాకేంద్రంలోని మంజూర్నగర్ వద్ద సింగరేణి కార్మికుల కోసం నిర్మించిన వెయ్యి క్వార్టర్ల సముదాయం(రామప్ప కాలనీ)కి ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.15 గంటలకు జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ గెస్ట్హౌజ్ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన దివ్యాంగుల వసతి భవనం(కమ్యూనిటీ సెంటర్) ప్రారంభిస్తారు. 1.15 గంటలకు మున్సిపాలిటీ పరిధిలోని వేశాలపల్లి వద్ద పేదల కోసం ప్రభుత్వం నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.45 గంటలకు మినీ స్టేడియంతో పాటు వీధి వ్యాపారుల సముదాయ భవనాన్ని ప్రారంభిస్తారు. 2గంటలకు గ్రంథాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 2.15 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 2.45 గంటలకు అంబేద్కర్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
సాయంత్రం 5.30 గంటలకు భాస్కరగడ్డ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి హైదరాబాద్కు బయల్దేరతారు. అంతకుముందు బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని కేటీఆర్ ప్రారంభిస్తారు. ఈమేరకు గణపురం, భూపాలపల్లిలో ఏర్పాట్లను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ భవేశ్మిశ్రా సహా అధికారులు పరిశీలించారు. ఏర్పాట్లను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, రాష్ట్ర దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, టీబీజీకేఎస్ అధ్యక్షులు బి.వెంకట్రావు, బీఆర్ఎస్ యువజన రాష్ట్ర నాయకులు గండ్ర గౌతమ్రెడ్డి, జిల్లా కలెక్టర్ భవేశ్మిశ్రా, అదనపు కలెక్టర్ దివాకర, జిల్లా ఎస్పీ జె.సురేందర్రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. వీరి వెంట భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్ధు, కొత్త హరిబాబు, బీఆర్ఎస్ అర్బన్ కమిటీ అధ్యక్షులు జనార్ధన్, ఆర్డీవో శ్రీనివాస్, డీఎస్పీ రాములు, సీఐ రాజిరెడ్డి పరిశీలించారు.
ప్రారంభోత్సవానికి సిద్ధంగా సింగరేణి క్వార్టర్స్
భారీ బందోబస్తు
మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జె.సురేందర్రెడ్డి తెలిపారు. గణపురం, భూపాలపల్లిలోని ప్రతి ప్రాంతాన్ని ఎస్పీ స్వయంగా పరిశీలించి దిశానిర్దేశం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తొమ్మిది మంది డీఎస్పీలు, 20మంది సీఐలు, 81మంది ఎస్సైలు కలిపి మొత్తం 889మంది సిబ్బందిని బందోబస్తు నిర్వహిస్తున్నారు.
అంతా గులాబీమయం..
రామన్న పర్యటనతో గణపురం, భూపాలపల్లి గులాబీమయం అయ్యాయి. రేగొండ, గణపురం మండలకేంద్రాలతో పాటు జిల్లాకేంద్రం వరకు దారి పొడవునా ఫ్లెక్సీలతో నిండిపోయింది. అలాగే జిల్లాకేంద్రమంతా మంత్రి కేటీఆర్ స్వాగత ఫ్లెక్సీలు, బ్యానర్లతో కళకళలాడింది.
చెట్ల కింద సమావేశం అయ్యేటోళ్లం
దివ్యాంగులమైన మేము ఏదైనా అంశంపై చర్చించుకోవడానికి మాకు చోటు ఉండకపోయేది. ఇంతకుముందు చెట్ల కింద, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో సమావేశం అయ్యేటోళ్లం. ఇప్పుడు జిల్లా కేంద్రంలో మా కోసం అన్ని వసతులతో దివ్యాంగుల వసతి భవనాన్ని నిర్మించడం చాలా సంతోషం. సీఎం కేసీఆర్కు, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి, రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు. మేము ఇన్నాళ్లు పడ్డ ఇబ్బందులన్నీ తీరిపోతున్నాయి. సీఎం కేసీఆర్కు, మంత్రి కేటీఆర్కు, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి రుణపడి ఉంటం.
– గుండెబోయిన నీలాంబరం, దివ్యాంగుల మానిటరింగ్ జిల్లా కమిటీ మెంబర్, జయశంకర్ భూపాలపల్లి
కొత్త హాస్టల్లో సౌకర్యాలు బాగున్నయ్..
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గురుకుల విద్యాలయాలు నిరుపేద విద్యార్థులకు వరంగా మారాయి. ప్రభుత్వం ఆధునిక వసతులతో కూడిన పక్కా భవనాలు నిర్మించడం వల్ల విద్యావ్యవస్థ మరింత బలపడుతుంది. మా కూతురు బండి అన్యోన్య మహాత్మా జ్యోతిబా పూలే గాంధీనగర్ ఆశ్రమ గురుకుల పాఠశాలలో ప్రస్తుతం ఐదో తరగతి చదువుతోంది. ప్రభుత్వం మొదట్లో ప్రైవేట్ భవనాల్లో నిర్వహించడం వల్ల అరకొర వసతులు ఉండేవి. విద్యావ్యవస్థను బలోపేతం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం పక్కా భవనాలు నిర్మించడం సంతోషకరం. మా పిల్లలకు ఇప్పుడు మెరుగైన ప్రమాణాలతో కూడిన విద్య అందుతున్నది. అత్యాధునిక సౌకర్యాలు కల్పించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– బండి రమేశ్గౌడ్, విద్యార్థిని అనన్య తండ్రి, రేగొండ